Sunday, October 6, 2013

బాధ్యతా రాహిత్యం

తెలంగాణా నోట్‌ ఆమోదం వార్తల తర్వాత కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగిన 
అలజడిని చల్లార్చేందుకు కేంద్రం చొరవ చూపకపోవడం శోచనీయం. వాస్తవానికి ఈ అంశంపై రాజకీయ లెక్కలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన దోషం కాంగ్రెస్‌ది కాగా అందుకు దోహదం చేసిన అవకాశవాదం తెలుగుదేశం, వైసీపీ వంటి పార్టీలది. ఈ విషయంలో రాూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, కేంద్రం మంత్రుల ధోరణి మరింత హాస్యాస్పదంగా ఉంది. ప్రక్రియ అమలయ్యే ఆఖరి ఘట్టం వరకూ అధిష్ఠానానికి అత్యంత విధేయులుగా వ్యవహరించిన వీరే ఇప్పుడు వీరంగం తొక్కుతూ సమైక్య రాగమాలపించడం ప్రజల ఇంగితాన్ని పరిహసిస్తోంది. రాజీనామాలకు సిద్ధమంటూనే ఎడతెగని మల్లగుల్లాలు పడటంలోనే ఈ నేతల నిజ స్వరూపం స్పష్టం. తీర్మానాన్ని ఓడించేందుకే తాము కొనసాగుతున్నామన్న వివరణ ఇస్తూనే వివాదపడటంలో కనిపించేది రాజకీయ భవిష్యత్తు కోసం తాపత్రయం తప్ప ప్రజల పట్ల బాధ్యత కాదు. తెలంగాణా నిర్ణయం తర్వాత ఇతర ప్రాంతాల ప్రజల్లో తలెత్తిన సందేహాలను, సమస్యలనూ పరిష్కరించేందుకు భరోసా కల్పించవలసిన కేంద్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. నోట్‌ తర్వాతనైనా అలాటి నిర్దిష్ట చర్యలు ప్రకటించే బదులు ఉత్తుత్తి హామీలతో సరిపెట్టజూస్తున్నది. సహజంగానే ఇలాటి సందర్భాలలో ప్రజల్లో ఆవేశం, అసహనం పెరుగుతున్నాయి. పాలక పక్షాల నేతలూ అవి పెరిగే ఎత్తుగడలే అనుసరిస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. విశాల ప్రయోజనాల కన్నా వివాదాస్పద సంకుచిత రాజకీయలే వారికి ముఖ్య మవుతున్నాయి. నిన్నటి మా సంపాదకీయంలో వైసీపీ, తెలుగుదేశం వైరం గురించి చేసిన వ్యాఖ్యలకు తగినట్టే ఈ రోజు అనంతపురంలో ప్రత్యక్ష ఘర్షణ పడ్డారు. జగన్‌, చంద్రబాబు పోటాపోటీ నిరాహారదీక్షలు ప్రకటించారు. ఇవన్నీ ఎలా పరిణమిస్తాయో తెలియదుగాని అసలు సమస్యలను దారి తప్పించి అవాంఛనీయ ఘర్షణలకు దారి తీయొచ్చు. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌లోనే వివిధ బృందాలు వివిధ రకాలుగా ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడితో సహా పాలక పార్టీకి చెందిన పలువురిపై ప్రజాగ్రహం వ్యక్తం కావడం యాదృచ్ఛికం కాదు. ఏది ఏమైనా ఈ సమయంలో స్వార్థ రాజకీయ శక్తుల సంకుచిత వ్యూహాలకు బలికాకుండా ప్రజలు అప్రమత్తత వహించాలి. అలాటి వారి ఆట కట్టించాలంటే అనవసరమైన అధికార ప్రధానమైన విన్యాసాలు కట్టిపెట్టి నిజమైన సమస్యలపై చర్చ జరగాలి. అన్ని పార్టీలతో రౌండ్‌ టేబుల్‌ జరగాల్సిన సమయంలో కేంద్ర క్యాబినెట్‌ టేబుల్‌ నోట్‌ అంటూ కొత్త ఉద్రిక్తత రగిలించింది. దీనిపై స్పందన ఏమిటో ప్రత్యక్షంగా అర్థమై ఉండాలి. ఈ తరుణంలో పరిస్థితిని మరింత దిగజార్చేబదులు సిపిఎం సూచించినట్టు అఖిలపక్ష సమావేశం జరిపి అందరి అభిప్రాయాలతో పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఎన్నికల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు చెప్పినందువల్లనే తీసుకున్నట్టు అధికార పక్షం పదే పదే చెబుతున్నది. క్యాబినెట్‌ నోట్‌లోనూ అదే ఉంది. ఆ తర్కం ప్రకారమే అయినా నిర్ణయం అమలు పర్యవసానాలు, పరిష్కారాలపైనా ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. ఏ పార్టీ అయినా పరిపరివిధాల మాట్లాడే బదులు తాము ఏం కోరుకుంటున్నదీ చెప్పడానికి అలాటి వేదిక భూమిక అవుతుంది. ఉత్తరోత్తరా చట్టసభల్లో చర్చకు వచ్చినప్పుడు కూడా ఎవరేమిటో తెలుస్తుంది.

