Saturday, April 26, 2014

పశ్చిమ బెంగాల్ వామ పక్ష పాలన లో ఫ్యాక్టరీల రంగం లో గుజరాత్ కన్నా చాలా ఎక్కువగా ఉద్యోగాలు వచ్చాయి-ది హిందూ పత్రిక వార్త

నేషనల్ శాంపుల్ సర్వే  సంస్థ తాజాగా ప్రకటించిన గణాంక వివరాల ప్రకారం 2004-2011 మధ్య కాలం లో దేశం లో సృష్టించబడిన ఫ్యాక్టరీ ఉద్యోగాలలో 40 శాతం వామ పక్ష పాలన వున్న పశ్చిమ బెంగాల్ లోనే సృష్టించబడ్డాయి. ఈ కాలం లో దేశం మొత్తంగా 58.7 లక్షల ఉద్యోగాలు ఫ్యాక్టరీ రంగం లో కొత్తగా రాగా అందులో 24 లక్షాల ఉద్యోగాలు పశ్చిమ బెంగాల్ లో వచ్చాయి. పశ్చిమ బెంగాల్ మొదటి స్థానం లో వున్నది.  కాగా తానే అందరికన్నా గొప్ప అని, తన వలన మాత్రమే ఉద్యోగాలు వస్తాయని గొంతు చించుకుని అరుస్తున్న మోడి ముఖ్యమంత్రిగా వున్న గుజరాత్ లో ఈ కాలం  లో కేవలం 14.9 లక్షల ఉద్యోగాలే వచ్చి బెంగాల్ కన్నా చాలా దూరంగా,  రెండవ స్థానం లో వున్నది. మ్యానుఫాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పిస్తానని ప్రచారం చేసుకుంటున్న మోడి కన్నా అతని గుజరాత్ నమూనాకన్నా వామ పక్ష పాలనలో చాలా  అధికముగా ఉద్యోగాలు కల్పించటం జరిగిందని ఈ వాస్తవాలు రుజువు చేస్తున్నాయి. బెంగాల్ లో చిన్న తరహా  పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఫ్యాక్టరీ రంగం లో ఉద్యోగాలు పెద్ద మొత్తం లో సృష్టించగలిగామని వామ పక్ష ప్రభుత్వము లో ఆర్థిక మంత్రిగా పని చేసిన అసిమ్ దాస్ గుప్తా అన్నారు. వామ పక్ష ప్రభుత్వము జ్యోతిబసు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన అనంతరం 1991 నుండి 2011 వరకు 2531 పారిశ్రామిక సంస్థలను కొత్తగా నెలకొల్పటం జరిగింది. (ది హిందూ పత్రిక 26.4.2014 సంచిక లో ప్రచురించిన వార్త ఆధారంగా)


Friday, April 25, 2014

గుజరాత్ అభివృద్ధి నమూనా అసలు స్వరూపం

అభివృద్ధి అంటే జి డి పి (స్థూల జాతీయ ఉత్పత్తి) అభివృద్ధి మాత్రమే కాదు. అభివృద్ధి జరగాల్సింది మనుషులకు. కాబట్టి అభివృద్ధిని గురించి చర్చించేటప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల పై మాత్రమే గాక మానవ అభివృద్ధి పై కూడా చర్చించాలి.

కార్పొరేట్ మీడియా బ్రహ్మాండమని ప్రచారం(మార్కెటింగ్) చేస్తున్న గుజరాత్ నమూనా అభివృద్ధి నిజముగా అంత గొప్పదేమీ  కాదు. మానవ అభివృద్ధికి సంబంధించి అనేక రాష్ట్రాలకన్నా అది వెనక బడి వునండి. జి డి పి అభివృద్ధి రేటులో కూడా అది మొదటి స్థానం లో లేదు. నరేంద్ర మోడి గుజరాత్ లో సాధించినట్లుగా చెప్పబడుతున్న అభివృద్ధి కి సంబంధించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం.

