Sunday, October 18, 2020

వందేళ్ల వందనం ! వడలని ప్రస్థానం !!


 ఎరుపులోనె మెరుపుంది
పోరాడే శక్తుంది
శ్రమజీవుల హక్కులకై
ఎలుగెత్తే బలముంది! - సుబ్బారావు పాణిగ్రాహి.


చరిత్ర నిరూపించిన సత్యానికి అక్షర రూపమిది. ప్రపంచ చరిత్రలో ఎందరెందరో మహరాజులు, సామ్రాట్టులూ హంగు దర్పాలతో అలరారుతున్న అధునాతన పాలకవర్గ నేతలూ ఎవరూ ఇవ్వని విశ్వాసమిచ్చిన చైతన్యం నింపిన మహత్తర సిద్ధాంతం, ఆచరణల సమతా సమరానికి ప్రతీకగా నిలిచిన వందేళ్ల ప్రస్థానం సంస్మరించుకుంటోంది భారతదేశం. 


ఇలాంటి సమయంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమ ఔన్నత్యానికి జేజేలు పలికే బదులు శాపనార్థాలు పెట్టేందుకు, దీనాలాపనలు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. 'వందేళ్ల వర్గ పోరాట వక్రీభవనం' (ఆంధ్రజ్యోతి-17.10.20) అంటూ తేల్చిపారేస్తున్నారు. 

వేల సంవత్సరాలలో ఘనీభవించిన దోపిడీ వర్గాల శక్తియుక్తులనూ అపారంగా వారికి అందుబాటులో వున్న భౌతిక, బౌద్ధిక వనరులను ప్రత్యక్ష ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రచార యంత్రాన్ని గమనించకుండా భారత దేశంలోని కమ్యూనిస్టు పార్టీలూ బృందాలూ అన్నీ విఫలమైపోయాయని తేల్చిపారేస్తున్నారు. 

మరో వంక సామ్రాజ్యవాద ప్రపంచ నేతగా వున్న అమెరికా అధ్యక్షుల వారికి తన ఎన్నికల ప్రత్యర్థి కమలా హారిస్‌ కమ్యూనిస్టుగా కనిపిస్తున్నారు. భారతీయ ట్రంప్‌ లాంటి నరేంద్ర మోడీజీకి జెఎన్‌యులో, హెచ్‌సియులో, కరోనాతో కదలిన వలస కార్మికుల అలజడిలో, సిఎఎపై ఎలుగెత్తిన షహీన్‌బాగ్‌ నిరసనలో ప్రతి చోటా కమ్యూనిస్టులే కనిపిస్తున్నారు. మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నుంచి మావోయిస్టుల వరకూ అందరూ జాతి ద్రోహులుగా అగుపిస్తున్నారు. 

వందేళ్లనాడు భారత కమ్యూనిస్టు ఉద్యమ అంకురార్పణ చేసిన తొట్ట తొలి తరం యోధులపై మీరట్‌, కాన్పూర్‌ కుట్రకేసులు పెడితే... ఇప్పుడు కూడా షహీన్‌బాగ్‌, భీమా కోరెగావ్‌, ఆఖరుకు హథ్రాస్‌ ప్రతి చోట ప్రతీఘాత శక్తులకు ఇదే ప్రత్యామ్నాయ చైతన్యం భయంగొల్పుతున్నది. 


'ఈ నాడు యూరప్‌ను ఒక భూతం భయపెడుతున్నది' అన్న కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రారంభ వాక్యాలు ఇప్పటి పాలక వర్గాలకూ అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ముప్పై ఏళ్ల కిందట సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత ప్రతికూల పరిణామాలు ఉద్యమాభిమానులకు ఎంత బాధాకరమైనప్పటికీ భూతాన్ని సీసాలో బంధించడం మాత్రం జాతీయ అంతర్జాతీయ పాలకవర్గాల తరం కాలేదు. వడలని సంకల్పంతో సమరం సాగుతూనే వుంది. వాస్తవాలను ఆకళింపు చేసుకుంటూ తప్పొప్పులు దిద్దుకుంటూ పున: ప్రస్థానం చేస్తూనే వుంది.


పాక్షికత్వంతో పరాచకాలు


వామపక్ష పదజాలం వల్లించే కొందరు విమర్శకులు ఈ మొత్తం పరిస్థితి గమనిస్తున్నారా అని సందేహం కలుగుతుంది. అధ్యయనంతో రచనలతో తలపండిన రచయితలకు రచయిత్రులకు కూడా కమ్యూనిస్టుల వైఫల్యాలే కనిపిస్తున్నాయి. మార్క్స్‌, ఎంగెల్సులు అంత సూటిగా రాస్తే ఈ పార్టీల నాయకులు ఎందుకు పట్టుకోలేకపోయారని పడక కుర్చీలలో కూర్చుని లేదా ఇంటర్‌నెట్లు శోధిస్తూ కొందరు తెగ ఇదై పోతున్నారు. ఇంతా చేసి ఈ వందేళ్లలో పాలకవర్గాల పన్నాగాలనూ కమ్యూనిస్టులు ఎదుర్కొన్న ఘోర నిర్బంధాన్ని, చేసిన బలిదానాలనూ అవగాహనలో, ఆచరణలో సైద్ధాంతిక నిర్మాణ సమస్యలనూ లోతుగా పరిశీలించే ఓపిక వుంటుందా! అదీ నాస్తి. 


ఈ వందేళ్లలోనూ కమ్యూనిస్టులు ముళ్లదారిలో నడిచారే గాని పూల బాటలో పయనించలేదని గుర్తించ లేకపోవడం...ఆ ముళ్ల పొదల మాటు నుంచి కాలసర్పాలు వారిని ఎన్నిసార్లు కాటేశాయో, ఇంకా వేస్తూనే వున్నాయో అర్థం కాకపోవడం...ఈ ఆరోపణలకూ ఆవేదనలకూ అసలు కారణం. విజ్ఞానశాస్త్రంలో ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం ప్రకారం వక్రీభవనం అంటే ఏంటో తెలుసు. ఒక వాహకం లోంచి మరో దానిలోకి మారినప్పుడు అంటే గాలి లోంచి నీటి లోకి మారినపుడు కాంతి గమనం నెమ్మదించి వంగినట్టుగా కనిపిస్తుంది. అంతేగాని ఆగదు. అలాగే దేశంలో ప్రపంచంలో పరిస్ధితులు, వర్గశక్తుల బలాబలాలు, పొందికలు మారినప్పుడు రాజకీయ గమనంలో హెచ్చుతగ్గులు వుంటాయి. సామాజిక శాస్త్రం కూడా అయిన మార్క్సిజాన్ని దాన్ని ఆచరణలో అమలు చేసి అపూర్వమైన మార్పులు తెచ్చిన కమ్యూనిస్టుల పాత్రనూ దృష్టి దోషాలతో చూస్తే అలాగే వుంటుంది. 


వందేళ్లలో ప్రపంచమంతా మార్చలేకపోగా బలహీనమవడం కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమైనట్టు గోచరిస్తుంటుంది. చరిత్రను సరిగా చూడకపోబట్టి చారిత్రిక తప్పిదాలు అన్న మాట పరాచికంగా మారిపోతుంటుంది. అలాంటి వారు శత్రు శిబిరానికి చెందినవారైతే ముఖం వాచేలా సమాధానం చెప్పడం మిత్రబృదంలో వారైతే సహనంతో తెలియజెప్పడం మాత్రమే మార్గం.

యథాస్థితికి కంచుకోటలే!

కమ్యూనిస్టేతర శక్తులేవీ సైద్ధాంతికంగా ఈ వ్యవస్థను మార్చే లక్ష్యం వున్నవి కావు. అంటే దానితో ముడిపడిన అసమానతలూ వివక్షతలూ దోపిడీ, పీడన కొత్త రూపాలలో కొనసాగించేవే గాని తుదముట్టించేవి కావు. మహా అయితే కొన్ని సంక్షేమ పథకాలతో సరిపెట్టి అంతకు పదింతల సంపదలు శతసహస్ర కోటీశ్వరులకు ధారాదత్తం చేస్తూనే వుంటాయి. ఆరేళ్ల మోడీ పాలనలో అయిదు రెట్లు పెరిగిన ముఖేష్‌ అంబానీ ఆస్తి, మూడు రెట్లు పెరిగిన గౌతం అదానీ ఆస్తులూ, వంద రెట్లు పెరిగిన మత విద్వేషాలు, కులాల వివక్షలూ, ట్రంప్‌ కంపు వ్యవహారాలూ కనిపిస్తూనే వున్నాయి. వీటిపై నికరంగా నిశ్చలంగా విమర్శ చేస్తున్నదీ వీరోచితంగా పోరాడుతున్నదీ ప్రగతిశీల శక్తులు తప్ప గొప్పలు పోయే పాలకవర్గాలు కాదు. 

అయితే లెనిన్‌ అన్నట్టు కార్మిక వర్గ పోరాటంలో అతి భీకరమైన భాగం సైద్ధాంతిక రంగంలో జరుగుతుంది. సోషల్‌ మీడియా వ్యాప్తి, ఆరెస్సెస్‌ బిజెపిలు దాన్ని విషప్రచార సాధనంగా మార్చుకోవడం జరిగాక అనుక్షణం అసంఖ్యాక కథనాలు చెలరేగిపోతున్నాయి. ప్రత్యక్ష అణచివేతలూ చెలరేగిపోతున్నాయి. భారతీయ సమర క్షేత్రంలో అరుణ పతాకానికి వందేళ్ల వందనం సమర్పించేప్పుడు ఈ శక్తులను పసిగట్టి పని పట్టడానికి పటిష్టమైన యోచనలు, ఆచరణ తప్పనిసరి. 

ఉద్యమంలో కదం తొక్కే అరుణ సైన్యానికి అండగా అశేషమైన అభిమానులూ శ్రేయోభిలాషులూ వాటిని గమనిస్తూనే వున్నారు గనక నిరంతర తోడ్పాటు కొనసాగిస్తున్నారు. ఎర్ర జండా అండనే పోరాటాలు సాధ్యమని శ్రమజీవులూ నిరుపేదలూ నమ్ముతున్నారు. ఎవరో కవి అన్నట్టు 'పీడితులు, తాడితులు, కార్మికులు, కర్షకులు నీ నీడనే నేడు నిలిచి వున్నారే..నిన్ను నమ్ముకునే వారు బతుకుతున్నారే.. నీకు సాటెవ్వరే సమతా పతాకా' అని పాడుతూనే వున్నారు. మరింత గట్టిగా పోరాడాలని కమ్యూనిస్టులపై వీరు చేసే ఫిర్యాదు వాస్తవానికి వారి గౌరవాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. 


సామ్రాజ్యవాద ప్రపంచీకరణ యుగం దాన్ని కాపాడటానికి మత మార్కెట్‌ శక్తులు కలసి తీసుకొచ్చిన జాతి మత చాందస శక్తుల స్వైర విహారం ఆందోళనకరమే. కాని కమ్యూనిస్టులు ఈ పరిస్థితికి దీటుగా తమను తాము మల్చుకోవడం, మార్చుకోవడం క్షణాల మీద జరిగిపోదు. వర్గ సమరం సాగిస్తూ అంతర్గత దిద్దుబాట్లు చేసుకోవడానికి ఈ శతవార్షిక సందర్భమే సరైంది. వర్గ పోరాటంలో సిద్ధాంతాన్ని మించిన ఆయుధం లేదన్నట్లే ఐక్యతను మించిన పునాది కూడా వుండదు. ఈ రెంటినీ మేళవించే నవయుగ సైనికుల పతాకమే అరుణ పతాకం.


