Sunday, October 18, 2020

వందేళ్ల వందనం ! వడలని ప్రస్థానం !!


 ఎరుపులోనె మెరుపుంది
పోరాడే శక్తుంది
శ్రమజీవుల హక్కులకై
ఎలుగెత్తే బలముంది! - సుబ్బారావు పాణిగ్రాహి.


చరిత్ర నిరూపించిన సత్యానికి అక్షర రూపమిది. ప్రపంచ చరిత్రలో ఎందరెందరో మహరాజులు, సామ్రాట్టులూ హంగు దర్పాలతో అలరారుతున్న అధునాతన పాలకవర్గ నేతలూ ఎవరూ ఇవ్వని విశ్వాసమిచ్చిన చైతన్యం నింపిన మహత్తర సిద్ధాంతం, ఆచరణల సమతా సమరానికి ప్రతీకగా నిలిచిన వందేళ్ల ప్రస్థానం సంస్మరించుకుంటోంది భారతదేశం. 


ఇలాంటి సమయంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమ ఔన్నత్యానికి జేజేలు పలికే బదులు శాపనార్థాలు పెట్టేందుకు, దీనాలాపనలు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. 'వందేళ్ల వర్గ పోరాట వక్రీభవనం' (ఆంధ్రజ్యోతి-17.10.20) అంటూ తేల్చిపారేస్తున్నారు. 

వేల సంవత్సరాలలో ఘనీభవించిన దోపిడీ వర్గాల శక్తియుక్తులనూ అపారంగా వారికి అందుబాటులో వున్న భౌతిక, బౌద్ధిక వనరులను ప్రత్యక్ష ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రచార యంత్రాన్ని గమనించకుండా భారత దేశంలోని కమ్యూనిస్టు పార్టీలూ బృందాలూ అన్నీ విఫలమైపోయాయని తేల్చిపారేస్తున్నారు. 

మరో వంక సామ్రాజ్యవాద ప్రపంచ నేతగా వున్న అమెరికా అధ్యక్షుల వారికి తన ఎన్నికల ప్రత్యర్థి కమలా హారిస్‌ కమ్యూనిస్టుగా కనిపిస్తున్నారు. భారతీయ ట్రంప్‌ లాంటి నరేంద్ర మోడీజీకి జెఎన్‌యులో, హెచ్‌సియులో, కరోనాతో కదలిన వలస కార్మికుల అలజడిలో, సిఎఎపై ఎలుగెత్తిన షహీన్‌బాగ్‌ నిరసనలో ప్రతి చోటా కమ్యూనిస్టులే కనిపిస్తున్నారు. మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నుంచి మావోయిస్టుల వరకూ అందరూ జాతి ద్రోహులుగా అగుపిస్తున్నారు. 

వందేళ్లనాడు భారత కమ్యూనిస్టు ఉద్యమ అంకురార్పణ చేసిన తొట్ట తొలి తరం యోధులపై మీరట్‌, కాన్పూర్‌ కుట్రకేసులు పెడితే... ఇప్పుడు కూడా షహీన్‌బాగ్‌, భీమా కోరెగావ్‌, ఆఖరుకు హథ్రాస్‌ ప్రతి చోట ప్రతీఘాత శక్తులకు ఇదే ప్రత్యామ్నాయ చైతన్యం భయంగొల్పుతున్నది. 


'ఈ నాడు యూరప్‌ను ఒక భూతం భయపెడుతున్నది' అన్న కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రారంభ వాక్యాలు ఇప్పటి పాలక వర్గాలకూ అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ముప్పై ఏళ్ల కిందట సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత ప్రతికూల పరిణామాలు ఉద్యమాభిమానులకు ఎంత బాధాకరమైనప్పటికీ భూతాన్ని సీసాలో బంధించడం మాత్రం జాతీయ అంతర్జాతీయ పాలకవర్గాల తరం కాలేదు. వడలని సంకల్పంతో సమరం సాగుతూనే వుంది. వాస్తవాలను ఆకళింపు చేసుకుంటూ తప్పొప్పులు దిద్దుకుంటూ పున: ప్రస్థానం చేస్తూనే వుంది.


పాక్షికత్వంతో పరాచకాలు


వామపక్ష పదజాలం వల్లించే కొందరు విమర్శకులు ఈ మొత్తం పరిస్థితి గమనిస్తున్నారా అని సందేహం కలుగుతుంది. అధ్యయనంతో రచనలతో తలపండిన రచయితలకు రచయిత్రులకు కూడా కమ్యూనిస్టుల వైఫల్యాలే కనిపిస్తున్నాయి. మార్క్స్‌, ఎంగెల్సులు అంత సూటిగా రాస్తే ఈ పార్టీల నాయకులు ఎందుకు పట్టుకోలేకపోయారని పడక కుర్చీలలో కూర్చుని లేదా ఇంటర్‌నెట్లు శోధిస్తూ కొందరు తెగ ఇదై పోతున్నారు. ఇంతా చేసి ఈ వందేళ్లలో పాలకవర్గాల పన్నాగాలనూ కమ్యూనిస్టులు ఎదుర్కొన్న ఘోర నిర్బంధాన్ని, చేసిన బలిదానాలనూ అవగాహనలో, ఆచరణలో సైద్ధాంతిక నిర్మాణ సమస్యలనూ లోతుగా పరిశీలించే ఓపిక వుంటుందా! అదీ నాస్తి. 