  1. గుజరాత్ కన్నా ఎక్కువ అభివృద్ధిని సాధించిన రాష్ట్రాలున్నాయి: 2004-05 నుండి 2011-12 వరకు గుజరాత్ లో సగటున సంవత్సరానికి 10.08 శాతం అభివృద్ధి జరిగింది. ఇదే కాలములో మహారాష్ట్రలో 10.75 శాతం, తమిళనాడులో 10.27 శాతం, అభివృద్ధి జరిగింది. కాబట్టి గుజరాత్ లో ఎక్కడా లేని స్థాయిలో   అభివృద్ధి జరిగిందనే ప్రచారం వాస్తవం కాదు.
  2. కార్మికుల రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసే క్రూరమయిన అభివృద్ధి నమూనా:  మోడి అభివృద్ధి నమూనా  కార్మికులకు అతి తక్కువ వేతనాలివ్వటం పై, అతి తక్కువ నెలసరి వినిమయ ఖర్చు తో ప్రజలు జీవన యాత్ర సాగించటం పై ఆధారపడిన నమూనా. కార్మికుల రక్త మాంసాలను పీల్చి  పిప్పి చేసే క్రూరమయిన నమూనా. ఇందుకు సంబంధించిన వివరాలు:
i.              లేబర్ బ్యూరో అక్టోబరు 2013 నివేదిక ప్రకారం గుజరాత్ లో వ్యవసాయ కార్మికుల వేతనాలు అఖిల భారత సగటుకన్నా తక్కువ వున్నాయి. అఖిల భారత సగటు కూలి దున్నటానికి రు.230, నాట్లకు రు.186, కలుపుతీతకు రు.178, కోతకు రు. 199 వుండగా గుజరాత్ లో వరుసగా రు. 166, రు. 122, రు.129, రు.136 మాత్రమే వున్నది.
ii.             ఎన్ ఎస్ ఎస్ ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) రిపోర్టు నం. 554 ప్రకారం పట్టణాలలో రెగ్యులర్ కార్మికుల అఖిల భారత సగటు వేతనం పురుషులకు రు. 469.87, మహిళలకు రు.366.15 కాగా గుజరాత్ లో రు.326.34 మరియు రు.271.86 మాత్రమే వున్నది. పట్టణాలలో క్యాజువల్ కార్మికుల  అఖిల భారత సగటు వేతనం  పురుషులకు రు.182.04, మహిళలకు రు.110.62 వుండగా గుజరాత్ లో రు. 160.04, రు.88.84 మాత్రమే  వున్నది.
iii.            NSSO NSS KI (68/1.0) మరియు 458 రిపోర్టుల ప్రకారం రోజుకి రు.40 కన్నా తక్కువ ఖర్చుతో జీవనం సాగిస్తున్నవారు గుజరాత్ లో గ్రామాలలో 40 శాతం వున్నారు. రోజుకి రు.55 కన్నా తక్కువ ఖర్చుతో జీవనం కొనసాగిస్తున్న వారు గుజరాత్ లో పట్టణాలలో 30 శాతం వున్నారు. పట్టణాలలో అఖిల భారత స్థాయిలో తలసరి నెలవారీ వినిమయ ఖర్చు రు. 2477 కాగా గుజరాత్ లో అంతకన్నా  తక్కువగా రు.2472 వున్నది. గ్రామీణ ప్రజల విమయ ఖర్చు లో 17 పెద్ద రాష్ట్రాలలో గుజరాత్ 2000 లో 4వ స్థానములో వుండగా 2012 నాటికి 8వ స్థానానికి దిగజారింది. పట్టణ ప్రాంత ప్రజల వినిమయ ఖర్చులో 2000 లో 7వ స్థానములో వుండగా 2012 నాటికి 9వ స్థానానికి దిగజారింది.
  1. ఉద్యోగిత పెరుగుదల అఖిల భారత స్థాయికన్నా తక్కువ:  తాను ప్రధాన మంత్రి అయితే యువతకి  బ్రహ్మాండమయిన అవకాశాలు కల్పిస్తానని మోడి తన దగ్గర ఏదో మంత్రదండమున్నట్లు కోతలు కొస్తున్నాడు.  కానీ 2001 మరియు 2011 జనాభా లెక్కల నివేదికల ప్రకారం 2001-2011 మధ్య కాలములో కార్మికుల సంఖ్య అఖిల భారత స్థాయిలో 1.2 శాతం పెరగగా  గుజరాత్ లో 0.4 శాతమే పెరిగింది. మహిళా కార్మికుల సంఖ్య  ఈ కాలములో అఖిల భారత స్థాయిలో 1 శాతం పెరగగా గుజరాత్ లో 1 శాతం తగ్గింది! జనాభా పెరుగుదలతో పోలిస్తే 2001-2011 మధ్య కార్మికుల సంఖ్య అఖిల భారత స్థాయిలో 2.1 శాతం పెరిగితే గుజరాత్ లో 2.8 శాతం తగ్గింది.
  2. విద్యపై పెట్టె ఖర్చు అఖిల భారత సగటుకన్నా తక్కువ:  తాను ప్రధానమంత్రి  అయితే విజ్ఞాన వంతమయిన ఆర్థిక వ్యవస్థని(నాలెడ్జ్ ఎకానమీ) ని దేశానికి ప్రసాదిస్తానని మోడి కోతలు కోస్తున్నాడు. కానీ గుజరాత్ లో అతని   ప్రభుత్వము విద్య పై పెట్టె ఖర్చు అఖిలభారత స్థాయికన్నా తక్కువగా వున్నది. రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం విద్య పై దేశం మొత్తముగా అన్నీ రాష్ట్రాలు పెడుతున్న సగటు ఖర్చు అవి పెట్టె మొత్తం ఖర్చులో 14.8 శాతం కాగా గుజరాత్ లో మొత్తం ఖర్చులో 13.2 శాతమే వున్నది. కేంద్ర మానవ వనరుల శాఖ 2010-11 సంవత్సరానికి ప్రకటించిన గణాంకాల ప్రకారం 10 వ తరగతి లోపు డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లలు అఖిల భారత స్థాయిలో 49 శాతం కాగా  గుజరాత్ లో 58 శాతం వున్నది.
  3. ఆరోగ్యం పై పెట్టె ఖర్చు అఖిల భారత సగటు కన్నా తక్కువ: రిజర్వు బ్యాంకు రిపోర్టు ప్రకారం ఆరోగ్యం పై పెట్టె ఖర్చుని ప్రభుత్వము పెట్టె  మొత్తం ఖర్చులో శాతం గా చూస్తే 17 పెద్ద రాష్ట్రాలలో గుజరాత్ 16 వ స్థానం లో వున్నది. అన్నీ రాష్ట్రాలు పెట్టె మొత్తం ఖర్చులో ఆరోగ్యం పై పెట్టె ఖర్చు 4 శాతం కాగా గుజరాత్ లో 3.4 శాతమే వున్నది.
  4. మానవ అభివృద్ధి సూచికలో 12వ స్థానం: ఆనాటి కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్(ప్రస్తుత రిజర్వు బ్యాంకు గవర్నర్)   అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వము నియమించిన కమిటీ,  ప్రజల వినిమయ ఖర్చు మరియు దారిద్ర్యం ఆధారముగా తయారు చేసిన నివేదిక ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో  గుజరాత్ 12వ స్థానం లో వుంది. మొదటి మూడు స్థానాలలో గోవా, కేరళ, తమిళనాడు వున్నాయి.
  5. రైతుల ఆత్మ హత్యలు: ఒక్క 2012 ఆగస్టు-డిసెంబరు కాలములోనే గుజరాత్ లో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
  6. మత కలహాలు: గుజరాత్ లో 2002 లో మోడి వైఖరివలన మత కలహాలు ప్రజ్వరిల్లి  2000 మంది చనిపోయారు. ఇంతటి స్థాయిలో మత కలహాలు జరిగిన పాలన సుపరిపాలన ఎలా అవుతుంది? అయినప్పటికి మోడిది సుపరిపాలన అని కార్పొరేట్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నది. 2002 లో జరిగిన ఘోర హింసాకాండని మర్చి పోవాలని, ఆ తరువాత అక్కడ మత కలహాలు జరగలేదని ప్రచారం జరుగుతున్నది. కానీ వాస్తవం ఏమిటి?  లోక్ సభ లో ప్రభుత్వము 2012 లో ఇచ్చిన సమాచారం ప్రకారం గుజరాత్ లో 2009 నుండి మార్చి 2012 వరకు మత కలహాలకు సంబంధించిన ఘటనలు 181 జరిగాయి. ఈ ఘర్షణలలో 32 మంది చనిపోయారు. ఈ కాలం లో దేశం మొత్తంగా మత కలహాలలో చనిపోయిన వారిలో ఇది 10 శాతం.
  7. కార్పొరేట్సుకు  అడ్డగోలుగా భారీ రాయితీలు
Ø  2003-04 లో మోడి ప్రభుత్వము ఆదాని గ్రూప్ కు ముంద్రా పోర్టు మరియు సెజ్ పేరుతో 6700 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఇందుకోసం రైతుల నుండి విస్తారమయిన భూఖండాలను స్వాధీనం చేసుకుని ఆదాని గ్రూప్ కు అప్పగించింది. చదరపు మీటరుకు సగటున రు.10 చొప్పున ఈ భూమిన ఆదాని లకు ధారాదత్తం చేసింది. ఆదాని గ్రూపు ఆతరువాత ఈ భూమిలో రోడ్లు వేసి డెవలప్ చేసి సబ్-ప్లాట్సు గా  విభజించి ప్రభుత్వ రంగ సంస్థలతో సహా అనేక కంపెనీలకు చదరపు మీటరుకు వేల రూపాయల లెక్కన అమ్మింది. ఈ వ్యవహారములో గుజరాత్ ప్రభుత్వ ఖజానాకి రు.10,000 కోట్ల నష్టం వచ్చిందని అంచనా.
Ø  టాటా గ్రూప్ కు నానో కార్ల ఫ్యాక్టరీని గుజరాత్ లో పెట్టటానికి మోడి ప్రభుత్వము ఇచ్చిన రాయితీల విలువ రు.33,000 కోట్లు.