సిపిఐ(ఎం) విలక్షణ పాత్ర


ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర చాలా సుదీర్ఘమైంది. ప్రభావశీలమైంది కూడా. అనేకసార్లు సరైన దిశా నిర్దేశం చేసింది. ప్రజాచైతన్యం పెంచింది. కేవలం గతం ఘనతనే కీర్తించే ఈ పుణ్యభూమిలో నవచైతన్యాంకురాలు నాటింది. ప్రత్యామ్నాయ ప్రజా సాహిత్య సంస్మృతులను సృజించడమే కాదు. ఉద్యమాలలోనూ పాలనలోనూ కూడా ఆ శక్తుల నమూనాను చూపించింది. వామపక్ష శిబిరంలో అన్ని స్రవంతులనూ విచక్షణా రహితంగా ఈసడించే సిద్ధాంత కోవిదుల మాట ఎలా వున్నా ఆ మౌలిక భావనలను సజీవంగా వుంచడానికి ప్రధానమైన వామపక్షంగా సిపిఎం చొరవ చూపింది. 1998లో మార్క్స్‌ 125వ వర్ధంతిని దేశ దేశాల కమ్యూనిస్టు వర్కర్స్‌ పార్టీల సమ్మేళనంతో జరిపి చెల్లాచెదురుగా వున్న విప్లవకర శక్తులకు కొత్త ఊపిరిలూదింది. పదవుల లోకి రావడమే విజయమనుకుంటే సిపిఎం నేత పాతికేళ్ల కిందటే భారత ప్రధాని అయివుండేవారని మర్చిపోరాదు. సరళీకరణను, గరళీకరణగా మారుతున్న తీరును చెప్పి దేశవ్యాపితంగా కోట్లాది మంది కార్మికులను సమరపథంలో నడిపిస్తున్న తీరుకు రేపు నవంబర్‌లో జరిగే సమ్మె కూడా సంకేతం కానుంది. ఇటీవల వక్రమార్గాలతో పార్లమెంటులో ఆమోదించుకున్న రైతు వ్యతిరేక బిల్లులపై పోరాటం జరుగుతూనే వుంది. హథ్రాస్‌లో అమానుషంగా బలైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం, ఐద్వా బృందంతో ఆ గృహస్తుడు తాను కార్మిక సంఘంలో పని చేశానని, కమ్యూనిస్టులే ప్రజల కోసం నిలబడతారని చెప్పడం ఈ దేశంలో కమ్యూనిస్టులు విత్తిన చైతన్యానికి ఒక నిదర్శనం.


ఎర్రబావుటా నిగనిగలు


పిడుక్కూ బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు తీరిగ్గా కూర్చుని తిట్టేవాళ్లు తిట్టవచ్చుగాక. తిన్నది అరగని పాలకవర్గ ప్రవక్తలు శాపనార్థాలు పెట్టవచ్చుగాక. ఎక్కడికీ తృప్తి లేక ఇంకా ఇంకా సంపదల కోసం వెంపర్లాడే ధనస్వామ్య భూస్వామ్య అభివృద్ధి నిరోధక శక్తులు సామదానభేద దండోపాయాలను ప్రయోగించుగాక. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మతాన్ని గతాన్ని కూడా తోడు తెచ్చుకుని నిలవాలని పాచికలు వేయొచ్చుగాక. 


ఇవన్నీ ఎన్నో చూసిన తర్వాత కూడా ఎర్రజెండా పైపైకి ఎగురుతూనే వుంది. ఉంటుంది. 'కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు' అని ప్రశ్నిస్తూనే వుంది. 'ముళ్లూ రాళ్లూ అవాంతరాలు ఎన్ని వున్నా ముందు దారి మాదే..మాదే..' అని ప్రకటిస్తోంది. వక్రీభవనం కాంతి మార్గాన్ని తప్పుగా చూపిస్తుందేగాని గమనాన్ని ఆపలేదన్న శాస్త్రీయ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఈరోజు దేశమంతటా ఉద్యమ కేంద్రాలలో ఎగిరిన అరుణ పతాకాలే అందుకు సాక్ష్యం. 

......... ప్రజాశక్తి, 18.10.2020, తెలకపల్లి రవి వ్యాసం  

శత వసంతాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు ఉద్యమం

 

శత వసంతాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు ఉద్యమం గురించి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులు, అభిమానులు చర్చించుకుంటున్నారు, ఈ నూరేళ్ళ కాలంలో ఉద్యమ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాళ్ళను స్మరించుకుంటున్నారు. ఈ ఉద్యమానికి బీజాలు వేసిన వైతాళికులను, ఉద్యమ సారథులను స్మరించుకుంటున్నారు. భారత దేశంలో సమసమాజాన్ని నిర్మించాలనే ఆశయ సాధనకు పునరంకితమౌతున్నారు.

కమ్యూనిస్టు ఉద్యమం నామరూపాలు లేకుండా పోవాలని మొదట్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, ఆ తర్వాత భారత పాలక వర్గాలు, వారి ప్రతినిధులు ఈ వందేళ్లుగా కోరుకుంటూనే వున్నారు, శాపనార్ధాలు పెడుతూనే వున్నారు. అయినా కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతూనే వుంది. 

అయితే, సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత నయా ఉదారవాద విధానాలు ఆర్థిక రంగంలోనే గాక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సైతం పైచేయి సాధించడం, మరోపక్క మితవాద శక్తులు, మతతత్వ శక్తులు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం వెనుకపట్టు పట్టింది. ఈ వెనుకపట్టు తాత్కాలికమే.

పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదంటూ విర్రవీగిన వారంతా నేడు ఆ వ్యవస్థ సృష్టించిన సార్వత్రిక సంక్షోభాన్నుంచి బైటపడేదారి తోచక ఆ ఊబిలో అంతకంతకూ దిగబడిపోతూన్న వైనం నేడు మనం చూస్తున్నాం. గత పన్నెండేళ్ళుగా ఈ సంక్షోభం చుట్టుముట్టి వున్నా, అంతకంతకూ ప్రజల జీవితాలు దుర్భరమౌతున్నా, తమను తామే కాపాడుకోలేని స్థితిలో పెట్టుబడిదారులు పడిపోతున్నా, ఇంకా ఈ విఫల వ్యవస్థనే సమర్థించుకుంటూ, కిందపడినా నాదే పైచేయి అన్న తంతుగా వ్యవహరిస్తున్నారు పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తలు. 'కమ్యూనిస్టులు ఏం సాధించారండీ?' అని అడుగుతున్నారు. మన సమాధానం వినకుండానే 'ఏమీ సాధించలేదు' అని తీర్పు చెప్పేస్తున్నారు.

మన దేశ స్వాతంత్య్రానికి కావలిసిన అంతర్జాతీయ భూమికను ఏర్పాటు చేసింది కమ్యూనిస్టు ఉద్యమమే. ప్రపంచాన్ని మొత్తంగా తమ గుప్పెట్లో బంధించుకుని వలస పాలనను సాగించిన సామ్రాజ్యవాదాన్ని దెబ్బతీసినదెవరు? తనకెదురు లేదని విర్రవీగుతూ ప్రపంచాన్ని కబళించాలని చూసిన హిట్లర్‌ ఫాసిస్టు నాజీయిజాన్ని మట్టి కరిపించి బెర్లిన్‌ నగరంలో ఎర్రజెండాను ఎగురవేసిందెవరు? అటు ఫాసిస్టు ప్రమాదం నుంచి యావత్‌ ప్రపంచాన్నీ కాపాడడమేగాక, మూడో ప్రపంచ దేశాలపై సామ్రాజ్యవాదులు సాగిస్తున్న వలస దోపిడీ పాలనకు చరమగీతం పాడింది సోషలిస్టు రష్యా. ఆ యుద్ధంలో హిట్లర్‌ దెబ్బకు తట్టుకోలేక చతికిలబడి, చితికిన బ్రిటిష్‌ పాలకులు అనివార్యంగా వలస దేశాలపై తమ పెత్తనాన్ని వదులుకోవలసి వచ్చింది. వలస పాలనను నిర్మించింది పెట్టుబడిదారీ విధానమైతే, దానిని తుదముట్టించడానికి ప్రాతిపదిక ఏర్పరచింది కమ్యూనిస్టులు.

మన దేశంలో జాతీయోద్యమం మొదట్లో కేవలం కొద్దిమంది మేధావులకు, మధ్యతరగతికి మాత్రమే పరిమితమై ఉండేది. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న డిమాండ్‌ను కూడా చేయలేని స్థితిలో ఉండేది. మనకు సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. దానికి ప్రజానీకం ఉత్సాహంగా స్పందించడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ లక్ష్యాన్ని అంగీకరించింది. అలా జాతీయోద్యమానికి లక్ష్యాన్ని నిర్దేశించడమేగాక, దానికి కండపుష్టిని కలిగించింది కూడా కమ్యూనిస్టులే. కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలను, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా సామాన్యులంతా స్వాతంత్య్ర సాధనకు కదిలేలా చేసింది. సామాన్యుడి దైనందిన సమస్యల పరిష్కారానికి, స్వాతంత్య్ర సాధనకు గల సంబంధాన్ని విడమరిచి చెప్పి మహోద్యమానికి పునాదులు వేసింది కమ్యూనిస్టులు.

ఆనాడు గాని, ఈనాడు గాని సామ్రాజ్యవాదులను పల్లెత్తుమాట కూడా అనకుండా వారికి తాబేదారులుగా వ్యవహరిస్తూ, ఆనాటి జాతీయోద్యమంలో ఎటువంటి పాత్రనూ పోషించని ఆరెస్సెస్‌, దాని అనుబంధ శక్తులు నేడు దేశభక్తిని గురించి బోధించేందుకు సిద్ధమైనాయి. ఎంత విడ్డూరం! విభజించి పాలించాలన్న బ్రిటిష్‌ ప్రభువుల వ్యూహానికి అనుగుణంగా దేశంలో మతతత్వానికి బీజాలు వేసి ఈ దేశం మూడు ముక్కలు కావడానికి కారకులైనవారే నేడు దేశభక్తి బోధనలకు పాల్పడుతున్నారు. నేటికీ వారి విదేశీ భక్తి వీసమెత్తు తగ్గలేదనడానికి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు గాని, ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తుతున్న తీరు గాని తార్కాణాలు.

స్వతంత్ర భారత దేశంలో మత విద్వేషాలను రగిల్చి గాంధీజీని హత్య చేసింది ఆరెస్సెస్‌. ఆ సమయంలో కమ్యూనిస్టులు దేశమంతటా ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి దేశ సమైక్యత కోసం నిలిచారు. మన దేశం పారిశ్రామికంగా స్వంత కాళ్ళపైన నిలబడేందుకు తోడ్పడిన ప్రభుత్వ రంగ స్థాపనకు సహకరించినది సోషలిస్టు దేశాలే తప్ప ఏ పెట్టుబడిదారీ దేశమూ అందుకోసం ముందుకు రాలేదు. ఇప్పటికీ మన దేశం కొంతైనా స్వావలంబనను నిలుపుకొనగలిగిందీ అంటే అది ఆ ప్రభుత్వరంగ పుణ్యమే. వెన్నెముక వంటి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ దేశాన్ని తిరిగి పరాధీనం చేయడానికి చూస్తున్నది బిజెపి ప్రభుత్వం. ఆ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోడానికి గత ముప్పై ఏళ్ళుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నది కార్మికులు తప్ప ఏ పెట్టుబడిదారుడూ కాదు. ఆ కార్మికులను బిజెపి (గతంలో కాంగ్రెస్‌) అణచి వేస్తుంటే కార్మికులకు అండగా నిలిచి ప్రభుత్వరంగ పరిరక్షణకు తోడ్పడుతోంది కమ్యూనిస్టులు.

భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినది, సాధించినది కమ్యూనిస్టులు. అలా ప్రజా పోరాటాల ద్వారా ఏర్పడిన రాష్ట్రాల వ్యవస్థను నాశనం చేస్తున్నది బిజెపి, ఆరెస్సెస్‌ శక్తులే. తెలుగుజాతిని నిలువునా చీల్చడానికి పుణ్యం కట్టుకున్నది వాళ్ళే. విశాలాంధ్రలో ప్రజారాజ్య స్థాపన కోసం వేలాదిమంది కమ్యూనిస్టులు, సామాన్య ప్రజలు ప్రాణాలను సైతం బలిపెట్టి సాధిస్తే, ఆ త్యాగాలను వమ్ము చేసింది బిజెపి, ఇతర పాలకవర్గాలే. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. కాశ్మీరీయులకు ఈ దేశం అంటేనే విముఖత ఏర్పడేలా చేస్తున్నారు. గతంలో ఖలిస్థాన్‌ వేర్పాటువాదం విజృంభిస్తే దానితో ఆరెస్సెస్‌ చేతులు కలిపింది. 'మా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం' అంటూ వందలాది కమ్యూనిస్టులు ప్రాణాలొడ్డి దేశ సమైక్యత కోసం నిలబడ్డారు.

దేశాభివృద్ధికి తోడ్పడిన ప్రణాళికాబధ్ధ అభివృద్ధి విధానానికి ప్రేరణ కమ్యూనిస్టు దేశాల అనుభవాలే. ఆ ప్రణాళికా విధానానికే తూట్లు పొడిచి విచ్చలవిడిగా దేశాన్ని కార్పొరేట్లకు పలహారంగా సమర్పిస్తున్నది బిజెపి. ఈ విద్రోహానికి తొలుత దారి తీసింది కాంగ్రెస్‌. ప్రణాళికా విధానంతో మనం ఆహార స్వయంసమృద్థిని సాధించుకున్నాం. ఇప్పుడు బిజెపి చేసిన వ్యవసాయ చట్టాలతో దానికి తూట్లు పడ్డాయి. దున్నేవానికే భూమి పంచాలని నినదించి, దానిని అత్యంత జయప్రదంగా అమలు చేసింది కమ్యూనిస్టులు. ఆ నినాదాన్ని వ్యతిరేకించి జమీందారులకు, భూస్వాములకు అండగా నిలిచింది ఆరెస్సెస్‌.