భాషా ప్రవర్ధకులు

 మన రాజకీయ వేత్తల భాషా పరమైన సేవను చెప్పడానికి భాష చాలదనాలి. ఎందుకంటే వారు అనేక అసభ్య పదాలను వాడటం ద్వారా ఆమోదం కల్పిస్తుంటారు. పరస్పర దూషణలో భాగంగా నిత్య నూతనమైన తిట్లను సృష్టిస్తుంటారు. తమ కుంభకోణాలతో అక్రమాలతో అనేక కొత్త పదాలనూ వాడుకలోకి తెస్తుంటారు. ఉదాహరణకు స్కామ్‌, కిక్‌బాక్స్‌, వంటి మాటలకు గతంలో ఇంత ప్రఖ్యాతి వుండేది కాదు. అలాగే తెలంగాణా నోట్‌ సందర్భంగానే టేబుల్‌ నోట్‌ అనే మాట తెలుగువారికి సుపరిచితమైంది. అనిశ్చితి అన్న మాట ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. అంతకు ముందు అసమ్మతి, కబ్జా, భూబకాసురుడు, అక్రమార్కులు వంటి మాటలన్నీ వారి పుణ్యమే!
ఈ దేశంలో ప్రథమ కుటుంబంగా అనధికార హోదా సాగించుకునే సోనియా తనయుడైన రాహుల్‌ గాంధీ కూడా ఈ కోవలో తక్కువ తిన్నాడా? ఆయన మాటలే కాక చేతలు కూడా జోరుగా వుంటాయి. మొదట ప్రొబేషన్‌లో వున్న ప్రధానిగా చాలా కాలేజీలు యూనివర్సిటీలు తిరుగుతూ విద్యార్థులతో కాలక్షేపం చేశారు. ఆ తర్వాత దశలో తాత రాసిన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా పేరుకు తగినట్టే దేశాటన చేశారు. ఎన్నికల పోరాటంలో దూకి వెన్ను విరుచుకున్నారు. అడుగు పెట్టినచోటనల్లా అపజయాలు మూటకట్టుకొచ్చారు. అయితేనేం? ఆయన యువరాజు! ప్రధాని పదవిని మొదట ఆయన తల్లిగారు తర్వాత ఆయన త్యాగం చేశారంటూ నిరంతరం ఊదరగొడుతుంటారు కాంగ్రెస్‌ వందిమాగధులు. సరే ఎవరి భక్తి లేక భుక్తి వారిదని సరిపెట్టుకోవచ్చు. కాని ఆయన మాత్రం అవన్నీ నిజమే అనుకుని రెచ్చిపోవడంతోనే చిక్కు వస్తుంటుంది. ఉదాహరణకు అయిదేళ్ల కిందట పార్లమెంటులో అణు ఒప్పందంపై హోరాహోరీ వాదనలు జరిగినప్పుడు మొదటిసారి అరంగేట్రం చేసిన రాహులుడు ఎవరో కళావతి అనే వితంతు మాత ఆమె పిల్లల కోసం ఈ బిల్లు అవసరమంటూ అదరగొట్టారు. తర్వాత ఆ కళావతికైనా సహాయం అందింది లేదు. అయోధ్య సమస్య, పాకిస్తాన్‌తో సంఘర్షణ తదితర అనేక కీలకాంశాలపై నాలుక పారేసుకున్న యువరాజా వారు తర్వాత వాటిని సవరించుకున్న దాఖలాలైనా లేవు.