ఈ వందేళ్లలోనూ కమ్యూనిస్టులు ముళ్లదారిలో నడిచారే గాని పూల బాటలో పయనించలేదని గుర్తించ లేకపోవడం...ఆ ముళ్ల పొదల మాటు నుంచి కాలసర్పాలు వారిని ఎన్నిసార్లు కాటేశాయో, ఇంకా వేస్తూనే వున్నాయో అర్థం కాకపోవడం...ఈ ఆరోపణలకూ ఆవేదనలకూ అసలు కారణం. విజ్ఞానశాస్త్రంలో ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం ప్రకారం వక్రీభవనం అంటే ఏంటో తెలుసు. ఒక వాహకం లోంచి మరో దానిలోకి మారినప్పుడు అంటే గాలి లోంచి నీటి లోకి మారినపుడు కాంతి గమనం నెమ్మదించి వంగినట్టుగా కనిపిస్తుంది. అంతేగాని ఆగదు. అలాగే దేశంలో ప్రపంచంలో పరిస్ధితులు, వర్గశక్తుల బలాబలాలు, పొందికలు మారినప్పుడు రాజకీయ గమనంలో హెచ్చుతగ్గులు వుంటాయి. సామాజిక శాస్త్రం కూడా అయిన మార్క్సిజాన్ని దాన్ని ఆచరణలో అమలు చేసి అపూర్వమైన మార్పులు తెచ్చిన కమ్యూనిస్టుల పాత్రనూ దృష్టి దోషాలతో చూస్తే అలాగే వుంటుంది. 


వందేళ్లలో ప్రపంచమంతా మార్చలేకపోగా బలహీనమవడం కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమైనట్టు గోచరిస్తుంటుంది. చరిత్రను సరిగా చూడకపోబట్టి చారిత్రిక తప్పిదాలు అన్న మాట పరాచికంగా మారిపోతుంటుంది. అలాంటి వారు శత్రు శిబిరానికి చెందినవారైతే ముఖం వాచేలా సమాధానం చెప్పడం మిత్రబృదంలో వారైతే సహనంతో తెలియజెప్పడం మాత్రమే మార్గం.

యథాస్థితికి కంచుకోటలే!

కమ్యూనిస్టేతర శక్తులేవీ సైద్ధాంతికంగా ఈ వ్యవస్థను మార్చే లక్ష్యం వున్నవి కావు. అంటే దానితో ముడిపడిన అసమానతలూ వివక్షతలూ దోపిడీ, పీడన కొత్త రూపాలలో కొనసాగించేవే గాని తుదముట్టించేవి కావు. మహా అయితే కొన్ని సంక్షేమ పథకాలతో సరిపెట్టి అంతకు పదింతల సంపదలు శతసహస్ర కోటీశ్వరులకు ధారాదత్తం చేస్తూనే వుంటాయి. ఆరేళ్ల మోడీ పాలనలో అయిదు రెట్లు పెరిగిన ముఖేష్‌ అంబానీ ఆస్తి, మూడు రెట్లు పెరిగిన గౌతం అదానీ ఆస్తులూ, వంద రెట్లు పెరిగిన మత విద్వేషాలు, కులాల వివక్షలూ, ట్రంప్‌ కంపు వ్యవహారాలూ కనిపిస్తూనే వున్నాయి. వీటిపై నికరంగా నిశ్చలంగా విమర్శ చేస్తున్నదీ వీరోచితంగా పోరాడుతున్నదీ ప్రగతిశీల శక్తులు తప్ప గొప్పలు పోయే పాలకవర్గాలు కాదు. 

అయితే లెనిన్‌ అన్నట్టు కార్మిక వర్గ పోరాటంలో అతి భీకరమైన భాగం సైద్ధాంతిక రంగంలో జరుగుతుంది. సోషల్‌ మీడియా వ్యాప్తి, ఆరెస్సెస్‌ బిజెపిలు దాన్ని విషప్రచార సాధనంగా మార్చుకోవడం జరిగాక అనుక్షణం అసంఖ్యాక కథనాలు చెలరేగిపోతున్నాయి. ప్రత్యక్ష అణచివేతలూ చెలరేగిపోతున్నాయి. భారతీయ సమర క్షేత్రంలో అరుణ పతాకానికి వందేళ్ల వందనం సమర్పించేప్పుడు ఈ శక్తులను పసిగట్టి పని పట్టడానికి పటిష్టమైన యోచనలు, ఆచరణ తప్పనిసరి. 