Ø  సూరత్ లో వున్న నవ్ సారి వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన విలువయిన భూమిని చత్రాల ఇండియా హోటల్ గ్రూప్ కు సెవెన్ స్టార్ హోటల్ అభివృద్ధికి ఇచ్చింది. ఈ భూమి విలువ చదరపు మీటరుకు లక్ష రూపాయిలు వుండగా చత్రాలా గ్రూప్ కు రు.15,000క కే కేటాయించింది.
Ø  లార్సేన్ & టౌబ్రో గ్రూప్ కు సూరత్ లో హాజీరా పారిశ్రామిక ప్రాంతం లో వున్న 8 లక్షల చదరపు మీటర్ల విలువయిన భూమిని వేలముతో పని లేకుండా చదరపు మీటరు రు.1 కి కట్టబెట్టింది.ఈ భూమి మార్కెట్ విలువ చదరపు మీటరు రు.3500 వుంటుందని అంచనా.
ఇటువంటి వ్యవహారాలు అనేకం గుజరాత్ లో జరిగాయి. మోడి పాలన అవినీతికి అతీతమయిన పాలన అని చేసే ప్రచారం లో నిజాయితీ లేదు. కార్పొరేట్సుకు ఇచ్చిన ఈ అక్రమ రాయితీలన్నీ అవినీతిగాక మరేమిటి?

గుజరాత్ అభివృద్ధిలో మొదటి స్థానం లో లేదు. మానవ అభివృద్ధిలో వెనకబడి వుంది. కార్మికులపై తీవ్రమయిన దోపిడి జరుగుతున్నది. కార్పొరేట్సుకు భారీ రాయితీలు అడ్డగోలుగా అవినీతికరంగా ఇవ్వబడుతున్నాయి. ప్రజల మధ్య మత కలహాలు విపరీతముగా రెచ్చగొట్టబడ్డాయి. చెప్పుకోతగిన ఘనత(మత కలహాలలో తప్ప) దేనిని నరేంద్ర మోడి సాధించలేదు. అయినప్పటికి అతనిని  వికాస పురుషుడని, అతను ప్రధాన మంత్రి అయితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమయిపోతాయని కార్పొరేట్ మీడియా దుర్బుద్ధితో ప్రచారము  చేస్తున్నది. కార్పొరేట్లు తమ దోపిడి నిర్నిబంధముగా కొనసాగేందుకు కాంగ్రెస్ లేదా బిజెపి అధికారం లోకి రావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించే పరిస్తితి వున్నది కాబట్టి తమ దోపిడి విశృంఖలముగా కొనసాగేందుకు నరేంద్ర మోడిని, బి జె పి ని ముందుకు తెచ్చి ప్రజలని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నది. నరేంద్ర మోడి ద్వారా తాము దేశాన్ని ప్రత్య్క్షముగా పాలించవచ్చని కార్పొరేట్ల ఉద్దేశం. రాజ్యాధికారం, కంపెనీల అధికారం మమేకం కావటం ఫాసిజం. నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయితే జరిగే ప్రమాదం ఇదే. కార్పొరేట్ల ఈ కుట్రలను తిరస్కరించాలి. 

Thursday, April 24, 2014

కాంగ్రెస్, బి జె పి ప్రభుత్వాలు అమలు చేసిన సరళీకరణ-ప్రపంచీకరణ-ప్రయివేటీకరణ విధానాల వినాశకర ఫలితాలు

1991 లో పి.వి.నరసింహారావు ప్రభుత్వము నూతన ఆర్థిక విధానాల పేరుతో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాలను ప్రవేశ పెట్టింది. ఈ విధానాలనే నయా ఉదార వాడ ఆర్థిక విధానాలని అంటారు. ఈ విధానాల సారాంశం:

1.    విదేశీ పెట్టుబడులు, సరుకులు, సేవలు మన దేశం లోకి స్వేచ్ఛగా రావటానికి అనుమతించాలి(ప్రపంచీకరణ)

2.   ఇందుకు వున్న అన్నీ ఆంక్షలను తొలగించాలి(సరళీకరణ)

3.   ప్రభుత్వము ప్రజా సంక్షేమం పై, వ్యవసాయం పై, మౌలిక వసతుల నిర్మాణం పై ఖర్చు చేయకూడదు. ప్రభుత్వ రంగానికి రిజర్వు చేయబడిన రంగాలనుండి ప్రభుత్వము వైదొలగి  ప్రయివేటు రంగానికి అప్పగించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలి(ప్రయివేటీకరణ)

4.   ఆర్థిక వ్యవస్థని విచ్చలవిడిగా లూటీ చేసేందుకు అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడిని  దానితో మిలాఖత్ అయిన భారత పెట్టుబడిదారీ వర్గాన్ని అనుమతించాలి.