ఇక తాజాగా నేరస్థ సభ్యుల అనర్హత ఆర్డినెన్సుపై ఆయన అగ్గినిప్పులే కక్కి అహో అనిపించుకున్నారు. బాగానే వుంది. కాని సర్వాధికార నేతకు దీనిపై జరిగిన చర్చగాని తీసుకుంటున్న చర్యలు గాని తెలియవనుకోవాలా? ఈ బిల్లును చించేయాలని చిందులు తొక్కిన వారు ముందే కాస్త సైగ చేసి వుంటే మన్మోహన్‌జీ అంగుళమైనా అడుగేసేవారా? కాని అంత చప్పగా చెబితే సత్తా ఏం తెలుస్తుంది? ముందు ఆర్డినెన్సు రావాలి. తర్వాత తాను ఆగ్రహించాలి. అప్పుడది వెనక్కుపోవాలి. నిజానికి రాహులుడు బాబాయి సంజరు గాంధీ, నాన్న గారైన రాజీవ్‌ గాంధీ మార్గమే అనుసరిస్తున్నారనుకోవాలి. ఎమర్జెన్సీలో సంజరు గాంధీ ఆంధ్ర ప్రదేశ్‌ పర్యటనకు వచ్చినపుడు పవిత్రమైన పాదరక్షలు మర్చిపోతే రాష్ట్ర నేతలు అతి వినయంగా అందించి వచ్చారని కథలు చెప్పుకున్నారు. ఆయన గారి దుర్మరణంతో రంగ ప్రవేశం చేసిన రాజీవ్‌ గాంధీ నాయకత్వం తొలిదశలో హైదరాబాదు వస్తున్నారని ముఖ్యమంత్రి అంజయ్య ఎంతో అభిమానంగా అట్టహాసంగా విమానాశ్రయానికి వెళితే అందరి సమక్షంలో అవమానించారు. దీనిపై శాసనసభలో సుందరయ్య నాయ కత్వంలో ప్రతిపక్ష సభ్యులందరూ లేచి నిలబడి రాష్ట్ర ప్రజల తరపున మౌన నిరసన తెలిపారు! తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో రాజీవ్‌, సోనియాలు వచ్చినపుడు ఆమె తనను బెదిరించారంటూ ఒక మాజీ ఎంపి గగ్గోలు పెట్టారు. కీర్తిశేషుడైన ఆ ఎంపి తర్వాత ఆ పార్టీలోనే చేరి ఆమెకు విధేయుడుగా మెలగడం మరో విపరీతం. ఏమైతేనేం ఈ పరంపరను రాహుల్‌ గాంధీ జాగ్రత్తగా పాటిస్తున్నారు గనకే అప్పుడప్పుడు అధికార పూర్వకంగా పార్టీ, ప్రభుత్వ పెద్దలపై విరుచుకు పడుతుంటారు. ఈ మధ్య ఆర్డినెన్సు విషయంలో ఆయన వ్యాఖ్యలకు మన్మోహన్‌ సింగ్‌ వంటి మహా విధేయ ప్రధాని కూడా మనసు కష్ట పెట్టుకోవలసి వచ్చిందంటే అవి ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకున్నారు కూడా. అయితే ఈ సందర్భంగా తాను ఉపయోగించిన భాష బాగాలేదని అమ్మ చెప్పిందని తల్లిచాటు కొడుకులా మాట్లాడుతున్న యువరాజు కుటుంబ వరవడికి అద్దం పట్టారని చెప్పాలి. ప్రజాస్వామ్యం పేరుతో రాచరిక పద్ధతులు అమలు జరిగే దేశంలో పరిస్థితులు ఇంతకన్నా భిన్నంగా వుంటాయా?
సరే నరేంద్ర మోడీ గారిది మరో పద్ధతి. ఆయన మనుషుల గురించి మతాల గురించి దేశాల గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. గుజరాత్‌ నరమేధం గురించి అడిగితే కారు కింద కుక్కపిల్లపడి చనిపోతే ఎలాగో అలాగే బాధపడతానన్నారు. ఇది బాగాలేదంటే అందులో కరుణ రసం చూడమని కాళిదాసులా భంగిమ దాల్చారు. ఇప్పుడు దేవాలయాల కన్నా మరుగుదొడ్ల అవసరం చాలా వుందంటూ అపర మానవతా మూర్తిలా సెలవిచ్చారు. ఆలయాల పేరిట అగ్గిరాజేసిన పార్టీ అత్యున్నత నేత ఇలా చెప్పడంలో ఆత్మ వంచన పరవంచన కూడా మాటలకందేవి కావు. ఆకలిగొన్న వాడికి అద్వైతం గాక అన్నం అవసరమని వివేకానందుడు అనడం వేరు. ప్రతిదీ స్థాయి తక్కువ భాషలో ఇష్టానుసారం వాకృచ్చే నరేంద్ర భాషణం వేరు. నిజానికి ఈ దేశంలో మరుగుదొడ్ల కొరత చాలా ఎక్కువగానే వుంది. కాని తమ పార్టీ నిన్నటి అగ్రనేత అద్వానీ గుజరాత్‌లోనే సోమనాథ్‌ నుంచి అయోధ్య పేరుతో రథయాత్ర ప్రారంభించి నప్పుడు మొత్తం నిర్వహణ బాధ్యత చూసిన మోడీకి అప్పుడు ఈ సూక్తి గుర్తురాలేదా? ఇదే మాట మరెవరైనా అని వుంటే మతాన్ని అవమానించారని అఘాయిత్యం చేసేవారు కాదా? నిజానికి మోడిఫికేషన్‌ అన్నమాటను కమోడిఫికేషన్‌ అని చమత్కరించడం సరైందేనని తన మాటలతో బిజెపి'ప్రధాని' నిరూపించుకున్నారు. భాషకు ఇన్ని విధాల సేవలందిస్తున్న ఈ నేతలను ఎన్ని బిరుదులిచ్చి సత్కరించుకుంటే సరిపోతుంది?
(prajasakti 5.10.2013)