ఉద్యమంలో కదం తొక్కే అరుణ సైన్యానికి అండగా అశేషమైన అభిమానులూ శ్రేయోభిలాషులూ వాటిని గమనిస్తూనే వున్నారు గనక నిరంతర తోడ్పాటు కొనసాగిస్తున్నారు. ఎర్ర జండా అండనే పోరాటాలు సాధ్యమని శ్రమజీవులూ నిరుపేదలూ నమ్ముతున్నారు. ఎవరో కవి అన్నట్టు 'పీడితులు, తాడితులు, కార్మికులు, కర్షకులు నీ నీడనే నేడు నిలిచి వున్నారే..నిన్ను నమ్ముకునే వారు బతుకుతున్నారే.. నీకు సాటెవ్వరే సమతా పతాకా' అని పాడుతూనే వున్నారు. మరింత గట్టిగా పోరాడాలని కమ్యూనిస్టులపై వీరు చేసే ఫిర్యాదు వాస్తవానికి వారి గౌరవాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. 


సామ్రాజ్యవాద ప్రపంచీకరణ యుగం దాన్ని కాపాడటానికి మత మార్కెట్‌ శక్తులు కలసి తీసుకొచ్చిన జాతి మత చాందస శక్తుల స్వైర విహారం ఆందోళనకరమే. కాని కమ్యూనిస్టులు ఈ పరిస్థితికి దీటుగా తమను తాము మల్చుకోవడం, మార్చుకోవడం క్షణాల మీద జరిగిపోదు. వర్గ సమరం సాగిస్తూ అంతర్గత దిద్దుబాట్లు చేసుకోవడానికి ఈ శతవార్షిక సందర్భమే సరైంది. వర్గ పోరాటంలో సిద్ధాంతాన్ని మించిన ఆయుధం లేదన్నట్లే ఐక్యతను మించిన పునాది కూడా వుండదు. ఈ రెంటినీ మేళవించే నవయుగ సైనికుల పతాకమే అరుణ పతాకం.


సిపిఐ(ఎం) విలక్షణ పాత్ర


ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర చాలా సుదీర్ఘమైంది. ప్రభావశీలమైంది కూడా. అనేకసార్లు సరైన దిశా నిర్దేశం చేసింది. ప్రజాచైతన్యం పెంచింది. కేవలం గతం ఘనతనే కీర్తించే ఈ పుణ్యభూమిలో నవచైతన్యాంకురాలు నాటింది. ప్రత్యామ్నాయ ప్రజా సాహిత్య సంస్మృతులను సృజించడమే కాదు. ఉద్యమాలలోనూ పాలనలోనూ కూడా ఆ శక్తుల నమూనాను చూపించింది. వామపక్ష శిబిరంలో అన్ని స్రవంతులనూ విచక్షణా రహితంగా ఈసడించే సిద్ధాంత కోవిదుల మాట ఎలా వున్నా ఆ మౌలిక భావనలను సజీవంగా వుంచడానికి ప్రధానమైన వామపక్షంగా సిపిఎం చొరవ చూపింది. 1998లో మార్క్స్‌ 125వ వర్ధంతిని దేశ దేశాల కమ్యూనిస్టు వర్కర్స్‌ పార్టీల సమ్మేళనంతో జరిపి చెల్లాచెదురుగా వున్న విప్లవకర శక్తులకు కొత్త ఊపిరిలూదింది. పదవుల లోకి రావడమే విజయమనుకుంటే సిపిఎం నేత పాతికేళ్ల కిందటే భారత ప్రధాని అయివుండేవారని మర్చిపోరాదు. సరళీకరణను, గరళీకరణగా మారుతున్న తీరును చెప్పి దేశవ్యాపితంగా కోట్లాది మంది కార్మికులను సమరపథంలో నడిపిస్తున్న తీరుకు రేపు నవంబర్‌లో జరిగే సమ్మె కూడా సంకేతం కానుంది. ఇటీవల వక్రమార్గాలతో పార్లమెంటులో ఆమోదించుకున్న రైతు వ్యతిరేక బిల్లులపై పోరాటం జరుగుతూనే వుంది. హథ్రాస్‌లో అమానుషంగా బలైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం, ఐద్వా బృందంతో ఆ గృహస్తుడు తాను కార్మిక సంఘంలో పని చేశానని, కమ్యూనిస్టులే ప్రజల కోసం నిలబడతారని చెప్పడం ఈ దేశంలో కమ్యూనిస్టులు విత్తిన చైతన్యానికి ఒక నిదర్శనం.


ఎర్రబావుటా నిగనిగలు


పిడుక్కూ బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు తీరిగ్గా కూర్చుని తిట్టేవాళ్లు తిట్టవచ్చుగాక. తిన్నది అరగని పాలకవర్గ ప్రవక్తలు శాపనార్థాలు పెట్టవచ్చుగాక. ఎక్కడికీ తృప్తి లేక ఇంకా ఇంకా సంపదల కోసం వెంపర్లాడే ధనస్వామ్య భూస్వామ్య అభివృద్ధి నిరోధక శక్తులు సామదానభేద దండోపాయాలను ప్రయోగించుగాక. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మతాన్ని గతాన్ని కూడా తోడు తెచ్చుకుని నిలవాలని పాచికలు వేయొచ్చుగాక. 