పి.వి.నరసింహారావు ప్రభుత్వ హయాములో ఈ విధానాల అమలు ప్రారంభం కాగా వాజపాయి ప్రభుత్వము మరింత వేగముగా కొనసాగించింది. మన్మోహన్ సింగ్ యూపీ ఏ 1 ప్రభుత్వ హయాములో మద్దతిచ్చిన వామపక్షాల ఒత్తిడివలన వీటి అమలు వేగం తగ్గింది. కానీ యు పి ఏ 2 ప్రభుత్వము వామపక్షాల మద్దతు అవసరం లేకుండా ఏర్పడినందున ఈ విధానాల అమలు వేగం మళ్ళీ పెరిగింది.

రాజ్యసభలో బి జె పి నాయకుడు అరుణ్ జైట్లీ, 114.2.2014న “మోడినామిక్స్” అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఈ క్రింది విధముగా చెప్పారు:

“బి జె పి పార్టీ సైద్ధాంతిక ఆలోచనలో సహజ భాగం ఆర్థిక సంస్కరణల అమలు. కాబట్టే బి జె పి ప్రధానమంత్రిగా వాజపాయి, సంస్కరణల అమలును సులభముగా చేయగలిగారు. కానీ ఆర్థిక వ్యవస్థలో నియంత్రణలుండాలనే సిద్ధాంతం  వున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రిగా వున్న పి.వి.నరసింహారావు కు ఈ నియంత్రణల ధోరణిని అధిగమించి సంస్కరణలు ప్రారంభించటం చాలా కష్టమయిన పని”. 

ఈ విధముగా బి జె పి నాయకుడు అరుణ్ జైట్లీ, సంస్కరణలు ప్రారంభించటం అనే కష్ట సాధ్యమయిన పనిని చేసినందుకు పి.వి.నరసింహారావును అభినందించారు. వాజపాయి ప్రభుత్వము బి జె పి పార్టీ సహజ సిద్ధాంతమే సంస్కరణలకి(ప్రయివేటీకరణకి) అనుకూలం కాబట్టి వాటిని తేలికగా అమలు చేయగలిగిందని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ కన్నా బి జె పి మరింత తేలికగా మరింత వేగముగా ఈ నయా ఉదార వాద ఆర్థిక విధానాలను అమలు చేయగలదని, అదే తమ గొప్ప అని బి జె పి నాయకులు స్పష్టముగా చెపుతున్నారు.

1991 నుండి కాంగ్రెస్, బి జె పి ఏ ప్రభుత్వమున్నా అమలు చేసిన  ఈ విధానాల వలన జరిగిందేమిటి? ఈ విధానాల ఫలితాలు వినాశకరంగా వున్నాయి.

  •          విపరీతముగా పెరిగిన సంపద కేంద్రీకరణ- అక్రమముగా విదేశాలకు దేశ సంపద తరలింపు: ఈ విధానాల వలన సంపద కేంద్రీకరణ విపరీతముగా పెరిగింది. 2014 నాటికి మన దేశములో అత్యంత ధనికులుగా వున్న  70 మంది డాలర్ బిలియనీర్ల ( బిలియన్ డాలర్లు అంటే ప్రస్తుతం సుమారు ఋ.6300 కోట్లకు సమానము. కనీస సంపద ఇంత వున్న వ్యక్తిని డాలర్ బిలియనీర్ అంటారు) సంపద రు. 24,00,000 కోట్లు. ఇది మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25 శాతం!

·        నిధుల అక్రమ తరలింపు 1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ మన దేశము నుండి విదేశాలకు అక్రమముగా తరలించబడిన సంపద రు. 20.92 లక్షల కోట్లు. ఇందులో 1947 నుండి 2009 వరకూ తరలించబడింది 9.64 లక్షల కోట్లు కాగా  2008-10 మధ్య రెండు సంవత్సరాల కాలం లోనే  రు. 11.28 లక్షల కోట్ల సంపద తరలించబడింది.

·        శ్రమశక్తి సృష్టించిన నికర విలువలో వేతనాల వాటా తగ్గి లాభాల వాటా పెరిగింది(శ్రమ దోపిడి పెరుగుదల)   సరుకుల తయారీ రంగములో 1980 నుండి 2010 వరకూ శ్రమశక్తి ఉత్పాదకత 5 రెట్లు పెరిగింది. కానీ  శ్రమశక్తి  సృష్టించిన నికర విలువలో వేతనాల వాటా 1981-82 లో 30 శాతం వుండగా  1992-93 నాటికి 19 శాతానికి, 2010-11 లో 12 శాతానికి పడి పోయింది. లాభాల వాటా 70 శాతం నుండి 88 శాతానికి పెరిగింది.

·         సహజ వనరుల లూటీ : బొగ్గు, ఇనుప ఖనిజం, స్పెక్ట్రమ్, భూమి, సహజ వాయువు తదితర సహజ వనరులన్నింటి  లూటీ జరిగింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు-2జి కుంభకోణం రు.1,76,000 కోట్లు; బొగ్గు గనుల కుంభ కోణం రు.1,86,000 కోట్లు; సహజ వాయువు (తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు అంబానీకి కట్టబెట్టి వారికి గ్యాస్ కు అతి ఎక్కువ రేటు చెల్లించటం) రు.1,00,000 కోట్లు ; గుజరాత్ లో మోడి ప్రభుత్వము ఆదానీలకు 6700 హెక్టార్ల భూమి అతి తక్కువ రేటుకు ఇచ్చినందున ప్రభుత్వానికి నష్టం రు.10,000 కోట్లు! కొద్ది సంవత్సరాల క్రితం వేసిన ఒక అంచనా ప్రకారం 1991 నుండి జరిగిన ఇటువంటి కుంభకోణాల విలువ రు.73 లక్షల కోట్లు!

·        కార్పొరేట్సుకు,  సంపన్నులకు ప్రపంచములోనే అతి తక్కువ  పన్నులు:  స్థూల జాతీయ ఉత్పత్తి లో పన్నుల నిష్పత్తి బ్రెజిల్ లో 24.5 శాతం, దక్షిణ ఆఫ్రికాలో 26.5 శాతం కాగా మన దేశములో 15 శాతమే వున్నది.  ఇందుకు కారణం కార్పొరేట్సుకు సంపన్నులకు వారి ఆదాయాలపై విధించే పన్ను స్వల్పముగా వుండటమే. మొత్తం పన్నులలో  ఆదాయాలపై విధించే పన్ను అమెరికాలో 75 శాతం కాగా మన దేశములో 37.7 శాతమే.