ఆహారం ఒక సార్వత్రిక హక్కు అని ప్రకటించి, పేదలకు చౌకగా ఆహారధాన్యాలను అందించాలన్న ఉద్యమాలను నడిపింది కమ్యూనిస్టులు. ప్రజాబలానికి తలొగ్గి పాలకులు అరకొరగానైనా ప్రజాపంపిణీ విధానాన్ని చేపట్టవలసి వచ్చింది. ఇప్పుడు దానిని నీరుగార్చి ఆహార హక్కుకు బిజెపి ఎగనామం పెడుతోంది. హక్కుల కోసం, మెరుగైన జీవితాల కోసం కార్మికులు పోరాడినప్పుడు వారికి అండగా నిలిచింది కమ్యూనిస్టులు. ఆ పోరాట ఫలితాలైన చట్టాలను తుంగలో తొక్కింది మాత్రం బిజెపి.

దేశంలో ఇందిరాగాంధీ హయాంలో నియంతృత్వం అమలు జరిగినప్పుడు దానిని ప్రతిఘటించి దేశవ్యాప్తంగా నిర్బంధాలను అనుభవించడమేగాక, వేలాదిమంది ప్రాణాలను సైతం బలి ఇచ్చింది కమ్యూనిస్టులు. తామూ ఆ ఎమర్జెన్సీని ఎదిరించామని చెప్పుకునే బిజెపి నేడు అదే ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రాల హక్కుల్ని సైతం కాలరాస్తోంది. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోంది. ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం, పునరావాస చట్టం వంటివి కమ్యూనిస్టుల జోక్యంతో, ఉద్యమాలతో వచ్చినవే. నేడు బిజెపి వాటినన్నింటినీ అపహాస్యం చేస్తోంది.

అధికారం చేతుల్లో వున్నా దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు లాక్‌డౌన్‌ మాత్రం ప్రకటించి, పి.ఎం.కేర్స్‌ పేరుతో డబ్బులు దండుకుంది బిజెపి. దేశానికే ఆదర్శంగా కరోనా నియంత్రణలో కేరళ ముందుంది. కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో అంతర్జాతీయంగా ప్రశంసలను పొందింది.

అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులు. అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి అధికారం చేజిక్కించుకున్నాక ఆ ప్రజలనే దోచుకునేది దోపిడీ వర్గాల పార్టీలు. కష్టజీవి ఆవేదన, ఆకాంక్ష, నిరసన, ప్రతిఘటన, కమ్యూనిస్టుల రూపంలో ప్రజల ముందుకొస్తుంది. ఆ కష్టజీవులపై దోపిడీని సాగించే వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు పోరాడుతూనే వుంటారు. కష్టజీవుల చేతుల్లోకి ఆ అధికారాన్ని బదలాయించే వరకూ పోరాడుతూనే వుంటారు. దోపిడీ నుండి, అణచివేత నుండి, సాంఘిక వివక్షత నుండి, అన్ని రకాల అన్యాయాల నుండి మనిషి విముక్తి పొందే వరకూ కమ్యూనిస్టులు ఉద్యమిస్తూనే వుంటారు. కుల వివక్షకు, లైంగిక వివక్షకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నాటి నుంచి నేటి వరకు పోరాడుతూనే వున్నారు. 

ఈ మహా ప్రయాణంలో అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తిన్నా, బలహీనపడినా, ఆ ఆటుపోట్లకు కమ్యూనిస్టులెన్నడూ కుంగిపోరు. పడి, లేచే కడలి తరంగాల్లా ఉవ్వెత్తున చెలరేగి ఆశయ సాధన దిశగా ముందుకే, మున్ముందుకే సాగుతారు. (ప్రజాశక్తి, 17.10.2020   సంపాదకీయం )

Friday, October 2, 2020

ఈ రోజు గాంధీ జయంతి సందర్భముగ చదవదగ్గవ వ్యాసం “ జాతీయ సమైక్యత- బాపూజీ”. రచయిత కామ్రేడ్ ఈ ఎం ఎస్ నంబూదిరిపాద్. ఈ వ్యాసం దిగువన ఇస్తున్నాము. 

జాతీయ సమైక్యత- బాపూజీ 


బ్రిటిష్‌ వారు అధికారాన్ని 1947లో తమ చేతిలో పెట్టటం ప్రపంచం లోనే ఒక అసాధారణ విషయంగా కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకుంటారు. ఫ్రాన్స్‌, రష్యా, చైనా మొదలైన దేశాలలో జరిగిన విప్లవాల్లా కాకుండా 1947 'ఇండియా విప్లవం' ఒక్క రక్తపు చుక్క కూడా కార్చకుండా సాధించబడిందనీ, దానికి కారణం అహింసావాది నాయకత్వమేననీ చెప్పుకుంటారు.

1947 ఆగస్టు 15న ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ దేశానికొక సందేశమిస్తూ ఈ విషయాన్ని సాధికారంగానే ప్రకటించారు.

'అంత తక్కువ రక్తపాతంతో, అంత తక్కువ హింసతో కోట్లకొలది స్త్రీ పురుషుల భవిష్యత్‌ను మార్చే మహద్ఘటన ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు. మహాత్మా గాంధీ నాయకత్వమే దీనికి కారణం. మన జాతిపిత అంటే ఆయనే. 
స్వాతంత్య్ర సాధనకై అహింసా పోరాటాన్ని సాగించడంలో ఆయన మనకు నాయకత్వం వహించాడు. ఆ స్వాతంత్య్రాన్ని ప్రజాసేవలో ఫలవంతం చెయ్యడానికి ఆయన మార్గం చూపించారు''.

ఈ అభిప్రాయం తో ఒక్క వ్యక్తి మాత్రమే ఏకీభవించలేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు. గాంధీజీయే. టెండూల్కర్‌ ఇలా రాశారు- ( టెండూల్కర్, గాంధీ గారి జీవిత చరిత్ర రాశారు. దీనిని గాంధీగార చదివి ఆమోదించారు)

''దేశమంతటా ఉత్సవాలు జరుగుతున్నాయి. విదేశీ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరచడంలో విశేష పాత్ర వహించిన వ్యక్తి మాత్రం ఆ ఉత్సవాల్లో పాల్గోలేదు. భారత ప్రభుత్వం ప్రచార శాఖకు సంబంధించిన ఒక ఉద్యోగి సందేశం ఇవ్వమంటూ గాంధీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పేదేమీ లేదన్నారు. సందేశం ఇవ్వకపోతే బాగుండదని ఆయనన్నారు. 'సందేశం ఏమీ లేదు. బాగుండకపోతే పోనీ' అని గాంధీజీ సమాధానం ఇచ్చారు.'' (సం.8, పుట 95-96)


మరో అయిదు నెలలకు 1948 జనవరి 26న గాంధీజీ చంపివేయబడటానికి నాలుగు రోజుల ముందు - ఆయన ఇలా అన్నారు - ''జనవరి 26 స్వాతంత్య్రదినం. అంతవరకు మనకు కనిపించని, చేజిక్కని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజుల్లో ఈ ఉత్సవం జరపడం బాగానే ఉండేది. కాని ఇప్పుడంటారా, అది మన చేతికి వచ్చింది. కాని మనం ఆశించినది మాత్రం రాలేదు. మీ మటుకు ఏమోగాని, నా మటుకు మాత్రం జరిగినదిదే.'' (సం. 8, పుట 338)

ఈ నిరాశకు కారణం దేశమంతటా విజంభించిన మతోద్రేకాలే. 1946-47లో బ్రిటిష్‌ ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ తదితర పార్టీల నాయకులకూ మధ్య చర్చలు జరిగిన అనంతరం భారత జాతీయోద్యమ చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి భయంకరమైన ఉద్రేకాలు చెలరేగాయి. ఆగస్టు 15కు ముందు నెలల్లో జరిగినట్లు ఒక వైపున ముస్లింలు, మరొక వైపున హిందువులు, శిక్కులు ఎన్నో వేల మంది ఒకరినొకరు హత్య చేసుకున్నారు.
భారత ప్రజలకు తాను నిర్దేశించినది ప్రేమ మార్గమే కాని ద్వేష మార్గం కాదని గాంధీజీ ఎప్పుడూ చెప్తూండేవారు. భారత ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే... దేశాన్ని మహా క్రూరంగా అణచి పెడుతూన్న బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల హృదయాలను మార్చివేయగలుగుతారని ఆయన అభిప్రాయం. కాని, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల హృదయాలను మార్చటం మాట అట్లా వుంచి, మన దేశ ప్రజల హృదయాలను ఐక్యపరచడంలో ఆ విధానం విఫలమయ్యే పరిస్థితి ఏర్పడింది.
తాను తన జీవితమంతా బోధించిన సిద్ధాంతాలు అధికార సంక్రమణాన్ని తెచ్చి పెట్టిన పరిస్థితులచే ఓడింపబడ్డాయే గాని జయించలేదని ''పూర్తిగాను, నిరాడంబరంగాను'' అంగీకరించినది గాంధీజీయే. జూలై 14న ఆయన ఇలా అన్నారు.

''ఈ 30 ఏళ్ళూ మనం ఆచరించినది అహింసాయుత ప్రతిఘటన కాదు, నిష్క్రియా ప్రతిఘటన. ఇది మన అశక్తత. సాయుధ ప్రతిఘటన చేయడానికి అయిష్టత మూలంగా నీరసమైన ప్రతిఘటన చేశాం. ఉక్కు గుండెలు కలవాళ్ళు మాత్రమే ప్రతిఘటన చేయగలరు. అదెట్లాగో చేతనయితే, స్వతంత్ర భారతదేశం ప్రపంచం ముందు మరొకలా కనిపించేది. ఇప్పటిలాగా రెండుగా చీల్చబడటం, పరస్పరం అనుమానాలతో కొట్టుమిట్టాడటం వుండేది కాదు. సాధారణ ప్రజానీకానికి మతమంటే ఏమిటో తెలియదు. వాళ్ళకు దేవుడొక్కడే. జీవితావసరాలు ఆ దేవుడు. ఆకలికి నకనకలాడుతున్న ఆ దిగంబర ప్రజాకోటికి ఇంత తిండీ బట్టా పెట్టే ఆలోచన మాని ఈ రెండు భాగాలూ ఒకదానితో ఒకటి సంఘర్షణ పడుతున్నాయి''. (సం.7, పుట 57)

గాంధీజీ జీవించి వున్న ఆఖరి క్షణం వరకూ తనకు తోచిన పద్ధతిలో దుష్ట మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడటం ఆయన గొప్పతనం. 1946 ఆగస్టు 16వ తేదీని ముస్లింలీగు ''ప్రత్యక్ష కార్యాచరణ'' దినంగా ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో మొట్టమొదటి సారిగా మత కలహాలు బయలుదేరాయి. దేశమంతటా మతోద్రేకాలు ప్రమాదకరంగా పెరిగిపోయేటట్లు కనపడ్డాయి. ఆ క్షణం నుంచి గాంధీజీ మత సామరస్యం బోధించడానికి తన శక్తినంతటినీ వినియోగించారు. కొట్లాటలు పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్నాయనగానే, ఇతర పనులన్నీ కట్టిపెట్టి ఐక్యతా ప్రబోధానికై ఉద్యమించారు. ఆనేక వారాలపాటు బెంగాల్‌ లోని నవఖలీ జిల్లాలో గ్రామ గ్రామం తిరిగారు. అదే ప్రచారంలో నవఖలీ నుంచి బీహారు వెళ్ళారు. అక్కడ నుండి పంజాబు వెళ్ళాలని ఆయన ఊహ. అక్కడ నుండి కలకత్తా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. మతోద్రేకాలను ప్రతిఘటించటం, కొట్లాటల్లో బాధపడినవారికి సహాయం చెయ్యడం, కాందిశీకులకు రక్షణ ఇవ్వటం మొదలైన సమస్యలు ప్రార్ధనానంతర ఉపన్యాసాలలో ప్రాముఖ్యత వహించేవి.
కాని, ఆయన సందేశం వెనుకటంత ఉపయోగకరంగా లేదని స్పష్టమయింది. చివరలో ఆయన ఎదురుగుండా ఉంటే చాలు. ఉపవాసం చేస్తే చాలు - మత ద్వేషాలు పెరగకుండా ఆగేవి. వివిధ మతాల నాయకుల్ని ప్రజల్ని ఐక్యపరచేవి. ఇప్పుడు నవఖలీ, బీహారు, కలకత్తా, ఢిల్లీ మొదలైన ప్రదేశాలకు ఆయన వెళ్ళడం వలన కలహాలు కొంతకాలం ఆగినా, దూర ప్రదేశాల మాట అటుంచి ఆయన ఉన్న చోట కూడ పరిస్థితులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.
మత సామరస్యం కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తే దాని మీదికి రెండు మతాలకూ చెందిన దురహంకారులు విరుచుకు పడేటంతగా మత ద్వేషాలు పెరిగి ఉన్నాయని గాంధీజీ ఎరుగును. మత ద్వేషాలను ప్రతిఘటించడంలో తనకు ప్రమాదం రాగలదని కూడ ఆయన ఎరుగును. 