ఇవన్నీ ఎన్నో చూసిన తర్వాత కూడా ఎర్రజెండా పైపైకి ఎగురుతూనే వుంది. ఉంటుంది. 'కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు' అని ప్రశ్నిస్తూనే వుంది. 'ముళ్లూ రాళ్లూ అవాంతరాలు ఎన్ని వున్నా ముందు దారి మాదే..మాదే..' అని ప్రకటిస్తోంది. వక్రీభవనం కాంతి మార్గాన్ని తప్పుగా చూపిస్తుందేగాని గమనాన్ని ఆపలేదన్న శాస్త్రీయ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఈరోజు దేశమంతటా ఉద్యమ కేంద్రాలలో ఎగిరిన అరుణ పతాకాలే అందుకు సాక్ష్యం. 

......... ప్రజాశక్తి, 18.10.2020, తెలకపల్లి రవి వ్యాసం  

శత వసంతాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు ఉద్యమం

 

శత వసంతాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు ఉద్యమం గురించి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులు, అభిమానులు చర్చించుకుంటున్నారు, ఈ నూరేళ్ళ కాలంలో ఉద్యమ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాళ్ళను స్మరించుకుంటున్నారు. ఈ ఉద్యమానికి బీజాలు వేసిన వైతాళికులను, ఉద్యమ సారథులను స్మరించుకుంటున్నారు. భారత దేశంలో సమసమాజాన్ని నిర్మించాలనే ఆశయ సాధనకు పునరంకితమౌతున్నారు.

కమ్యూనిస్టు ఉద్యమం నామరూపాలు లేకుండా పోవాలని మొదట్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, ఆ తర్వాత భారత పాలక వర్గాలు, వారి ప్రతినిధులు ఈ వందేళ్లుగా కోరుకుంటూనే వున్నారు, శాపనార్ధాలు పెడుతూనే వున్నారు. అయినా కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతూనే వుంది. 

అయితే, సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత నయా ఉదారవాద విధానాలు ఆర్థిక రంగంలోనే గాక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సైతం పైచేయి సాధించడం, మరోపక్క మితవాద శక్తులు, మతతత్వ శక్తులు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం వెనుకపట్టు పట్టింది. ఈ వెనుకపట్టు తాత్కాలికమే.

పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదంటూ విర్రవీగిన వారంతా నేడు ఆ వ్యవస్థ సృష్టించిన సార్వత్రిక సంక్షోభాన్నుంచి బైటపడేదారి తోచక ఆ ఊబిలో అంతకంతకూ దిగబడిపోతూన్న వైనం నేడు మనం చూస్తున్నాం. గత పన్నెండేళ్ళుగా ఈ సంక్షోభం చుట్టుముట్టి వున్నా, అంతకంతకూ ప్రజల జీవితాలు దుర్భరమౌతున్నా, తమను తామే కాపాడుకోలేని స్థితిలో పెట్టుబడిదారులు పడిపోతున్నా, ఇంకా ఈ విఫల వ్యవస్థనే సమర్థించుకుంటూ, కిందపడినా నాదే పైచేయి అన్న తంతుగా వ్యవహరిస్తున్నారు పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తలు. 'కమ్యూనిస్టులు ఏం సాధించారండీ?' అని అడుగుతున్నారు. మన సమాధానం వినకుండానే 'ఏమీ సాధించలేదు' అని తీర్పు చెప్పేస్తున్నారు.

మన దేశ స్వాతంత్య్రానికి కావలిసిన అంతర్జాతీయ భూమికను ఏర్పాటు చేసింది కమ్యూనిస్టు ఉద్యమమే. ప్రపంచాన్ని మొత్తంగా తమ గుప్పెట్లో బంధించుకుని వలస పాలనను సాగించిన సామ్రాజ్యవాదాన్ని దెబ్బతీసినదెవరు? తనకెదురు లేదని విర్రవీగుతూ ప్రపంచాన్ని కబళించాలని చూసిన హిట్లర్‌ ఫాసిస్టు నాజీయిజాన్ని మట్టి కరిపించి బెర్లిన్‌ నగరంలో ఎర్రజెండాను ఎగురవేసిందెవరు? అటు ఫాసిస్టు ప్రమాదం నుంచి యావత్‌ ప్రపంచాన్నీ కాపాడడమేగాక, మూడో ప్రపంచ దేశాలపై సామ్రాజ్యవాదులు సాగిస్తున్న వలస దోపిడీ పాలనకు చరమగీతం పాడింది సోషలిస్టు రష్యా. ఆ యుద్ధంలో హిట్లర్‌ దెబ్బకు తట్టుకోలేక చతికిలబడి, చితికిన బ్రిటిష్‌ పాలకులు అనివార్యంగా వలస దేశాలపై తమ పెత్తనాన్ని వదులుకోవలసి వచ్చింది. వలస పాలనను నిర్మించింది పెట్టుబడిదారీ విధానమైతే, దానిని తుదముట్టించడానికి ప్రాతిపదిక ఏర్పరచింది కమ్యూనిస్టులు.