·        కార్పొరేట్సుకు, సంపన్నులకు భారీ స్థాయిలో పన్ను రాయితీలు:  కార్పొరేట్సు పై, సంపన్నులపై వేసే పన్నులు ఇంత తక్కువ స్థాయిలో వున్నప్పటికి అందులో కూడా భారీ రాయితీలిస్తున్నారు.  2008-09 నుండి 2012-13 వరకు సంపన్నులకు, కార్పొరేట్సుకు భారతప్రభుత్వము ఇచ్చిన పన్ను మినహాయింపుల మొత్తం రు.23.84 లక్షల కోట్లు. ఇందులో 2012-13 లో ఇచ్చిన మినహాయింపులు రు.5.74  లక్షల కోట్లు.

కాబట్టి శ్రమ దోపిడి, సహజ వనరుల లూటీ, స్వల్ప పన్నులు, వాటిలో కూడా భారీ మినహాయింపులు తదితర మార్గాల ద్వారా సంపద కేంద్రీకరణ, విదేశాలకు అక్రమముగా సంపద  తరలింపు జరుగుతున్నది.

·        విదేశాలకు పెట్టుబడుల తరలింపు:  ఇతర దేశాల నుండి మన దేశానికి ఎఫ్ డి ఐ లు రావటమే  గాక ఈ విధానాల వలన మన దేశ బడా పెట్టుబడిదారులు తమపెట్టుబడులను విదేశాలకు తరలిస్తున్నారు. 2008ఏప్రిల్  నుండి2014జనవరి  వరకు విదేశాలనుండి మన దేశానికి  రు. 16.47 లక్షల కోట్ల ఎఫ్ డి ఐ రాగా మన దేశము నుండి విదేశాలకు తరలి వెళ్ళిన ఎఫ్ డి ఐ  రు. 6,30,000 కోట్లు.

·        వ్యవసాయ రంగం లో సంక్షోభం: ఈ విధానాల వలన  వ్యవసాయం సంక్షోభంలో పడి 1997-2014 మధ్య కాలములో 2,75,000 మండి రైతులు ఆత్మ హత్య  చేసుకున్నారు. 1991-2011 మధ్య 1.5 కోట్ల మంది రైతులు వ్యవసాయం నుండి తప్పుకున్నారు.

·        పెరగని ఉద్యోగిత:  2004-05నుండి 2009-10 వరకు ఆర్థిక వ్యవస్థ మంచి ఊపులో సగటున సంవత్సరానికి 8 శాతం పెరిగినా ఈ కాలం లో ఉద్యోగిత సంవత్సరానికి 0.8 శాతమే పెరిగింది. కానీ ఇదే కాలం లో జనాభా సగటున 1.5 శాతం పెరిగింది. రెగ్యులర్ ఉద్యోగాలు తగ్గి క్యాజువల్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర స్వల్ప వేతనాల ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి.

·        సబ్సిడీల కోత:  ఒక వంక సంపన్నులకు భారీ స్థాయిలో పన్నుల రాయితీలివ్వటంతో పాటు  సహజ వనరుల లూటీకి, శ్రమశక్తి  దోపిడీకి అవకాశాలు కలిపిస్తూ మరో వంక సామాన్యులకిస్తున్న సబ్సిడీలు రద్దు చేయటం జరుగుతున్నది. గత మూడు సంవత్సరాలలో ఆహారం, ఎరువులపై రు.78000 కోట్ల సబ్సిడీకి కోతపెట్టారు.

·        ప్రభుత్వ రంగం అమ్మకం:  2009-10 నుండి 2012-13 వరకు  ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వము రు.91,000 కోట్లు సేకరించింది.(వామపక్షాల మద్దతుపై ఆధారపడినందున యూపీఏ 1 ప్రభుత్వము 2004-05 నుండి 2008-09 వరకు రు.9000 కోట్ల డిజిన్వేస్టుమెంటు మాత్రమే చేయగలిగింది)
 
·        ప్రపంచీకరణ పాలయినందున ఒడిదుడుకులనెదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ : 1991 లో మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో విదేశీ వాణిజ్యం (ఎగుమతులు, దిగుమతులు కలిపి) వాటా 14 శాతమే కాగా ఇప్పుడది 50 శాతం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణకు ఇది నిదర్శనం. 2012-13 లో సరుకుల విదేశీ వాణిజ్యములో ఏర్పడిన లోటు స్థూల జాతీయ ఉత్పత్తిలో 10 శాతం. సరళీకరణ విధానాలు విదేశీ ఫైనాన్సు పెట్టుబడులు మన దేశం లోకి స్వేచ్ఛగా రావటానికి, పోవటానికి అనుమతిస్తున్నందున అవి వెళ్ళేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతున్నది.

·        విదేశీ పెట్టుబడులను సంతోష పరచటమే ప్రభుత్వ విధానముగా మారింది: విదేశాలనుండి పెద్ద ఎత్తున వస్తున్న ఫైనాన్సు పెట్టుబడులు అలిగి ఇక్కడినుండి వెళితే ఆర్థిక వ్యవస్థ ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాబట్టి విదేశీ ఫైనాన్సు పెట్టుబడులను సంతోషముగా వుంచేందుకు వాటికి అధిక లాభాలు కలిగించటమే ప్రభుత్వము ప్రధాన కార్యక్రమం  అయింది.

·        పతనమవుతున్న ప్రజల ఆర్థిక పరిస్థితి: ఈ  విధానాల కారణముగా ప్రజల ఆర్థిక పరిస్థితి  దిగజారుతున్నది.

Ø పట్టణ దారిద్ర్య రేఖ కి దిగువన వున్న వారు (రోజుకి తలకి 2100 కేలరీల శక్తినిచ్చే కనీస ఆహారం దొరకని వారు)  పట్టణ జనాభాలో 1993-94 లో 57 శాతం వుండగా ఇది 2009-10 నాటికి 73 శాతానికి పెరిగింది. 

Ø గ్రామీణ దారిద్ర్య రేఖకి దిగువన వున్న వారు (రోజుకి తలకి 2200 కేలరీల శక్తినిచ్చే కనీస ఆహారందొరకని వారు)  గ్రామీణ జనాభాలో 1993-94 లో 58.5 శాతం వుండగా 2009-10 నాటికి 76 శాతం అయ్యారు.