జనవరి 28వ తేదీన రాజకుమారి అమత కౌర్‌తో మాట్లాడుతూ తనను ''ఏ పిచ్చివాడో కాల్చి చంపే'' అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. అటువంటిది తటస్థపడితే ''చిరునవ్వుతో స్వీకరిస్తాను. నాలో కోపం ఉండకూడదు. హదయం లోను, పెదవుల మీద కూడ భగవంతుడే ఉండాలి'' అన్నారు. ఈ మాటలన్న రెండు రోజులకే ఆ దుర్ఘటన జరిగింది.
('మహాత్ముడు-ఆయన సిద్ధాంతాలు' పుస్తకం నుంచి)

Friday, September 4, 2020

తీవ్రమవుతున్న వైరుధ్యాలు

 మార్క్సిస్టు మహౌపాధ్యాయుడు ఫ్రెడెరిక్‌ ఏంగెల్స్‌ ద్విశతజయంతి సందర్భంగా సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ ఉపన్యాసాన్ని కింద ఇస్తున్నాం. సిపిఐ(ఎం) ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ ఆన్‌లైన్‌ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అధ్యక్షత వహించారు... సంపాదకుడు


కామ్రేడ్స్‌
ముందుగా ఇటీవల మృతి చెందిన మన నాయకులు సున్నం రాజయ్య, షడ్రక్‌లకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను.
మహా విప్లవ కారుడు ఏంగెల్స్‌ కారల్‌ మార్క్స్‌కు స్నేహితుడు, సహచరుడు, భాగస్వామి. వారిద్దరూ కలిసి శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని రూపొందించారు. ఏంగెల్స్‌కు మార్క్స్‌కు సహాయకుడు మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు. కాని అది నిజం కాదు. ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ తాను స్వయంగా కార్మికోద్యమ సిద్ధాంతం, ఆచరణకు, శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికీ ఎంతగానో తోడ్పడ్డారు. ఆయన తొలి రచన ఇంగ్లండ్‌లోని కార్మికవర్గ పరిస్థితులపై 1844లో రాశారు. ఇంగ్లండ్‌లోని కార్మికవర్గం పరిస్థితులను అధ్యయనం చేసిన ఏంగెల్స్‌, మార్క్స్‌కన్నా ముందుగానే కార్మిక వర్గ కేంద్ర పాత్ర గురించి వివరించారు. మార్క్స్‌తో కలిసి ఆయన 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక రచించారు. ఆయన స్వయంగా 'వ్యక్తిగత ఆస్తి, కుటుంబం, రాజ్యాంగాల పుట్టక', 'యాంటీ డూరింగ్‌', 'డయలెక్టిక్స్‌ ఆఫ్‌ నేచర్‌' వంటి గ్రంధాలు రాశారు. ఏంగెల్స్‌కు విజ్ఞాన శాస్త్రాలంటే చాలా ఆసక్తి. తన కాలంలో ఉన్న అన్ని రకాల విజ్ఞాన శాస్త్రాలనూ ఆయన అధ్యయనం చేశారు. మార్క్స్‌, ఆయనా కలిసి మానవ విజ్ఞానాన్ని, కార్మికవర్గ సిద్ధాంతాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లారు. ఈ రోజు కూడా మార్క్సిజం అని మనం అంటున్నాం అంటే అది మార్క్స్‌, ఏంగెల్స్‌ ప్రతిపాదించిన సిద్ధాంతమే. అందువల్లనే ఆ మహనీయుడు ఏంగెల్స్‌కు 200వ జయంతి సందర్భంగా మనందరం నివాళులర్పిస్తున్నాం. మనందరం ఈ శాస్త్రీయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, కార్మిక వర్గానికి ఈ శాస్త్రీయ సిద్ధాంతం ఆయుధాన్ని అందించడమే మనం ఆయనకు నేడు ఇచ్చే ఘనమైన నివాళి.
ఈ రోజు మనం ప్రపంచంలో ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఈ రోజున కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆవహించింది. భారత దేశంలో కూడా అది ప్రబలింది. మన దేశంలో 20 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. 40 వేల మందికి పైగా మృతి చెందారు. ఈ మహమ్మారి పెట్టుబడిదారీ వ్యవస్థలోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. సమాజంలోని సంఘర్షణ సరిహద్దులను మనముందుంచింది. ప్రతి మహమ్మారిని కూడా ఆయా చారిత్రక, రాజకీయ, ఆర్థిక సందర్భంలో పరిశీలించాలి. ఈ రోజునున్న సందర్భం ఏమిటి?
ప్రపంచ వ్యాపితంగా నయాాఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. మన పార్టీ మహాసభ దీన్ని వ్యవస్థాగత సంక్షోభం అంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలేవీ నేటికీ 2008 ముందునాటి స్థితికి కోలుకోలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేడు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఆవహించింది. ప్రపంచంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ఏర్పడింది. పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఉత్పత్తి పడిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించినతరువాత ఎన్నడూ ఎరుగనంతటి స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆదాయాలు పడిపోయాయి. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఇదంతాకూడా ప్రపంచంలో వందలాది కోట్ల మంది ప్రజల జీవనాన్ని దిగజార్చింది.
పెద్ద బ్యాంకులకూ, బడా ఫైనాన్స్‌ కంపెనీలకూ, కార్పొరేట్లకూ బెయిలవుట్లు ఇవ్వడం ద్వారా ఈ సంక్షోభం నుండి బయటపడడానికి నయా-ఉదారవాద ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో సామాన్య ప్రజలు, శ్రామిక ప్రజల ఉపాధిని, జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మహమ్మారి సద్దుమణిగాక ఈ ప్రభుత్వాలు ప్రజలమీద పొదుపు చర్యలను రుద్దుతాయి. 2008 సంక్షోభం తరువాత మనం దీన్ని చూశాం. పొదుపు చర్యల పేరుతో ఉద్యోగాలు కత్తిరిస్తాయి, జీతాలకు కోతపెడతాయి, పెన్షన్లు తగ్గిస్తాయి. సాంఘిక సంక్షేమ సదుపాయాలను కుదిస్తాయి. ఆ విధంగా కార్మిక ప్రజల ఉపాధిమీద, జీవనం మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడి జరగబోతోంది. ఇది పెట్టుబడికీ, శ్రమకూ మధ్య వైరుధ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. ఈ దాడి వల్ల వర్గ పోరాటం తీవ్రమవుతుంది.
రెండవ అంశం, ఈ మహమ్మారికి ముందు నుండే సామ్రాజ్యవాద శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ఆధిపత్య ప్రభావం దీర్ఘకాలంగా తగ్గుతూ వస్తోంది. అయితే అది దుందుడుకు విన్యాసాల ద్వారా, సైనిక జోక్యాల ద్వారా, ఆర్థిక ఆంక్షల ద్వారా, బెదిరింపులు, వేధింపుల ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తోంది. ఈ మహమ్మారి సందర్భంగా కూడా అమెరికా ఎలా ప్రవర్తిస్తున్నదో మనం చూస్తున్నాం. అది తన దేశంలో కరోనాను కట్టడి చేయలేక చైనా మీద దాడి చేస్తోంది. ఎందుకంటే చైనా ఆర్థికంగా ముందుకు పోతున్నందున అమెరికా భయపడుతోంది. చైనా కూడా కరోనా మహమ్మారి వల్ల బాధపడింది. అయితే మూడు మాసాల్లో దాన్ని కట్టడి చేసి ఆర్థికంగా పుంజుకోవడం ప్రారంభించింది. ఈ రోజున చైనాను లక్ష్యం చేసుకుని అమెరికా తన మిత్రులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా నేడు చైనాతో ఘర్షణను తీవ్రతరం చేసింది. రానున్న రోజుల్లో సామ్రాజ్యవాదానికీ, సోషలిజానికీ మధ్య వైరుధ్యం తీవ్రతరమవుతుందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.
మూడవ అంశం, సోషలిస్టు దేశాలు వాటి ఆర్థిక స్థాయి, ఆదాయాల స్థితితో సంబంధం లేకుండా మహమ్మారిని కట్టడి చేయడంలో జయప్రదం అయ్యాయి. చైనా, వియత్నాం, క్యూబా తదితర సోషలిస్టు దేశాల్లో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ ఉండడం, ప్రజలను సమీకరించడం వల్ల అవి మహమ్మారిని అదుపు చేయగలిగాయి. మరోవైపు అమెరికా నేడు కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యధిక కేసులు అక్కడే ఉన్నాయి. అత్యధిక ప్రజలు అక్కడే మరణించారు. రోజురోజుకూ అమెరికాలో కరోనాబారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అక్కడ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ప్రయివేటీకరించబడింది గనుకనే ఈ దుస్థితి ఏర్పడింది. అక్కడ పెద్దపెద్ద ఆసుపత్రులు, సదుపాయాలు ఉన్నాయి. కానీ అవి కొనగలిగే వారికి మాత్రమే దక్కుతాయి. మహమ్మారిని ఎదుర్కోవడంలో పెట్టుబడిదారీ వ్యవస్థకూ, సోషలిజానికీ మధ్య తేడా ఏమిటో తెలిసిపోతున్నది. ఇది సోషలిజం ఔన్నత్యాన్ని, దాని శక్తిని తెలియజేస్తున్నది.
ఇక అంతర్జాతీయ పరిస్థితుల్లో చివరి విషయం ఏమంటే, పెట్టుబడిదారీ దేశాల మధ్య, సామ్రాజ్యవాద దేశాల మధ్య, అమెరికాకూ ఇతర దేశాలకూ మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. తన ఆదేశాలను రుద్దడం ద్వారా అమెరికా తన నాయకత్వ పాత్రను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఉదాహరణకు వాతావరణ మార్పుల ఒప్పందం విషయంలో అమెరికాకూ ఐరోపా దేశాలకూ మధ్య విబేధాలు తలెత్తాయి. అమెరికా ఈ ఒప్పందం నుండి ఎలా తప్పుకున్నదో మనం చూశాం. గతంలో అమెరికా ఐరోపా దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకున్నాయి. కానీ అమెరికా ఈ ఒప్పందం నుండి ఏకపక్షంగా బయటకు వచ్చేసింది. అయితే జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు దానితో ఏకీభవించలేదు. ఆ విధంగాసామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయి.
అందువల్ల ఈ నాడు ప్రపంచంలో నాలుగు ప్రధాన సామాజిక వైరుధ్యాలు తీవ్రతరమవుతున్నాయి. వీటితోపాటు మరో ప్రధాన వైరుధ్య కూడా తీవ్రమవుతోంది. అది వాతావరణానికీ, పెట్టుబడిదారీ వ్యవస్థకూ మధ్య వైరుధ్యం. నయా-ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో వాతావరణాన్ని రక్షించే అవకాశాలు లేవు గనుక వాతావరణ కాలుష్యం, భూతాపం, అడవులు తరిగిపోవడం, తీవ్రమైన తుపానులు, మరోవైపు దుర్భిక్షాలు, హిమనదులు కరిగిపోవడం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడం..వంటివన్నీ జరుగుతున్నాయి.
ఈ పూర్వరంగంలో మనం మన దేశంలో ఏం జరుగుతున్నదో పరిశీలించాలి. దేశంలో ఇప్పటికీ కరోనా మహమ్మారి తీవ్రంగా పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. రోజువారీ మరణాల విషయంలో మొదటి స్థానానికి చేరుకుంది. మన దేశంలో సరైన ప్రభుత్వారోగ్య వ్యవస్థ లేదన్న విషయం అందరికీ తెలుసు. భారత దేశం ప్రజారోగ్యం కోసం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ. మన పాలకులు నయా-ఉదారవాద పంథా చేపట్టారు గనుక మనకీ దుస్థితి వచ్చింది. ఈ విధానాల ప్రకారం ప్రభుత్వం ఆరోగ్యం, విద్య, ఇతర ప్రజావసరాల కోసం ఖర్చు చేయకూడదు. అందువల్లనే మనకు సరైన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ లేకుండా పోయింది. ఫలితంగా మన దేశంలో, ఆంధ్ర ప్రదేశ్‌తో సహా మహమ్మారి విజృంభించింది. దీనికి కేరళ మాత్రమే మినహాయింపు. ఎందుకంటే అక్కడ వరుసగా వామపక్ష ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొంతమేరకు పటిష్టమైన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం జరిగింది. అక్కడ ప్రజాస్వామిక పనివిధానం, అధికార వికేంద్రీకరణ, పటిష్టమైన స్థానిక సంస్థలు, ఇతర స్వయంసహాయ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆరోగ్య రక్షణ కోసం ప్రజలను సమీకరించగలిగాయి. అందుకే మనం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళ మహమ్మారిని సమర్ధవంతగా ఎదుర్కోవడం చూశాం.
లాక్‌డౌన్‌ సమయంలో మనం మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, అమానుష లక్షణాన్ని చూశాం. కోట్లాదిమంది వలస కార్మికులు వందలాది మైళ్లు నడుచుకుంటూ తమ గ్రామాలకు వెళ్లాల్సి వచ్చిందో చూశాం. ఈ క్రమంలో వందలాది మంది చనిపోయారు. గత నాలుగు మాసాల లాక్‌డౌన్‌, మహమ్మారి కాలంలో ప్రభుత్వం ప్రకటించిన బెయిలవుట్‌ ప్యాకేజీలో ఉద్యోగాలు, జీవనోపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కనీస ఉపశమనం కూడా కల్పించలేదు. ప్రజలకు నేరుగా సహాయం చేయడం కోసం జిడిపిలో కనీసం ఒక్క శాతం కూడా ఖర్చు చేయలేదు. అమెరికాతో సహా ఇతర పెట్టుబడిదారీ దేశాలు ఎంతో కొంత ప్రజలకు సహాయం చేశాయి. కానీ భారత దేశంలో ప్యాకేజీ మాత్రం బడా పెట్టుబడిదారులకూ, బడా ఫైనాన్స్‌ సంస్థలకు మాత్రమే ఉద్ధేశించి ఇచ్చారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఆర్థిక ప్యాకేజీలు రూపొందించి, ప్రకటించిన తీరులోనే మనకు ఈ ప్రభుత్వ వర్గ లక్షణం కనిపిస్తుంది. ఈ ప్యాకేజీ ప్రజలకు సహాయం కల్పించకపోగా ప్రయివేటీకరణను ఊపుగా అమలు చేసింది. ప్రభుత్వ రంగం సంస్థలతోపాటు సమాజంలోని అన్ని రంగాల్లో ప్రయివేటీకరణకు ద్వారాలు తెరిచింది. రైల్వేల్లో 131 రైలు మార్గాలను ప్రయివేటు వారికి అప్పజెప్పేస్తున్నది. బగ్గుతో సహా గనుల తవ్వకాలను ప్రయివేటీకరించింది. రక్షణ రంగంలోకి మరింత విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించింది, మరింత ప్రయివేటీకరించింది. లాక్‌డౌన్‌ను ఉపయోగించుకుని మన దేశంలోని అన్ని రంగాల్లో ప్రయివేటీకరణ ప్రణాళికలు అమలు చేసింది. దీని వల్ల మన ప్రభుత్వ రంగం నాశనమవుతుంది.
దీంతోపాటు కార్మిక వర్గంపై దాడులకు దిగింది. 13 రాష్ట్రాలు కార్మిక చట్టాలను సస్పెండ్‌ చేయడమో, పలుచబరచడమో చేశాయి. మోడీ ప్రభుత్వ సూచనలతో 8 గంటల పనిదినం 12 గంటలకు పెంచబడింది. ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌లలో కార్మిక చట్టాలన్నిటినీ మూడేళ్లపాటు సస్పెండ్‌ చేశారు. ఆ విధంగా లాక్‌డౌన్‌ రోజుల నుండి మోడీ ప్రభుత్వం ఒకవైపు ధనికులకూ, కార్పొరేట్‌లకూ ప్యాకేజీలు ఇస్తూ మరోవైపు కార్మికవర్గంపై దాడికి పాల్పడుతోంది. వీరిలో కూడా వలస కార్మికుల పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. ఇదంతా ఆర్థిక రంగంలో మోడీ కరోనా కాలంలో ప్రజలపై చేస్తున్న దాడులు.