మన దేశంలో జాతీయోద్యమం మొదట్లో కేవలం కొద్దిమంది మేధావులకు, మధ్యతరగతికి మాత్రమే పరిమితమై ఉండేది. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న డిమాండ్‌ను కూడా చేయలేని స్థితిలో ఉండేది. మనకు సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. దానికి ప్రజానీకం ఉత్సాహంగా స్పందించడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ లక్ష్యాన్ని అంగీకరించింది. అలా జాతీయోద్యమానికి లక్ష్యాన్ని నిర్దేశించడమేగాక, దానికి కండపుష్టిని కలిగించింది కూడా కమ్యూనిస్టులే. కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలను, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా సామాన్యులంతా స్వాతంత్య్ర సాధనకు కదిలేలా చేసింది. సామాన్యుడి దైనందిన సమస్యల పరిష్కారానికి, స్వాతంత్య్ర సాధనకు గల సంబంధాన్ని విడమరిచి చెప్పి మహోద్యమానికి పునాదులు వేసింది కమ్యూనిస్టులు.

ఆనాడు గాని, ఈనాడు గాని సామ్రాజ్యవాదులను పల్లెత్తుమాట కూడా అనకుండా వారికి తాబేదారులుగా వ్యవహరిస్తూ, ఆనాటి జాతీయోద్యమంలో ఎటువంటి పాత్రనూ పోషించని ఆరెస్సెస్‌, దాని అనుబంధ శక్తులు నేడు దేశభక్తిని గురించి బోధించేందుకు సిద్ధమైనాయి. ఎంత విడ్డూరం! విభజించి పాలించాలన్న బ్రిటిష్‌ ప్రభువుల వ్యూహానికి అనుగుణంగా దేశంలో మతతత్వానికి బీజాలు వేసి ఈ దేశం మూడు ముక్కలు కావడానికి కారకులైనవారే నేడు దేశభక్తి బోధనలకు పాల్పడుతున్నారు. నేటికీ వారి విదేశీ భక్తి వీసమెత్తు తగ్గలేదనడానికి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు గాని, ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తుతున్న తీరు గాని తార్కాణాలు.

స్వతంత్ర భారత దేశంలో మత విద్వేషాలను రగిల్చి గాంధీజీని హత్య చేసింది ఆరెస్సెస్‌. ఆ సమయంలో కమ్యూనిస్టులు దేశమంతటా ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి దేశ సమైక్యత కోసం నిలిచారు. మన దేశం పారిశ్రామికంగా స్వంత కాళ్ళపైన నిలబడేందుకు తోడ్పడిన ప్రభుత్వ రంగ స్థాపనకు సహకరించినది సోషలిస్టు దేశాలే తప్ప ఏ పెట్టుబడిదారీ దేశమూ అందుకోసం ముందుకు రాలేదు. ఇప్పటికీ మన దేశం కొంతైనా స్వావలంబనను నిలుపుకొనగలిగిందీ అంటే అది ఆ ప్రభుత్వరంగ పుణ్యమే. వెన్నెముక వంటి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ దేశాన్ని తిరిగి పరాధీనం చేయడానికి చూస్తున్నది బిజెపి ప్రభుత్వం. ఆ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోడానికి గత ముప్పై ఏళ్ళుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నది కార్మికులు తప్ప ఏ పెట్టుబడిదారుడూ కాదు. ఆ కార్మికులను బిజెపి (గతంలో కాంగ్రెస్‌) అణచి వేస్తుంటే కార్మికులకు అండగా నిలిచి ప్రభుత్వరంగ పరిరక్షణకు తోడ్పడుతోంది కమ్యూనిస్టులు.

భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినది, సాధించినది కమ్యూనిస్టులు. అలా ప్రజా పోరాటాల ద్వారా ఏర్పడిన రాష్ట్రాల వ్యవస్థను నాశనం చేస్తున్నది బిజెపి, ఆరెస్సెస్‌ శక్తులే. తెలుగుజాతిని నిలువునా చీల్చడానికి పుణ్యం కట్టుకున్నది వాళ్ళే. విశాలాంధ్రలో ప్రజారాజ్య స్థాపన కోసం వేలాదిమంది కమ్యూనిస్టులు, సామాన్య ప్రజలు ప్రాణాలను సైతం బలిపెట్టి సాధిస్తే, ఆ త్యాగాలను వమ్ము చేసింది బిజెపి, ఇతర పాలకవర్గాలే. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. కాశ్మీరీయులకు ఈ దేశం అంటేనే విముఖత ఏర్పడేలా చేస్తున్నారు. గతంలో ఖలిస్థాన్‌ వేర్పాటువాదం విజృంభిస్తే దానితో ఆరెస్సెస్‌ చేతులు కలిపింది. 'మా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం' అంటూ వందలాది కమ్యూనిస్టులు ప్రాణాలొడ్డి దేశ సమైక్యత కోసం నిలబడ్డారు.