Ø  5 సం. లోపు వయసు వున్న పిల్లలలో సగం మండి పోషకాహారం లేక బరువు తక్కువగా వున్నారు. 60 శాతం మాహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారు.

Ø దేశములో వున్న మొత్తం 33 కోట్ల కుటుంబాలలో 57 శాతానికి రక్షిత త్రాగు నీటి సౌకర్యం లేదు. 53 శాతానికి టాయిలేట్ సౌకర్యం లేదు. ఈనాటికీ 26 శాతం మండి నిరక్షరాస్యులుగా వున్నారు.

·        ప్రజల  కొనుగోలు  శక్తి పతనం  పైన తెలియ జేసిన విధముగా నికర విలువలో వేతనాల వాటా తీవ్రముగా తగ్గినందున, వ్యవసాయం సంక్షోభములో పడినందున, దారిద్ర్యం, నిరుద్యోగం పెరిగినందున  ప్రజల కొనుగోలు శక్తి తీవ్రముగా పడి పోయింది. ప్రయివేటు వినిమయ ఖర్చు (ఇది ప్రజల కొనుగోలు శక్తిని తెలియ జేస్తుంది) పెరుగుదల 2003-04 నుండి 2007-08 మధ్య కాలములో 8 శాతం వుండగా 2012-13 లో 4 శాతానికి పడి పోయింది.

·        తగ్గిన ప్రభుత్వ ఖర్చు:  అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యము తనకి అనుకూలముగా, ప్రజలకి వ్యతిరేకముగా వుండాలని కోరుకుంటుంది. ప్రజా సంక్షేమం పై, మౌలిక వసతుల నిర్మాణం పై, వ్యవసాయ రంగం పై  పెట్టె ఖర్చు తగ్గించి తద్వారా బడ్జెట్ లోటును తగ్గించాలని కోరుకుంటుంది.  బడ్జెట్ లోటు స్థూల జాతీయ ఆదాయం లో  3 శాతానికి మించకుండా వుండే లక్ష్యము  పెట్టుకుని క్రమముగా దీనిని సాధించాలని  షరతు విధిస్తుంది. ప్రభుత్వాలు అవి కాంగ్రెస్ నాయకత్వములో ఏర్పడినా, బి జె పి నాయకత్వములో ఏర్పడినా ,  ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని ఫలితముగా మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం పై ప్రభుత్వ ఖర్చు క్రమముగా తగ్గుతున్నది. 2008-09 నుండి 2012-13 మధ్య కాలములో ప్రభుత్వ వినిమయ ఖర్చు పెరుగుదల 8.5 శాతం వుండగా 2013-14 లో అది సగానికి తగ్గి 4.4 శాతమే అయింది.

·        ధరల పెరుగుదల : ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల)  సగటున సంవత్సరానికి 9 శాతం వుంటున్నది. ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా, 10 శాతం పైన వుంటున్నది.

·        ఆర్థిక మాంద్యం : ప్రజల వినిమయ ఖర్చు, ప్రభుత్వ వినిమయ ఖర్చు తగ్గుతున్నందున మార్కెట్లో డిమాండు తగ్గి, తదనుగుణముగా సరుకుల ఉత్పత్తి పెరుగుదల కూడా తగ్గింది. 2010-11 లో స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల 9.32 శాతం వుండగా అది 2012-13 లో సగానికి తగ్గి 4.5 శాతమే అయింది. మ్యాన్యుఫాక్చర్ రంగం (తయారీ రంగం) లో 2012-13 లో  1.4 శాతం పెరుగుదల వుండగా అది 2013-14 లో మైనస్(-) 0.2 శాతమయింది. అంటే అంతకి ముందు సంవత్సరం కన్నా తగ్గింది. మరి కొన్నిసంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ ఇదే విధముగా మాంద్యం లో వుంటుందని  అంచనా వేస్తున్నారు.

·        ఋణ భారం తో సతమతమవుతున్న కార్పొరేట్లు :క్రెడిట్  సూయిస్  అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2013 నవంబరులో అది పరిశీలించిన మొత్తం 3700 లిస్టెడ్ కంపెనీలలో మూడవ వంతు(34 శాతం) కంపెనీల ఆదాయం అవి చేసిన అప్పుల పై వడ్డీ చెల్లించటానికి సరిపోవటం లేదు. పది భారీ కార్పొరేట్ కంపెనీల అప్పు 2006-07 లో రు.99300 కోట్లు కాగా అది 2012-13 నాటికి రు. 6,31,024 కోట్లు అయింది. వీటిలో ఐదు కంపెనీలకు( జి‌వి‌కే, జి‌ఎం‌ఆర్, లాంకో, వీడియొకాన్,ఎస్సార్) వచ్చే ఆదాయం అవి చేసిన  అప్పులపై వడ్డీ చెల్లించటానికి సరిపోవటం లేదు.

·        మరి కొన్ని సంవత్సరాలు ఆర్థిక మాంద్యం  కొనసాగే పరిస్థితి : కనీసం 2018 వరకు భారత దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటు తక్కువ స్థాయిలో, 5-6 శాతం మధ్య వుంటుందని నిపుణుల అంచనా.

కాబట్టి కాంగ్రెస్,  బి జె పి ల వినాశకర ఆర్థిక విధానాలను తిరస్కరించాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల కోసం ఉద్యమించాలి.


Wednesday, April 23, 2014

ధరల పెరుగుదల సమస్యపై సి పి ఎం, కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలలో ఏముంది?