మోడీప్రభుత్వ రెండవ దాడి హిందూత్వ ఎజెండా అమలు రూపంలో జరుగుతోంది. మహమ్మారి రాక ముందే జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్ధు చేశారు. 370 అధికరణ ద్వారా రాష్ట్రానికి లభించే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ముక్కలు చేశారు. మన దేశంలో జమ్మూ-కాశ్మీర్‌ మాత్రమే ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉంది గనుక వారు ఈ పనిచేశారు. ఆ రాష్ట్ర ప్రజలను ఈ నాటికి కూడా, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఏడాదితరువాత కూడా శిక్షిస్తూనే ఉన్నారు. మొదట వారిపై నిషేధాలు పెట్టారు, తరువాత లాక్‌డౌన్‌ పెట్టారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలకు నేటికీ 4జి కమ్యూనికేషన్‌ లేదు. 4జి మొబైల్‌ ఫోన్‌లు లేవు. ఇప్పటికీ అనేక మంది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారు. కొన్ని సార్లు వారిని విడుదల చేసినా వెంటనే గృహ నిర్భందంలో ఉంచుతున్నారు.
ప్రధానమంత్రి అయోధ్య వెళ్లి రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం మనకు తెలుసు. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఒక ప్రయివేటు ట్రస్ట్‌ రామ మందిరాన్ని నిర్మించాలి. కానీ ప్రధాన మంత్రి, ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గన్నారు. దాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. మోడీ ప్రభుత్వం కింద భారత దేశంలో లౌకిక తత్వం ఈ స్థితికి దిగజార్చబడింది. మనది పేరుకు మాత్రమే లౌకిక గణతంత్ర రాజ్యం. ఆచరణలో హిందూత్వ రాజ్యంగా మారిపోయింది. మెజారిటీ మతస్తుల రాజ్యంగా, హిందూ రాష్ట్రగా మార్చాలన్న సిద్ధాంతాన్నికి అనుగుణంగా ఆచరిస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో కూడా ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ముస్లింలను కరోనా కారియర్స్‌గా అభివర్ణిస్తూ ఎలా ప్రచారం గావించారో చూశాం. ఢిల్లీలో తబ్లిగి జమాత్‌ సమావేశం తరువాత ముస్లింలే దేశంలో కరోనా వైరస్‌ను వ్యాపింప జేస్తున్నారన్న ప్రచారాన్ని పనిగట్టుకుని చేశారు. ముస్లింలను బహిష్కరించాలి, వారి షాపుల్లో వస్తువులు కొనకూడదు, ముస్లిం వీధి వ్యాపారులను తరిమేయాలి అంటూ అనేక ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఆ విధంగా హిందూత్వ దాడి ఈ కాలంలో తీవ్రమైంది. ఢిల్లీలో గత మూడు మాసాలుగా సిఎఎ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వాయవ్య ఢిల్లీలో సృష్టించిన మతఘర్షణలకు ముస్లింలే కారణమంటూ వారిని అరెస్టులు చేశారు. ఢిల్లీలో సిఎఎ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన వారినందరిపై మతఘర్షణలకు కుట్రపన్నారంటూ ముద్రవేస్తున్నారు. యుఎపిఎ చట్టం కింద అనేక మందిని అరెస్టు చేశారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విద్యార్ధులను, ఉపాధ్యాయులను, రిటైర్డ్‌ స్కాలర్స్‌ను అరెస్టు చేశారు. ఇతర సామాజిక కార్యకర్తలను వెంటాడి వేధిస్తున్నారు. మహమ్మారి సమయంలో కోర్టులు పనిచేయకపోవడం వల్ల అరెస్టయిన వారిలో చాలా మందికి బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోడానికి కూడా అవకాశం ఉండడం లేదు. మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో ఇటువంటి పరిస్థితిని సృష్టించింది.
మూడవ విషయం, ప్రజాతంత్ర హక్కులపైనా, ప్రజా తంత్ర సంస్థలపైనా మోడీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. యుఎపిఎ చట్టం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, వారి కార్యకలాపాలు అరికట్టడానికి అమలు చేయాలి. కానీ దాన్ని నేడు ప్రతిపక్షాల కార్యకర్తపైనా, సామాజిక, ప్రజా కార్యకర్తలపైనా ప్రయోగిస్తున్నారు. దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి కాలంలోనే ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాను అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహమ్మారి ప్రారంభంలోనే మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పడదోశారు. ఇప్పుడు రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం పైనా, ప్రజాతంత్ర హక్కులపైనా దాడులు చేయడం, నిరంకుశ చట్టాలు ఉపయోగించడం మహమ్మారి కాలంలో పెరిగింది.
నాల్గవ అంశం, మహమ్మారిని ఉపయోగించుకుని వారు అధికారంపై తమ నియంతృత్వ పట్టును పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాతంత్ర సంస్థలన్నీ నిర్వీర్యం చేయబడుతున్నాయి.
అయిదవ విషయం, అమెరికా సామ్రాజ్యవాదంతో బంధాలను మరింత పెంచుకుంటున్నది. లడక్‌ సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల తరువాత మోడీ ప్రభుత్వం అమెరికాతో వ్యూహాత్మకంగా, సైనికంగా మరింత సన్నిహితం అయింది. ఈ నాడు అమెరికాతో వ్యూహాత్మకంగా జతకట్టడమే కాదు, మొత్తం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్‌ను అమెరికా అనుచర దేశంగా మార్చేస్తోంది.
మహమ్మారి కాలంలో నెలకొన్న పరిస్థితులివి. ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే పోయేట్లు లేదు. మరికొన్ని మాసాలుంటుంది. ఈ పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటూనే, భౌతిక దూరం పాటిస్తూనే, మాస్కులు ధరిస్తూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజాస్వామ్యంపై దాడులను ఎదుర్కోవాలి. గత రెండు మాసాలుగా మనం తక్షణం చేపట్టాల్సిన లక్ష్యాలగురించి చర్చిస్తున్నాం. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతున్న సమయంలో ప్రభుత్వం వరుసగా 16 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. దీన్ని ఎలా ప్రతిఘటించాలి? నిత్వావసరాల ధరలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ దారుల సంక్షోభం ఉండనే ఉంది. కార్మిక వర్గం దాడులకు గురవుతోంది. ఈ సమస్యన్నిటిపైనా మనం మెట్టుమెట్టుగా ప్రజలను కదిలించాలి. ఆందోళనలు చేయాలి. పోరాటాలు అభివృద్ధి చేయాలి. కరోనా ఉన్న కాలంలో దీన్నిమనం ఎలా చేయగలం?
దీనికి మార్గం ఏమంటే, మొదటి మెట్టుగా మనం స్థానిక సమస్యలను చేపట్టాలి. ఈ మహమ్మారి స్థానిక ప్రజల జీవనాన్ని, ఉపాధిని ఎలా దెబ్బతీసిందో పరిశీలించాలి, వారికి ఆహారం కావాలి. రేషన్స్‌ కావాలి. వారికి ప్రభుత్వం నుండి రావలసిన అనేక సదుపాయాల రావాలి. ఈ అన్ని సమస్యలను మనం కింది స్థాయి నుండి చేపట్టాలి. మెట్టుమెట్టుగా ప్రజలను సమీకరించాలి. ఆ ప్రాంతంలోని పరిస్థితిని బట్టి, కరోనా పరిస్థితి మెరుగుపడే దాన్ని బట్టి మరింత విస్తృత స్థాయిలో సమీకరణ చేపట్టాలి.
పార్టీ నిర్మాణ పరంగా చూస్తే కరోనా మహమ్మారి వల్ల మనం సాధారణ పద్ధతిలో పార్టీ పనిచేయడం సాధ్యం కాదు. ముందుగా మనం మన పార్టీ సభ్యులతో సంబంధంలో ఉండాలి. మన పార్టీ శాఖలు చురుకుగా పని చేసేట్లు చూడాలి. పార్టీ కమిటీలు అవసరమైతే ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవాలి. కానీ ఉన్న పరిస్థితుల్లో గరిష్ట స్థాయిలో పని జరిగే పద్ధతులు అవలంభించాలి.
మరోవిషయం ఏమంటే అనేక చోట్ల కార్మికవర్గం పోరాటాల్లోకి వస్తున్నారు. బగ్గు గనుల్లో కార్మికులు మూడు రోజులు సమ్మె చేసిన సంగతి మనకు తెలుసు. బగ్గు బ్లాకులను ప్రయివేటు వారికి వేలానికి నిరసనగా అయిదు బగ్గు గని కార్మిక సమాఖ్యలు ఇచ్చిన ఐక్య పోరాటంలో 5.3 లక్షల మంది కార్మికులు పాల్గన్నారు. దేశ వ్యాపితంగా ప్రతి బగ్గు గని ప్రాంతంలోనూ కార్మికులు మూడు రోజుల సమ్మెలో పాల్గన్నారు. దీనికి పెద్ద ఎత్తున కార్మికులను ఒక చోట సమీకరించాల్సిన అవసరం లేదు. ఈ సమ్మె జయప్రదం కావడంతో ఆగస్టులో వాస్తవ వేలం జరిగే టప్పుడు ఒక రోజు సమ్మె చేయాలని నిర్ణయించారు. స్కీమ్‌ వర్కర్లు సమ్మెకు వెళుతున్నారు. ఇలా సెక్షన్‌ తరువాత సెక్షన్‌ కార్మికులు పోరాటంలోకి వస్తున్నారు. ఇటువంటి పోరాటాలు ముందుముందు మరిన్ని వస్తాయి. మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాటిలో చురుకుగా పాల్గనడానికి, నాయకత్వం వహించడానికి చొరవ చూపాలి.
అదే సమయంలో మనం ప్రజల్లో డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని సోషల్‌ మీడియాలో రాజకీయ క్యాంపెయిన్‌ నిర్వహించాలి. ఈ క్యాంపెయన్స్‌లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఎండగట్టాలి. మన ప్రత్యామ్నాయ వేదికలను ప్రచారం చేయాలి. మనం డిజిటల్‌ టెక్నాలజీని, మనకున్న వనరులను ఉపయోగించుకుని ఈ క్యాంపెయిన్లన్నిటినీ నిర్వహించాలి. డిజిటల్‌ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. నైపుణ్యంగా ఉపయోగించుకోవాలి.
రాన్ను రోజుల్లో మహమ్మారి తెచ్చే రాజకీయ మార్పులను కూడా మనం గమనించాలి. బిజెపి ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకుని తన రాజకీయ పట్టును మరింత పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాలను చూస్తే, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉంది. ఆ పార్టీలో అంతర్గత కలహాలను, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌లో బిజెపి ఎలా ఉపయోగించుకున్నదో చూశాం. కాశ్మీర్‌ వంటి అనేక సమస్యలపై కాంగ్రెస్‌ ఒక నిర్ధిష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నది. చివరికి రామ్‌ మందిరం విషయంలో కూడా అంతే. మేము కూడా రామమందిర నిర్మాణంలో భాగస్వాములమే అని ఆ పార్టీ చెప్పుకుంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాల వారీగా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా, ఆయా రాష్ట్రాల్లో పాలక పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, బిజెపితో జతకట్టిన పార్టీలకూ వ్యతిరేకంగా ఎవరిని సమీకరించగలమో పరిశీలించాలి. విస్తృత ప్రాతిపదికపై సమస్యలపై మనతో కలిసి వచ్చేవారిని ఒకే వేదికమీదకు సమీకరించాలి. విభిన్న సమస్యలపై మనం విభిన్న శక్తులను సమీకరించే ప్రయత్నం చేయాలి. మనం ఐక్య ఉద్యమాలనూ, విస్తృత పోరాటాలనూ నిర్మించగలిగినప్పుడు మాత్రమే ప్రతిపక్షాల్లో మనం కొంత బలాన్ని, నమ్మకాన్ని కలిగించగలం. హిందుత్వ మతతత్వవాదం,నయా-ఉదారవాదాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడేవాళ్లం మనమే గనుక మనం ఈ శక్తులన్నిటినీ ఒక చోటకు సమీకరించడానికి ప్రయత్నించాలి. మొదట మనం స్వతంత్ర పని ద్వారా స్వతంత్ర బలాన్ని పెంచుకోవాలి, అన్ని శక్తులను సమీకరించడానికి ప్రయత్నించాలి. మనం ప్రజారోగ్యం, ప్రజల విద్యకు సంబంధించిన సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రజలు ప్రజారోగ్య వ్యవస్థ ఆవశ్యకతను గుర్తిస్తారు. అందువల్ల ఇప్పుడు మనం ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాల మీద, గ్రామ స్థాయిలో, బ్లాకు, తాలూకా స్థాయిలో ఉన్న సదుపాయాలను మెరుగుపరిచే విషయం మీద ఆందోళనలు చేయాలి. తాలూకా స్థాయి అసుపత్రులు, జిల్లా స్థాయి ఆసుపత్రులు మెరుగుపరచాలని, మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వైద్యులను, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని ఆందోళనలు చేపట్టాలి.
మనం ఏ రకమైన ఆందోళనలు చేపట్టినా ప్రజలతో మన సంబంధాలను పెంచుకోవాలి. ఈ కష్ట కాలంలో ప్రజలతో ఉండాలి.
మనం కరోనా మహమ్మారి తరువాతి రోజులకు సిద్ధం కావాలి. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలనుండి వెనక్కు రాదు. ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడి చేస్తున్న వారు తరువాత కూడా దాన్ని కొనసాగిస్తారు. ప్రజలపై అనేక భారాలు వేస్తారు. ఆ పనిచేయకుండా ఆగరు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. వీటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మనం పెద్ద పోరాటాలు చేయలేకపోవచ్చు. కానీ నిరంతరం రాజకీయంగా, నిర్మాణ పరంగా సిద్ధమై ఉంటే, ఇతర పార్టీల మాదిరిగా కాకుండా మహమ్మారి తరువాత మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ల గలుగుతాము. మన స్వతంత్ర కృషి, వామపక్షాలతో కలిసి చేసే పోరాటాలూ ఇతర లౌకిక, ప్రజాతంత్ర శక్తులను సమీకరించగలగాలి. రాన్ను రోజుల్లో ఈ కర్తవ్యాలను పూరిస్తారని నేను భావిస్తున్నాను. మన కామ్రేడ్స్‌ అంతా ఈ మహమ్మారి కాలంలో తగిన జాగ్రత్తలుతీసుకుంటారని భావిస్తున్నాను. ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలతో సంబంధాలను పెట్టుకోడానికీ, కొనసాగించ డానికీ మార్గాలు వెదుకుతారని భావిస్తున్నాను.
చివరిగా చెప్పేదేమంటే, ప్రస్తుతం ఈ భూగోళం మీద కరోనా మహమ్మారి వివిధ శక్తుల మధ్య ఇప్పటికే ఉన్న ఘర్షణలను, వైరుధ్యాలను తీవ్రతరం చేస్తున్నది. ప్రస్తుతం మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ రానున్న పరిస్థితి మనకు అనేక అవకాశాలను, కొత్త అవకాశాలను కల్పి స్తుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమం పెద్ద అంగలతో ముందుకు పురోగమించగలుగుతుంది.