దేశాభివృద్ధికి తోడ్పడిన ప్రణాళికాబధ్ధ అభివృద్ధి విధానానికి ప్రేరణ కమ్యూనిస్టు దేశాల అనుభవాలే. ఆ ప్రణాళికా విధానానికే తూట్లు పొడిచి విచ్చలవిడిగా దేశాన్ని కార్పొరేట్లకు పలహారంగా సమర్పిస్తున్నది బిజెపి. ఈ విద్రోహానికి తొలుత దారి తీసింది కాంగ్రెస్‌. ప్రణాళికా విధానంతో మనం ఆహార స్వయంసమృద్థిని సాధించుకున్నాం. ఇప్పుడు బిజెపి చేసిన వ్యవసాయ చట్టాలతో దానికి తూట్లు పడ్డాయి. దున్నేవానికే భూమి పంచాలని నినదించి, దానిని అత్యంత జయప్రదంగా అమలు చేసింది కమ్యూనిస్టులు. ఆ నినాదాన్ని వ్యతిరేకించి జమీందారులకు, భూస్వాములకు అండగా నిలిచింది ఆరెస్సెస్‌.

ఆహారం ఒక సార్వత్రిక హక్కు అని ప్రకటించి, పేదలకు చౌకగా ఆహారధాన్యాలను అందించాలన్న ఉద్యమాలను నడిపింది కమ్యూనిస్టులు. ప్రజాబలానికి తలొగ్గి పాలకులు అరకొరగానైనా ప్రజాపంపిణీ విధానాన్ని చేపట్టవలసి వచ్చింది. ఇప్పుడు దానిని నీరుగార్చి ఆహార హక్కుకు బిజెపి ఎగనామం పెడుతోంది. హక్కుల కోసం, మెరుగైన జీవితాల కోసం కార్మికులు పోరాడినప్పుడు వారికి అండగా నిలిచింది కమ్యూనిస్టులు. ఆ పోరాట ఫలితాలైన చట్టాలను తుంగలో తొక్కింది మాత్రం బిజెపి.

దేశంలో ఇందిరాగాంధీ హయాంలో నియంతృత్వం అమలు జరిగినప్పుడు దానిని ప్రతిఘటించి దేశవ్యాప్తంగా నిర్బంధాలను అనుభవించడమేగాక, వేలాదిమంది ప్రాణాలను సైతం బలి ఇచ్చింది కమ్యూనిస్టులు. తామూ ఆ ఎమర్జెన్సీని ఎదిరించామని చెప్పుకునే బిజెపి నేడు అదే ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రాల హక్కుల్ని సైతం కాలరాస్తోంది. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోంది. ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం, పునరావాస చట్టం వంటివి కమ్యూనిస్టుల జోక్యంతో, ఉద్యమాలతో వచ్చినవే. నేడు బిజెపి వాటినన్నింటినీ అపహాస్యం చేస్తోంది.

అధికారం చేతుల్లో వున్నా దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు లాక్‌డౌన్‌ మాత్రం ప్రకటించి, పి.ఎం.కేర్స్‌ పేరుతో డబ్బులు దండుకుంది బిజెపి. దేశానికే ఆదర్శంగా కరోనా నియంత్రణలో కేరళ ముందుంది. కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో అంతర్జాతీయంగా ప్రశంసలను పొందింది.

అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులు. అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి అధికారం చేజిక్కించుకున్నాక ఆ ప్రజలనే దోచుకునేది దోపిడీ వర్గాల పార్టీలు. కష్టజీవి ఆవేదన, ఆకాంక్ష, నిరసన, ప్రతిఘటన, కమ్యూనిస్టుల రూపంలో ప్రజల ముందుకొస్తుంది. ఆ కష్టజీవులపై దోపిడీని సాగించే వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు పోరాడుతూనే వుంటారు. కష్టజీవుల చేతుల్లోకి ఆ అధికారాన్ని బదలాయించే వరకూ పోరాడుతూనే వుంటారు. దోపిడీ నుండి, అణచివేత నుండి, సాంఘిక వివక్షత నుండి, అన్ని రకాల అన్యాయాల నుండి మనిషి విముక్తి పొందే వరకూ కమ్యూనిస్టులు ఉద్యమిస్తూనే వుంటారు. కుల వివక్షకు, లైంగిక వివక్షకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నాటి నుంచి నేటి వరకు పోరాడుతూనే వున్నారు. 

ఈ మహా ప్రయాణంలో అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తిన్నా, బలహీనపడినా, ఆ ఆటుపోట్లకు కమ్యూనిస్టులెన్నడూ కుంగిపోరు. పడి, లేచే కడలి తరంగాల్లా ఉవ్వెత్తున చెలరేగి ఆశయ సాధన దిశగా ముందుకే, మున్ముందుకే సాగుతారు. (ప్రజాశక్తి, 17.10.2020   సంపాదకీయం )

Friday, October 2, 2020

ఈ రోజు గాంధీ జయంతి సందర్భముగ చదవదగ్గవ వ్యాసం “ జాతీయ సమైక్యత- బాపూజీ”. రచయిత కామ్రేడ్ ఈ ఎం ఎస్ నంబూదిరిపాద్. ఈ వ్యాసం దిగువన ఇస్తున్నాము. 