సి పి ఎం ఎన్నికల ప్రణాళిక

పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయటానికి దిగువన పేర్కొన్న చర్యలు తీసుకోవాలని సి పి ఎం ప్రతిపాదిస్తున్నది:
  1. పెట్రోలియం ఉత్పత్తుల ధరల నియంత్రణ విధాన వ్యవస్థను తిరిగి ప్రవేశ పెట్టటం
  2. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజు మరియు కస్టంసు పన్నుల తగ్గింపు
  3. సహజవాయు ధరలపై నియంత్రణ  మరియు కేజీ బేసీన్ గ్యాస్ ధరల పెంపు ఉపసంహరణ
  4. వ్యవసాయ ఉత్పత్తుల ముందస్తు ట్రేడింగ్ పై నిషేధం
  5. అత్యవసర వస్తువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు మరియు అందుకోసం అత్యవసర వస్తువుల చట్టం లోని అంశాల పటిష్టీకరణ
  6. గోదాములు, గిడ్డంగులలో ప్రయివేటు నిల్వలను వెల్లడించే నిబంధనలను పటిష్ట పరచటం
  7. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచటం, పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వ గోదాములలో వున్న అదనపు నిల్వలను వివేకముతో ఉపయోగించటం
  8. ధరలు అధికముగా వుండి పెరుగుతున్నప్పుడు ఆహార ధాన్యాల ఎగుమతులను నియంత్రించటం
  9. అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించటం
  10. ఎలెక్ట్రిసిటీ ధరల పెరుగుదలకి కారణమయిన ఎలెక్ట్రిసిటీ చట్టం 2003 ని సమీక్షించటం 
కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలు

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ధరల పెరుగుదల ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను కొనసాగిస్తామని వుంది.  మన లక్ష్యం ఆర్థిక వ్యవస్థ అధిక పెరుగుదల అయినప్పుడు ఒక మోస్తరుగా ధరల పెరుగుదల వుంటుందని, అయితే ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు రిజర్వు బ్యాంకు ఒక వంక ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకి మరొక వంక ధరల స్థిరత్వానికి మధ్య సమతుల్యత సాధించాలని, వున్నది.
బి జె పి ఎన్నికల ప్రణాళికలో ధరల పెరుగుదలని అరికట్టేందుకు అక్రమ నిల్వదారులపై, బ్లాక్ మార్కెటిర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని, ధరల స్థిరికరణ నిధిని ఏర్పాటు చేస్తామని, ఫుడ్ కార్పొరేషన్ ను మూడు ముక్కలుగా చేస్తామని,  దేశం మొత్తం ఒకే మార్కెట్ గా తయారు చేయాలని, వుంది.
ధరల పెరుగుదలకి అసలు కారణాలను కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలు పట్టించుకోటం లేదు. పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల వలన రవాణా ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు(గ్యాస్ తో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి జరుగుతున్నది), రసాయన ఎరువుల(పెట్రోలియం ఉత్పత్తులను ఎరువుల తయారీలో వాడతారు) ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్ , పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు తగ్గించేందుకు ప్రభుత్వమే గతములో వాటి ధరలను నిర్ణయించేది. అందుకు అవసరమయిన సబ్సిడీలిచ్చేది. కాంగ్రెస్, బి జె పి లు దీనిని గురించి మాట్లాడటం లేదు. పెట్రోల్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించే విధానాన్ని ఎత్తి వేయటం బి జె పి హయాములోనే ప్రారంభమయింది. కాంగ్రెస్ దానిని కొనసాగించింది. కె జి బేస్ గ్యాస్ ను అంబానీల కు ఇచ్చి వారినుండి అత్యంత ఎక్కువ ధరకు ప్రభుత్వము కొంటున్నందున గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అంబానీల ఈ దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వము అనుమతిస్తున్నది. బి జె పి దీనిని వ్యతిరేకించకుండా సహకరిస్తున్నది.
ముందస్తు ట్రేడింగ్(ఫార్వర్డ్ ట్రేడింగ్)అనే జూదగొండి ట్రేడింగ్ వలన వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. కానీ ఈ ఫార్వర్డ్ ట్రేడింగ్ రద్దు చేస్తామని కాంగ్రెస్ గాని, బిజెపి గాని అనటం లేదు.  ప్రభుత్వ గోదాముల్లో భారీగా నిల్వలు వున్నందున ముక్కి పోయి పాడవుతున్న ధాన్యాన్ని తక్కువ ధరకు చవుక దుకాణాల ద్వారా ప్రజలకి అందించి ధరలు తగ్గించ వచ్చు. కానీ ఈ పని చేస్తామని కాంగ్రెస్ గాని, బి జె పి గాని అనటం లేదు.
ఎలెక్ట్రిసిటీ చట్టం 2003 ను బి జె పి ప్రభుత్వము తెచ్చింది. విదేశీ, స్వదేశీ ప్రయివేటు ఎలెక్ట్రిసిటీ ఉత్పత్తి కంపెనీలను పెద్ద ఎత్తున అనుమతించి వాటికి భారీ లాభాలు గ్యారంటీ చేసేందుకు ఎలెక్ట్రిసిటీ ధరలు పెంచటం దీని సారాంశం. బి జె పి ప్రభుత్వము ఈ చట్టం తేగా కాంగ్రెస్ దీనిని కొనసాగించింది. ఈ ప్రజావ్యతిరేక చట్టాన్ని మార్చేందుకు కాంగ్రెస్ గాని, బిజెపి గాని సుముఖముగా లేవు.
బ్లాక్ మార్కెటీర్లను శిక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని షరా మామూలే అన్న పద్ధతిలో  బి జె పి అంటున్నది. రిజర్వు బ్యాంకు తన ద్రవ్య విధానంలో  సమతుల్యతని పాటించి ధరలు మరీ పెరగకుండా చూడాలని కాంగ్రెస్ అంటున్నది.

కాంగ్రెస్, బి జె పి లు  ధరల పెరుగుదల సమస్యని పరిష్కరించేందుకు సుముఖముగా లేవని వీరి ఎన్నికల ప్రణాళికలు తెలియ జేస్తున్నాయి. ఇందుకు భిన్నముగా సి పి ఏం ఎన్నికల ప్రణాళిక ధరల పెరుగుదల సమస్యకు నిజమయిన పరిష్కారాలను ప్రతిపాదించింది.


Monday, April 21, 2014

కార్మిక వర్గ సమస్యలపై సి పి ఎం, కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలు ఏమి చెపుతున్నాయి?

సిపిఎం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలు

1.     కనీస వేతనం రు.10000/- వుండాలి. ధరల పెరుగుదలకు అనుగుణముగా దానిని పెంచాలి. ఈ విధానాన్ని చట్టబద్ధం చేయాలి.

2.    కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు జరపాలి. దీనిని పర్యవేక్షించేందుకు కార్మిక శాఖను పటిష్టం చేయాలి. తగినంత మంది అధికారులను, సిబ్బందిని నియమించాలి.  