- ప్రకాశ్‌ కరత్‌

షేర్‌ మార్కెట్‌లో వింతలు

 షేర్‌ మార్కెట్లలో 'తెలివిగా' పెట్టుబడులు పెట్టి తేలికగా లాభాలు సంపాదించుకోవచ్చుననే 'ఆశాజీవులు' మధ్య తరగతిలో చాలామంది ఉన్నారు. ఈ లేఖ వారి కోసం మాత్రమే కాదు. ప్రస్తుత కార్పొరేట్‌ ప్రపంచపు డొల్లతనం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారి కోసం కూడా -ఎడిటర్‌

షేర్‌ మార్కెట్‌ లోకి 2020వ సంవత్సరంలో కొత్తగా అడుగు పెట్టదలుచుకున్న ప్రియమైన పెట్టుబడిదారులారా....
ప్రస్తుతం షేర్‌ మార్కెట్‌లో జరుగుతున్న వింతలు చూస్తుంటే ఏం చెప్పాలో తోచడంలేదు. మీ పెట్టుబడి ప్రయాణాన్ని విజయవంతంగా ముందకు సాగిస్తారా... లేక సర్దుకుని వెనక్కి వెళ్లిపోతారా అనేది ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే ఆధారపడి ఉంటుంది. వింతలు జరుగుతున్నాయని అన్నాను కదా. అలా అనడానికి చాలా కారణాలే ఉన్నాయి.
స్టాక్‌ మార్కెట్‌ సూచికలు నూతన గరిష్ట స్థాయికి చేరుతూ ఉంటే జిడిపి లెక్కలు దశాబ్దాల కనిష్టానికి పడి పోవడం వింతే కదూ! రుణాలపై వడ్డీ రేట్లు అత్యంత తక్కువ స్థాయికి పడిపోయినప్పటికీ, అప్పుల కోసం వచ్చేవారు పెరగకపోవడం అసాధారణమే కదా! మార్చితో పోల్చుకుంటే నిఫ్టీ 50 శాతం తగ్గినప్పటికీ జూన్‌తో అంతమయ్యే త్రైమాసిక ఆదాయం ఏడాది క్రితంతో పోల్చినప్పుడు సగానికన్నా ఎక్కువ తగ్గడం వింతే. కాదంటారా? కష్టపడి దాచుకున్న మొత్తాలు ఖర్చయిపోతాయన్న భయంతో దాదాపుగా అందరూ సరుకులను కొనేందుకు ఆసక్తి చూపని సమయమిది. డిమాండ్‌ తగ్గిపోయినా వినిమయ ధరల పెరగుదల 6.9 శాతపు అత్యంత గరిష్టానికి చేరడం అసహజం కాదా!
కోవిడ్‌ కష్టకాలంలో రేపు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ సంపదను సృష్టించడానికి కొత్త బ్రోకరేజి ఖాతాలు పెద్దఎత్తున ప్రారంభం కావడం, బ్రోకరేజి కూడా అనూహ్యంగా పెరగడం హాశ్చర్యమే కదా!
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు 6 శాతానికన్నా తక్కువకు పడిపోతున్న సమయంలోనే గూగుల్‌ న్యూస్‌ఫీడ్‌లో '10.53 శాతం వరకు ఆదాయం పొందండి..ఫలానా కంపెనీ అత్యధిక లాభాలనిస్తుంది' అంటూ వార్తలు, ప్రకటనలు కనిపించడం వింతే కదా!
ఇటువంటి అనూహ్యమైన విషయాలను మరెన్నో చెప్పుకోవచ్చు, కానీ, ప్రసుత సమయం అంత అసాధారణంగా ఎందుకు మారిందో పరిశీలిస్తాం.
దురాశా...భయమా!
మార్కెట్లు ఆదాయాన్ని వృద్ధి చేస్తాయన్న సంగతి మీకు తెలుసు. భవిష్యత్తు సక్రమంగా దర్శిస్తే సంవత్సరాల తరబడి అవి వృద్ధి బాటనే ప్రయాణం చేయవచ్చు. అనూహ్య లాభాలనూ ఇవ్వవచ్చు. కానీ, వర్తమానం గందరగోళంగా ఉండి, ముందుకు వెళ్లే దారి స్పష్టంగా కనిపించనప్పుడు కూడా, ఆర్భాటపు లాభాల అంచనాలను ప్రదర్శించడం మార్కెట్‌ మానుకోలేదా?
ఆదాయాలు సహేతుకంగా కనిపించనప్పుడు, మీరు సందేహించడం, భయపడటం నేర్చుకోవాలి. ఇప్పటికే మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం.
మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకునేలా ఊరించే స్థాయికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించి ఉండవచ్చు. కానీ, చేస్తున్న ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, చేతికి అందుతున్న జీతం అంతే మొత్తంలో ప్రతి నెలా వస్తుందో రాదో తెలియని ప్రస్తుత స్థితిలో మీరు ఇంటిని కొనగలరా? కంపెనీల పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం వున్నదే మూత పడకుండా చూడటం కష్టంగా మారిన నేపథ్యంలో కొత్త ప్లాంట్లను నిర్మించడానికిగానీ, కొనడానికి గానీ ఏ కంపెనీ ఆసక్తి చూపుతుంది? కాబట్టి వడ్డ్డీరేట్లు తగ్గించడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. భవిష్యత్‌ వృద్ధి దృశ్యం అస్పష్టంగా ఉండటానికి ఇదో కారణం. రిలయన్స్‌ ఇండిస్టీస్‌...ఏకైక కంపెనీ! జియా ప్లాట్‌ఫామ్‌లపై జరిగిన వరుస ఒప్పందాలతో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సంజీవనిలా కనిపించి, నిఫ్టీలో ఆశలు రేకెత్తించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మండు వేసవిలో ఒక చుక్క నీరు దాహార్తిని ఎలా తీరుస్తుంది? మిగిలిన కార్పొరేట్‌ ప్రపంచం సంగతేంటి? వాటికి మూలధనమూ లేదు. రుణాలూ అందడం లేదు. చిన్న కంపెనీలు మునిగిపోకుండా ఉండటానికి తమ నిల్వలను వెలికితీసి ఖర్చు చేయాల్సిన స్థితి. ఇలా కొట్టుమిట్టాడుతున్న కార్పొరేట్‌ ప్రపంచమే నిజమైన ఆర్థిక వ్యవస్థను ప్రతిఫలిస్తోంది. ఈ కారణం చేతనే మీ జిడిపి వృద్ధి దశాబ్దాల కనిష్టానికి చేరుకుంది.
రిటైల్‌ రద్దీ
మార్కెట్‌లో అడుగు పెట్టిన నాలుగు నెలల్లోనే చిన్న-మిడ్‌కాప్‌ స్టాక్‌ల నుండి 50 నుండి 100 శాతం ఆదాయం వస్తే స్టాక్‌ మార్కెట్‌ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని మీరు అనుకుంటే తప్పేమీ కాదు. అలా అనుకోవడం సహజం కూడా! కానీ, మార్కెట్‌కు కొత్త కాబట్టి దీర్ఘకాలంలో అవి పెట్టిన బాధ గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. రెండు పూర్తి సంవత్సరాల కాలం 2018, 2019 లలో 40 నుండి 60 శాతం పతనమై, ఇప్పటికీ 2017 నాటి స్థాయికి చేరుకోకపోతే పెట్టుబడి పెట్టినవారికి ఎంత నష్టం వస్తుందో మీకు అర్ధం కాకపోవచ్చు. ఆ స్థితి అనేక కంపెనీలను పాతాళానికి పడేసింది. ఎంతగా అంటే దివాలా తీసిన ఆ షేర్‌లను అమ్మకానికి పెట్టడానికి కూడా వారి వద్ద నగదు లేదు!
మీరే కాదు...అనేక మంది రిటైల్‌ పెట్టుబడిదారులు ఈక్విటీల కొనుగోలు కోసం బారులు తీరిన సమయమిది. రిటైల్‌ విభాగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కొనుగోళ్ల గురించే ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో మాట్లాడుకుంటున్నారు. రిటైల్‌లో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడింది? చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఈ రంగంలో పెద్దన్నలుగా పిలవబడే దేశీయ వ్యవస్థాగత సంస్థలు గడిచిన రెండు, మూడు నెలలుగా తమ స్టాక్‌ను తెగనమ్ముతున్నాయి. వారికి కూడా తెలియని విషయం ఏమిటంటే డైనమిక్‌ ఈక్విటీ ఫండ్స్‌ కలిగి ఉన్న అనేకమంది కూడా తమ షేర్లను ఈ కాలంలోనే వదిలించుకుంటున్నారు. బ్రోకరేజి రుసుం చెల్లించడానికి దీర్ఘకాలిక స్టాక్‌లను అప్పుగా ఇవ్వాలని అడగడం సురక్షితమైనదేనా అని ఇటీవల ఒకరు ప్రశ్నించారు. మార్కెట్‌లో భయం అనే పదానికి అర్ధం లేదని ఇది తెలియచేస్తోంది. కానీ, ఇది మంచిది కాదు!
ఇది కేవలం ఈక్విటీ మార్కెట్ల కథ మాత్రమే కాదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ ఇవ్వడమే బ్యాంకులకు కష్టంగా మారిన సమయంలోనే బ్యాంకింగ్‌ ఏతర సంస్థలు 10.5 శాతం ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తామని ఎలా చెబుతున్నాయి? తక్కువ ప్రతిఫలాలు వస్తున్న సమయంలో ఇలా అధిక రేట్లకు ఆకర్షితులు కావడం రిస్క్‌ అని ఎక్కువకాలం మార్కెట్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నవారికి అర్ధమవుతుంది. కానీ, కొత్తగా వచ్చిన వారికి ఇది డబ్బు సంపాదనకు మంచి అవకాశంగా మాత్రమే కనపడుతుంది.
కొత్త మిత్రులారా...! మీరు అసాధారణమైన 2020వ సంవత్సరాన్ని చూస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న పరిణామాలను సరైన క్రమంలో విశ్లేషించుకుని, అర్ధం చేసుకోకపోతే భవిష్యత్తులో ఆడాల్సిన ఆటలోనూ తప్పటడుగులు వేసే ప్రమాదమే ఎక్కువ. క్లుప్తంగా చెప్పాలంటే 2020లో చూసే దాని ఆధారంగా పెట్టుబడి మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించలేరు. 2020లో నేర్చుకోబోయే దాని ద్వారానే సంపాదన కోసం చేసే ప్రయాణంలో ముందుకు సాగగలరు.
                                             * విద్యా బాల ( 'ది హిందూ' సౌజన్యంతో )