జాతీయ సమైక్యత- బాపూజీ 


బ్రిటిష్‌ వారు అధికారాన్ని 1947లో తమ చేతిలో పెట్టటం ప్రపంచం లోనే ఒక అసాధారణ విషయంగా కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకుంటారు. ఫ్రాన్స్‌, రష్యా, చైనా మొదలైన దేశాలలో జరిగిన విప్లవాల్లా కాకుండా 1947 'ఇండియా విప్లవం' ఒక్క రక్తపు చుక్క కూడా కార్చకుండా సాధించబడిందనీ, దానికి కారణం అహింసావాది నాయకత్వమేననీ చెప్పుకుంటారు.

1947 ఆగస్టు 15న ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ దేశానికొక సందేశమిస్తూ ఈ విషయాన్ని సాధికారంగానే ప్రకటించారు.

'అంత తక్కువ రక్తపాతంతో, అంత తక్కువ హింసతో కోట్లకొలది స్త్రీ పురుషుల భవిష్యత్‌ను మార్చే మహద్ఘటన ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు. మహాత్మా గాంధీ నాయకత్వమే దీనికి కారణం. మన జాతిపిత అంటే ఆయనే. 
స్వాతంత్య్ర సాధనకై అహింసా పోరాటాన్ని సాగించడంలో ఆయన మనకు నాయకత్వం వహించాడు. ఆ స్వాతంత్య్రాన్ని ప్రజాసేవలో ఫలవంతం చెయ్యడానికి ఆయన మార్గం చూపించారు''.

ఈ అభిప్రాయం తో ఒక్క వ్యక్తి మాత్రమే ఏకీభవించలేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు. గాంధీజీయే. టెండూల్కర్‌ ఇలా రాశారు- ( టెండూల్కర్, గాంధీ గారి జీవిత చరిత్ర రాశారు. దీనిని గాంధీగార చదివి ఆమోదించారు)

''దేశమంతటా ఉత్సవాలు జరుగుతున్నాయి. విదేశీ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరచడంలో విశేష పాత్ర వహించిన వ్యక్తి మాత్రం ఆ ఉత్సవాల్లో పాల్గోలేదు. భారత ప్రభుత్వం ప్రచార శాఖకు సంబంధించిన ఒక ఉద్యోగి సందేశం ఇవ్వమంటూ గాంధీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పేదేమీ లేదన్నారు. సందేశం ఇవ్వకపోతే బాగుండదని ఆయనన్నారు. 'సందేశం ఏమీ లేదు. బాగుండకపోతే పోనీ' అని గాంధీజీ సమాధానం ఇచ్చారు.'' (సం.8, పుట 95-96)


మరో అయిదు నెలలకు 1948 జనవరి 26న గాంధీజీ చంపివేయబడటానికి నాలుగు రోజుల ముందు - ఆయన ఇలా అన్నారు - ''జనవరి 26 స్వాతంత్య్రదినం. అంతవరకు మనకు కనిపించని, చేజిక్కని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజుల్లో ఈ ఉత్సవం జరపడం బాగానే ఉండేది. కాని ఇప్పుడంటారా, అది మన చేతికి వచ్చింది. కాని మనం ఆశించినది మాత్రం రాలేదు. మీ మటుకు ఏమోగాని, నా మటుకు మాత్రం జరిగినదిదే.'' (సం. 8, పుట 338)

ఈ నిరాశకు కారణం దేశమంతటా విజంభించిన మతోద్రేకాలే. 1946-47లో బ్రిటిష్‌ ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ తదితర పార్టీల నాయకులకూ మధ్య చర్చలు జరిగిన అనంతరం భారత జాతీయోద్యమ చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి భయంకరమైన ఉద్రేకాలు చెలరేగాయి. ఆగస్టు 15కు ముందు నెలల్లో జరిగినట్లు ఒక వైపున ముస్లింలు, మరొక వైపున హిందువులు, శిక్కులు ఎన్నో వేల మంది ఒకరినొకరు హత్య చేసుకున్నారు.
భారత ప్రజలకు తాను నిర్దేశించినది ప్రేమ మార్గమే కాని ద్వేష మార్గం కాదని గాంధీజీ ఎప్పుడూ చెప్తూండేవారు. భారత ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే... దేశాన్ని మహా క్రూరంగా అణచి పెడుతూన్న బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల హృదయాలను మార్చివేయగలుగుతారని ఆయన అభిప్రాయం. కాని, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల హృదయాలను మార్చటం మాట అట్లా వుంచి, మన దేశ ప్రజల హృదయాలను ఐక్యపరచడంలో ఆ విధానం విఫలమయ్యే పరిస్థితి ఏర్పడింది.
తాను తన జీవితమంతా బోధించిన సిద్ధాంతాలు అధికార సంక్రమణాన్ని తెచ్చి పెట్టిన పరిస్థితులచే ఓడింపబడ్డాయే గాని జయించలేదని ''పూర్తిగాను, నిరాడంబరంగాను'' అంగీకరించినది గాంధీజీయే. జూలై 14న ఆయన ఇలా అన్నారు.