3.    అసంఘటిత కార్మికుల సాంఘిక సంక్షేమ చట్టాన్ని మెరుగు పరచాలి. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారినేగాక ఎగువన వున్నవారిని కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలి. ఆరోగ్యం, మెటర్నిటీ, శిశు సంరక్షణ, జీవిత బీమా, ప్రమాదం జరిగినప్పుడు పూర్తి  సహాయం, పెన్షన్ తదితర సౌకర్యాలు అందరికీ కల్పించేందుకు ప్రత్యేక నిధిని తగినంత బడ్జెట్ కేటాయింపులతో ఏర్పాటు చేయాలి.

4.    2004 తరువాత రిక్రూటయిన  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కు ప్రమాదం తెచ్చిన “నూతన పెన్షన్ స్కీము” ను, పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వము వీరి పెన్షన్ ఖర్చును పూర్తిగా భరించాలి. ప్రభుత్వమే వీరికి పెన్షన్ చెల్లించాలి. ప్రభుత్వోద్యోగులకే గాక అన్నీ రంగాల కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ ఖర్చును యాజమాన్యాలే భరించాలి. ఆఖరి వేతనం లో 50 శాతాన్ని పెన్షన్ గా ఇవ్వాలి.

5.    రహస్య బ్యాలట్ ద్వారా కార్మిక సంఘాలకు గుర్తింపునివ్వాలి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నింటిలోనూ యూనియన్ గుర్తింపు తప్పనిసరి చేసే చట్టం తేవాలి.

6.    ప్రభుత్వ మరియు ప్రయివేటు సంస్థల యాజమాన్యం లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించే స్కీము రూపొందించాలి.

7.    కాంట్రాక్టు, క్యాజువల్ కార్మిక  విధానాన్ని ప్రోత్సహించకూడదు. కాంట్రాక్టు కార్మిక చట్టాన్ని సవ్యముగా అమలు జరపాలి. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు అదే పని చేసే రెగ్యులర్ కార్మికుల వేతనాలతో సమంగా వుండాలి. వారికి యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు ఇవ్వాలి. ట్రేడ్ యూనియన్ల లో వోటింగు హక్కు ఇవ్వాలి.

8.    అన్నీ రంగాలలో మహిళా కార్మికులకు పురుష కార్మికులతో సమంగా వేతనం ఇవ్వాలి. అసంఘటిత రంగం లో పని చేస్తున్నా మహిళా కార్మికులకు ( ఇంటి వద్దే వుంది పని చేసే మహిళా కార్మికులతో సహా) మెటర్నిటీ, పెన్షన్, ఇన్సూరెన్స్, క్రెచి తదితర సౌకర్యాలు కల్పించాలి.

9.    మహిళా కార్మికుల పై పని స్థలాలలో లైంగిక వేధింపులను  నివారించేందుకు చట్టం లో పేర్కొన్న అన్నీ నిబంధనలను, ఈ వేధింపుల పై విచారించే కమిటీలలో ఎన్నికైన ప్రతినిధులను నియమించటం తో సహా, అమలు చేయాలి.

10.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీములను అమలు చేసే స్కీము వర్కర్లను(అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, పేరా టీచర్స్, మొదలగు వారు) 45వ భారత కార్మిక మహాసభ సిఫార్సు ప్రకారం “వర్కర్లు” గా గుర్తించి తదనుగుణముగా చట్టబద్ధమయిన కనీస వేతనాలు, సాంఘిక భద్రతా ప్రయోజనాలు వారికి వర్తింపజేయాలి.

11.   కీలక రంగాలలో ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి. లాభసాటిగా వున్న, కోలుకోటానికి అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, డిజిన్వేస్తుమెంటును పూర్తిగా ఆపి వేయాలి.

12.  రీరైల్ వ్యాపారం లో ఎఫ్ డి ఐ ని నిషేదించాలి. ఎఫ్ డి ఐ ని దొడ్డిదారిన అనుమతించే రూల్సును రద్దు చేయాలి. స్వదేశీ పరిశ్రమలను స్వాధీనం చేసుకునేందుకు ఎఫ్ డి ఐ ని అనుమతించకూడదు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చేందుకు విదేశీ పెట్టుబడిని అనుమతించాలి.

వీటన్నింటికోసం తాను నిలబడతానని సి పి ఎం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.

కాంగ్రెస్, బి జె పి ఎన్నికల ప్రణాళికలు

ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రణాళికలలో పైన తెలియజేసిన అంశాలేవీ లేవు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అసంఘటిత కార్మికుల సాంఘిక భద్రత చట్టాన్ని సక్రమముగా అమలు చేస్తామని వున్నది. అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్సు, పెన్షన్ సౌకర్యం హామీ యిచ్చింది. ఇదే హామీని బి జె పి కూడా ఇచ్చింది. కానీ ఈ చట్టాన్ని దారిద్ర్య రేఖకు ఎగువున వున్న అసంఘటిత ఆకార్మికులకు వర్తింపజేస్తామనే హామీని కాంగ్రెస్ గాని, బి జె పి గాని ఇవ్వలేదు. అన్నీ కార్మిక చట్టాలను కలిపి ఒకే సమగ్ర చట్టం గా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించేందుకు ఒక కమిషన్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అన్నది. కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా మార్చటమే దీని వుద్దేశం. బి జె పి ఎన్నికల ప్రణాళికలో కూడా కార్మిక చట్టాలు సమీక్షించాలన్నది. దీని వుద్దేశం కార్మిక చట్టాలను కార్మిక వ్యతిరేకముగా మార్చటమే. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, డిజిన్వెస్ట్మెంటులను ఆపుతామనే వాగ్దానాన్ని ఈ రెండు పార్టీలు ఇవ్వలేదు. విదేశీ పెట్టుబడులకు ఎటువంటి వ్యతిరేకతా వుండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  రిటెయిల్ వ్యాపారులు తమ వోటర్లుగా వున్నారు గనుక రిటెయిల్ వ్యాపారం (అది కూడా మల్టీబ్రాండ్ లోనే) మినహా అన్నీ రంగాలలో ఎఫ్ డి ఐ  ని బి జె పి ఎన్నికల ప్రణాళిక ఆహ్వానిస్తున్నది.

కాబట్టి సి పి ఎం మాత్రమే కార్మిక వర్గానికి అనుకూలముగా వున్నది. కాంగ్రెస్, బిజెపిలు వ్యతిరేకముగా వున్నాయి.