Sunday, August 30, 2020

విద్వేష రాజకీయాలతో ఫేస్ బుక్ లాలూచీ

 

బిజెపికి, ఫేస్‌బుక్‌కి నడుమ ఉన్న లోపాయకారీ లాలూచీ కాస్తా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో బట్టబయలైంది. భారతదేశంలో కొందరు బిజెపి నేతలు ఫేస్‌బుక్‌ ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారాలకు పాల్పడినా, వారిపైగాని, ఆ పోస్టింగులపై గాని ఎటువంటి చర్యా తీసుకోరాదంటూ ఫేస్‌బుక్‌ భారతదేశ ప్రతినిధి అంఖిదాస్‌ అడ్డుపడ్డారంటూ 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' ఆ వివరాలను బైటపెట్టింది. బిజెపి నేతలు పెట్టిన పోస్టింగులు 'ప్రమాదకరం' అని, 'విద్వేషపూరితం' అని, అవి హింసకు దారితీస్తాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు ఎత్తిచూపినా, ఈ దేశంలో ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న కారణాన్ని చూపి అంఖిదాస్‌ ఆ పోస్టింగులపై ఎటువంటి చర్యా తీసుకోకుండా చూశారని ఆ పత్రిక తన కథనంలో బైటపెట్టింది. ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువమంది ఫేస్‌బుక్‌ వాడకందార్లు భారతదేశంలోనే ఉన్నారు. పైగా, ఫేస్‌బుక్‌ ఇటీవలే రిలయన్స్‌ జియోలో రూ.40,000కోట్లకుపైనే పెట్టుబడులుపెట్టింది.


కొన్ని రాజకీయ పార్టీలతో, నాయకులతో చేతులు కలిపి వారి ప్రతిపక్షాల గొంతులు వినబడకుండా చేయడానికి ఫేస్‌బుక్‌ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే ట్రోల్స్‌తో కలిసి తీవ్రమైన భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రచారం చేసిందని డిసెంబరు 2017లోనే 'బ్లూమ్‌బెర్గ్‌' అనే పత్రిక ఫేస్‌బుక్‌ గురించి రాసింది.  ఫేస్‌బుక్‌ కు చెందిన కేటీ హార్‌బాత్‌ నాయకత్వంలో ఒక గ్లోబల్‌ ప్రభుత్వమే నడుస్తోందని, దాని రాజకీయ బృందం ఇండియా, బ్రెజిల్‌, జర్మనీ, బ్రిటన్‌ తదితర పెద్ద పెద్ద దేశాలలోని కొన్ని రాజకీయ పార్టీలకు సహాయపడుతూ ఉంటుందని, ఫేస్‌బుక్‌ ఉద్యోగులే ఒక విధంగా ఆయా పార్టీలకు ప్రచార కార్యకర్తలుగా పని చేస్తుంటారని 'బ్లూమ్‌బెర్గ్‌' రాసింది.


ఫేస్‌బుక్‌కు అతి ఎక్కువమంది వినియోగదారులు భారతదేశంలోనే ఉన్నారు. అంతే కాక, అతి ఎక్కువ వాట్సప్‌ వాడకందారులు కూడా వీరే. 2018లో ఫేస్‌బుక్‌ ఈ వాట్సప్‌ను దాదాపు రు.1,50,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వాట్సప్‌ ను నిర్వహించే విధానం చాలా అస్పష్టంగా, ఫేస్‌బుక్‌ కన్నా ఎక్కువ అస్పష్టంగా ఉంటుంది. బిజెపి కి, ఆ పార్టీకి చెందిన 'ట్రోల్‌' సైన్యానికి ప్రధాన వేదికగా ఈ వాట్సప్‌ ఉంది. ముస్లిములే కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకులన్న ప్రచారాన్ని, లవ్‌ జిహాద్‌ ప్రచారాన్ని, అదే తరహాలో ఇతర విద్వేష ప్రచారాలను ఫేస్‌బుక్‌లో చేసిన బిజెపి నాయకులెవరిపైనా ఫేస్‌బుక్‌ ఏ చర్యా తీసుకోలేదు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ఈ వివరాలను తెలిపింది.


ప్రజలందరికీ ఒక సమాచార సాధనంగా ఉపయోగపడే ఫేస్‌బుక్‌ నిర్వహణ బాధ్యతలను అంఖిదాస్‌ వంటి వ్యక్తులకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ లేవనెత్తింది. ఈ సందర్భంగా భారతీయ ముస్లింలు ఒక దిగజారిన సమూహం అన్న ఒక పోస్టును అంఖిదాస్‌ తన స్వంత పేజీలో పోస్టు చేసిన వైనాన్ని ఆ పత్రిక ఉదహరిం చింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వ్యాసాన్ని బట్టి ఫేస్‌బుక్‌లో ఈ తేడా అంతటికీ అంఖిదాస్‌ అనే ఒక వ్యక్తి కారణం అన్న అభిప్రాయం కలుగుతుంది. కాని అసలు సమస్యకి మూలం ఇంకా లోతైనది.

 

గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి డిజిటల్‌ గుత్త సంస్థలు వాటి ఆర్థిక బలానికి మించి ఇంకా ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నాయి. పెట్టుబడిదారీ సమాజంలో మీడియాను బతికించి వుంచేది యాడ్స్‌ ఆదాయం అన్న సంగతి అందరికీ తెలుసు. ప్రజలను ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఎంత ఉందో అదీ తెలుసు. ఎంత ఎక్కువమంది పాఠకులు లేదా వీక్షకులు ఉంటే యాడ్స్‌ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ డిజిటల్‌ మీడియా యాడ్స్‌ ఆదాయంలో ప్రధాన భాగాన్ని చేజిక్కించుకుంటోంది. వారి ఆదాయం ఇంకా ఎక్కువగా పెరగాలంటే వీక్షకులు పెరగాలి, వారు చూసే సమయమూ పెరగాలి. ఇదెలా జరుగుతుంది? కపిల్‌ మిశ్రా ఢిల్లీలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించిన వారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టాక, నిరసనకారులు ఖాళీ చేయకుంటే వారిపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టాక, వాటిని వీక్షించిన వారి సంఖ్య పది రెట్లు పెరిగింది. కనుక ఈ తరహా పోస్టులను అనుమతిస్తే ఫేస్‌బుక్‌ యాడ్‌ ఆదాయం పెరుగుతుందన్నమాట!


మీడియాకి ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల కోసం దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 
ఈ విషయంలో ప్రెస్‌ కౌన్సిల్‌ కి ఒక నియమావళి ఉంది. పెయిడ్‌ న్యూస్‌ లతో దానిని ఉల్లంఘించినప్పుడు ఒక కమిటీ వేసి చక్కదిద్దే ప్రయత్నం పరిమితంగానైనా జరిగింది. అమెరికాలో ఒక తరహా మీడియా సంస్థ మరో తరహా సంస్థలో వాటాలు కలిగివుండకూడదన్న ఆంక్షలు ఉన్నాయి (ప్రింట్‌ మీడియా సంస్థకు టి.వి చానెళ్ళ లో వాటాలు ఉండకూడదు వంటి నిబంధనలు). అలాగే టెలికాం కంపెనీలకు మీడియా కంపెనీల్లో వాటాలు వుండకూడదు.


ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. మీడియా వ్యాపారం ఇతర వ్యాపారాల వంటిది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయగలదు. ఇక ప్రజాస్వామ్యానికి అన్నింటికన్నా పెద్ద ప్రమాదం గుత్త సంస్థల నుండే వస్తుందన్నది రెండో విషయం. 'మనకి ప్రజాస్వామ్యమైనా ఉంటుంది, లేదా కొద్దిమంది చేతుల్లో సంపదను కేంద్రీకరించే గుత్త సంస్థలైనా ఉంటాయి. కాని రెండూ ఏక కాలంలో ఉండవు' అని అమెరికన్‌ న్యాయమూర్తి బ్రాండీస్‌ ''స్టాండర్డ్‌ ఆయిల్‌'' గుత్త సంస్థ ఆధిపత్యాన్ని సవాలు చేసిన కేసులో విచారణ సందర్భంగా అన్నారు.