''ఈ 30 ఏళ్ళూ మనం ఆచరించినది అహింసాయుత ప్రతిఘటన కాదు, నిష్క్రియా ప్రతిఘటన. ఇది మన అశక్తత. సాయుధ ప్రతిఘటన చేయడానికి అయిష్టత మూలంగా నీరసమైన ప్రతిఘటన చేశాం. ఉక్కు గుండెలు కలవాళ్ళు మాత్రమే ప్రతిఘటన చేయగలరు. అదెట్లాగో చేతనయితే, స్వతంత్ర భారతదేశం ప్రపంచం ముందు మరొకలా కనిపించేది. ఇప్పటిలాగా రెండుగా చీల్చబడటం, పరస్పరం అనుమానాలతో కొట్టుమిట్టాడటం వుండేది కాదు. సాధారణ ప్రజానీకానికి మతమంటే ఏమిటో తెలియదు. వాళ్ళకు దేవుడొక్కడే. జీవితావసరాలు ఆ దేవుడు. ఆకలికి నకనకలాడుతున్న ఆ దిగంబర ప్రజాకోటికి ఇంత తిండీ బట్టా పెట్టే ఆలోచన మాని ఈ రెండు భాగాలూ ఒకదానితో ఒకటి సంఘర్షణ పడుతున్నాయి''. (సం.7, పుట 57)

గాంధీజీ జీవించి వున్న ఆఖరి క్షణం వరకూ తనకు తోచిన పద్ధతిలో దుష్ట మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడటం ఆయన గొప్పతనం. 1946 ఆగస్టు 16వ తేదీని ముస్లింలీగు ''ప్రత్యక్ష కార్యాచరణ'' దినంగా ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో మొట్టమొదటి సారిగా మత కలహాలు బయలుదేరాయి. దేశమంతటా మతోద్రేకాలు ప్రమాదకరంగా పెరిగిపోయేటట్లు కనపడ్డాయి. ఆ క్షణం నుంచి గాంధీజీ మత సామరస్యం బోధించడానికి తన శక్తినంతటినీ వినియోగించారు. కొట్లాటలు పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్నాయనగానే, ఇతర పనులన్నీ కట్టిపెట్టి ఐక్యతా ప్రబోధానికై ఉద్యమించారు. ఆనేక వారాలపాటు బెంగాల్‌ లోని నవఖలీ జిల్లాలో గ్రామ గ్రామం తిరిగారు. అదే ప్రచారంలో నవఖలీ నుంచి బీహారు వెళ్ళారు. అక్కడ నుండి పంజాబు వెళ్ళాలని ఆయన ఊహ. అక్కడ నుండి కలకత్తా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. మతోద్రేకాలను ప్రతిఘటించటం, కొట్లాటల్లో బాధపడినవారికి సహాయం చెయ్యడం, కాందిశీకులకు రక్షణ ఇవ్వటం మొదలైన సమస్యలు ప్రార్ధనానంతర ఉపన్యాసాలలో ప్రాముఖ్యత వహించేవి.
కాని, ఆయన సందేశం వెనుకటంత ఉపయోగకరంగా లేదని స్పష్టమయింది. చివరలో ఆయన ఎదురుగుండా ఉంటే చాలు. ఉపవాసం చేస్తే చాలు - మత ద్వేషాలు పెరగకుండా ఆగేవి. వివిధ మతాల నాయకుల్ని ప్రజల్ని ఐక్యపరచేవి. ఇప్పుడు నవఖలీ, బీహారు, కలకత్తా, ఢిల్లీ మొదలైన ప్రదేశాలకు ఆయన వెళ్ళడం వలన కలహాలు కొంతకాలం ఆగినా, దూర ప్రదేశాల మాట అటుంచి ఆయన ఉన్న చోట కూడ పరిస్థితులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.
మత సామరస్యం కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తే దాని మీదికి రెండు మతాలకూ చెందిన దురహంకారులు విరుచుకు పడేటంతగా మత ద్వేషాలు పెరిగి ఉన్నాయని గాంధీజీ ఎరుగును. మత ద్వేషాలను ప్రతిఘటించడంలో తనకు ప్రమాదం రాగలదని కూడ ఆయన ఎరుగును. 

జనవరి 28వ తేదీన రాజకుమారి అమత కౌర్‌తో మాట్లాడుతూ తనను ''ఏ పిచ్చివాడో కాల్చి చంపే'' అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. అటువంటిది తటస్థపడితే ''చిరునవ్వుతో స్వీకరిస్తాను. నాలో కోపం ఉండకూడదు. హదయం లోను, పెదవుల మీద కూడ భగవంతుడే ఉండాలి'' అన్నారు. ఈ మాటలన్న రెండు రోజులకే ఆ దుర్ఘటన జరిగింది.
('మహాత్ముడు-ఆయన సిద్ధాంతాలు' పుస్తకం నుంచి)