మళ్ళీ చాలా కాలం తర్వాత అమెరికన్‌ పార్లమెంటు లో ఈ గుత్తాధిపత్యం విషయం ఈ మధ్య చర్చకు వచ్చింది. ఆ పార్లమెంటరీ కమిటీల ముందు గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌ సంస్థలు విచారణకు హాజరయ్యాయి. ఈ నాలుగు సంస్థల షేర్ల మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్లు దాటి వుంది (అంటే రూ.300 లక్షల కోట్లు). ఇది జర్మనీ దేశపు జిడిపి కన్నా ఎక్కువ. అంటే, అమెరికా, చైనా, జపాన్‌ దేశాల తర్వాత బలమైన ఆర్థిక శక్తి ఈ నాలుగు సంస్థలే. ఈ శక్తితోటే అవి బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలను లంగదీయడం, బెదిరించడం, వాటి చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడం వంటివి చేయగలుగుతున్నాయి. సమాజ హితానికి, కంపెనీల స్వంత లాభాలకు మధ్య ఎంచుకోవలసి వస్తే ఆ కంపెనీలు సమాజ హితానికి పెద్దపీట వేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు.

 

ఫేస్‌బుక్‌ ఆదాయంలో 98.5 శాతం యాడ్స్‌ నుంచే వస్తుంది. యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం వీక్షకుల సంఖ్య పైన, వారు వీక్షించే సమయం పైన ఆధారపడి వుంటుంది. ఒక పోస్టు ఎంత వైరల్‌ అయితే ఫేస్‌బుక్‌ కి అంత లాభం. అందువలన అటువంటి వైరల్‌ అయ్యే పోస్టులను నిషేధించాలనో, నియంత్రించాలనో ఫేస్‌బుక్‌ కోరుకోదు. పైకి సమాజంలో సామరస్య వాతావరణం ఉండాలని, ఆరోగ్య కరంగా చర్చలు జరగాలని ఎంత చెప్పినా, ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా వైరల్‌ అయ్యే పోస్టులతోనే ముడిపడి వున్నాయి. ఈ జబ్బు ఒక ఫేస్‌బుక్‌ కే పరిమితం అయిలేదు. గూగుల్‌కి కూడా దాని యూట్యూబ్‌ వీడియోలతో ఇటువంటి ప్రయోజనాలే ఉన్నాయి. అయితే, ఫేస్‌బుక్‌ మాత్రం నిస్సందేహంగా విద్వేష రాజకీయాలను, ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేయడంలో అందరికన్నా ముందుంది.


ట్రంప్‌, బోల్సనారో, మోడీ  ఈ ముగ్గురికీ మితవాద రాజకీయాలు ఉమ్మడి అంశం. వాటితోబాటు తమ ప్రచారంలో వాట్సప్‌ పైన, ఫేస్‌బుక్‌ పైన ఎక్కువగా ఆధారపడడం ఈ ముగ్గురికీ ఉన్న మరో ఉమ్మడి అంశం. టి.వి చానెళ్ళలో ఫ్యాక్స్‌ న్యూస్‌ (అమెరికా), రిపబ్లిక్‌ టి.వి (ఇండియా) వంటివి ఏ విధంగా ఇతర పార్టీల వారిని మాట్లాడనివ్వకుండా ఒక పార్టీ తరఫునే వకాల్తా పుచ్చుకుని పని చేస్తాయో చూస్తున్నాం. అయితే ఆ సంగతి అందరికీ బోధపడిన విషయమే. కాని ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అలా కాదు. తమ పాత్ర ఏమీ లేనట్టే ఉంటూనే ఎన్నికలలో విద్వేష రాజకీయాలను, ఫేక్‌ న్యూస్‌ ను బాగా ప్రచారం లోకి తీసుకువస్తాయి. బిజెపి, ఇతర మితవాద శక్తులు సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడంలో, వాటి ప్రయోజనాన్ని అర్ధం చేసుకోవడంలో తక్కిన వారందరికన్నా ముందున్నాయని చాలామంది అనుకుంటారు. అందువల్లనే ఆ శక్తులు విజయాలు సాధించగలుగుతున్నాయని అనుకుంటారు. కాని ఫేస్‌బుక్‌ ఈ మితవాద శక్తులకు తోడ్పాటునివ్వడం యాదృచ్ఛికం కాదని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే అలా చేస్తోందని వారు తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పుడు స్పష్టంగా బైటకు వస్తున్నాయి కూడా.


విద్వేష ప్రసంగాలు, పోస్టులు సోషల్‌ మీడియాలో చొరబడిన పురుగులని, వాటిని ఏరిపారేయాలని అనుకుంటూ వచ్చారు. కాని అవి సోషల్‌ మీడియాకు అత్యంత అవశ్యమైన అంతర్భాగం అని గ్రహించాలి. అందుచేత చాలా మర్యాదగా జుకర్‌బర్గ్‌కు, ఇతర డిజిటల్‌ గుత్త సంస్థల అధిపతులకు పిటిషన్లు పెడితే ఏమీ ఉపయోగం లేదు. వాటి గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టి వాటిని ప్రజాప్రయోజనాల కోసం పని చేసే సర్వీసులుగా మార్చడమే నిజమైన పరిష్కారం.

రచయిత: ప్రబీర్‌ పురకాయస్థ; ప్రచురణ: ప్రజాశక్తి 29.8.2020 సంచిక 


ప్రబీర్‌ పురకాయస్థ 

 

Friday, August 28, 2020

కరోనా వైరస్ సమస్య- అసెంబ్లీ ల ఎన్నికలు- ఎన్నికల ప్రచారం


బీహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు కరోనా వైరస్ సమస్యని దృష్టిలో వుంచుకుని అసెంబ్లీ ఎన్నికలను ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించాలని అన్నారు. ఈ సూచనను అత్యధిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. చాలా మంది వోటర్లు డిజిటల్ టెక్నాలజీని వినియోగించటం తెలియనందున రహస్యముగా ఓటు వేసే  అవకాశాన్ని కోల్పోతారు. ఇంతేగాక ఎన్నికల ప్రచారానికి కూడా డిజిటల్ ప్రచారమే వినియోగించాలని సూచించారు. ఇది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమయినదే. డిజిటల్ (స్మార్ట్ ఫోన్) సౌకర్యం లేని వోటర్లకు ఈ ప్రచారం చేరదు.  ధన బలం వున్న రాజకీయ పార్టీలు సోషల్ మీడియా, టెలివిజన్, తదితర అనేక డిజిటల్ టెక్నాలజిల సహకారముతో విరివిగా తమ ఎన్నికల ప్రచారం చేసుకోగలుగుతాయి. ధనబలం లేని పార్టీలకు ఈ అవకాశం తక్కువగా వుంటుంది.

  2019 సార్వత్రిక ఎన్నికల సందర్భముగా ఆనాటి బి జె పి అధ్యక్షులు అమిత్ షా,  తమకి గల  32 లక్షల వాట్సప్  గ్రూప్ ల ద్వారా మెసేజిలు అవి ఒప్పయినా, తప్పయినా కొద్ది గంటలలోనే దేశ వ్యాపితముగా విస్తారముగా (వైరల్) ప్రచారం చేయగలిగే సామర్థ్యం తమకి  వున్నదని అన్నారు.  సోషల్ మీడియా లో జరిగే ప్రచారం తప్పో ఒప్పే చెప్పే అంతర్జాతీయ వెబ్ సైట్స్ ప్రకారం ప్రపంచం మొత్తం లో తప్పుడు వార్తలలో అత్యధికం భారత దేశం లో ఆవిర్భవించినవేనని తేల్చి చెప్పాయి.

ఇప్పుడు బీహార్ ఎన్నికలు త్వరలో జరగ బోతున్నందున బి జె పి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ నాయకుడు అమిత్ షా (కేంద్ర హోమ్ శాఖా మంత్రి) ఆన్ లైన్ ఎన్నికల సభ నిర్వహించారు. ఇందుకోసం 72000 ఎల్ఈ డి టి వి  మానిటర్లు ఏర్పాటు చేశారు.   60 వర్చువల్ ర్యాలీలను నిర్వహించిన  అనంతరం బి జె పి, తాము ఎన్నికల ప్రచారం లో 9500 ఐ టి సెల్సు కు ప్రత్యేక బాధ్యులను ఏర్పాటు చేశామని, వీరు ప్రతి పోలింగ్ బూత్  కు ఒక గ్రూప్ చొప్పున 72000 వాట్సప్  గ్రూప్ లను కొ ఆర్డినేట్ చేస్తారని అన్నది. ఇప్పటికే గత 2 నెలలలో 50,000 గ్రూప్ లను ఏర్పాటు చేశామని అన్నది.

ఈ స్థాయిలో డిజిటల్ ప్రచారానికి అవసరమైన సిబ్బందికి, మరియు టెక్నాలజీ కి అయ్యే భారీ ఖర్చును ఎవరు భరిస్తారు? కార్పొరేట్ల నుండి ఈ నిధులొస్తున్నాయి. ఎవరిచ్చారో చెప్పాల్సిన అవసరం లేని అనామక ఎన్నికల బాండ్స్ విధానాన్ని బి జె పి ప్రభుత్వము ప్రవేశ పెట్టినది. ఇందు కోసం ఫైనాన్స్ చట్టం 2017 ను, ఆదాయపు పన్ను చట్టాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది.  ఈ బాండ్స్ ద్వారా ఇతర రాజకీయ పార్టీలకు కొన్ని నిధులు సమ కూరినా వాటన్నింటికి వచ్చిన నిధులను  కలపగా వచ్చే మొత్తం కన్నా అనేక రెట్లు ఎక్కువగా బి జె పి కి ఈ పద్ధతిలో ఎన్నికల నిధులు లభిస్తున్నాయి. కార్పొరేట్ నిధులు అనామికముగా, అపరిమితముగా ఒక రాజకీయ పార్టీ కి ఇచ్చే వీలు కలిగించిన ఈ విధానం వలన ఎన్నికల ప్రజాస్వామ్యానికి మృత్యు ఘంటిక  మోగినట్లయింది. తమకి నచ్చిన రాజకీయ పార్టీకి ఎన్నికల నిధులు భారీ స్థాయిలో సమకూర్చి తమకి నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించుకునేందుకు, తమకి నచ్చిన విధానాలే అవి అమలు చేసేలా చేసేందుకు ఈ ఎన్నికల బాండ్స్ విధానం కార్పొరేట్సుకు ఉపయోగ పడుతుంది.   ఈ విధముగా బిజెపి, ఎన్నికల ప్రజాస్వామికానికి తిలోదకాలిచ్చే విధానాలను తీసుకొచ్చింది. కాబట్టి మన దేశం లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఎన్నికల బాండ్స్ విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల బాండ్స్ వలన రాజకీయ పార్టీలకు ఇచ్చే ఫండ్స్ విషయం లో పారదర్శకత లోపిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు చెప్పినది. ఇంతేగాక భారత కంపెనీలలో మెజారిటీ వాటాలున్న విదేశీ కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ పార్టీలకు  ఎన్నికల నిధులిచ్చే అవకాశం ఏర్పడినదని, ఇందువలన విదేశీ కంపెనీలు మన దేశ విధానాలను ప్రభావితం చేసే అవకాశం వుంటుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు సమర్పించిన ఎఫిడవిట్ లో చెప్పింది.

2019 లోక్ సభ ఎన్నికల సందర్భముగా “నమో టీవి” అనేది రూల్సుకు విరుద్ధముగా మార్మికముగా వచ్చింది. ఎన్నికలయిన తరువాత అంతర్ధానమయింది. ఎన్నికల సంఘం ప్రతినిధి ఈ డిటిహెచ్ చానల్ కు అయిన ఖర్చులను  బి జె పి భరించినదని అన్నారు. కానీ ఎన్నికల ఖర్చుకు సంబధించి ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల లో  ఈ చానల్ ఖర్చును బిజెపి చూపించ లేదని తెలిసింది. ఎన్నికల నియమావళికి సంబంధించి ఇది తీవ్రమైన ఉల్లంఘన. కాబట్టి బి జె పి పై ఎన్నికల సంఘం తగు చర్యను తీసుకోవాల్సిన అవసరం వున్నది.  ఒక బి జె పి నాయకునికి చెందిన ఎడ్వర్టైజింగ్ మరియు సోషల్ మీడియా కంపెనీకి ఎలక్షన్ కమిషన్ తరఫున ఎన్నికల ప్రక్రియ కి సంబంధించిన విషయాలపై  ఆన్ లైన్ ప్రచారం చేసే బాధ్యతని 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భముగా  మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అప్పగించినట్లు తెలుస్తున్నది.  ఇంతే గాక 2019 లోక్ సభ ఎన్నికల సందర్భములో కూడా ఎన్నికల సంఘం తరఫున చేసే ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతని ఇదే మీడియా కంపెనీకి అప్పగించ వచ్చునని సంబంధిత ప్రభుత్వ సంస్థలకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా,  అధికారమిచ్చినట్లు తెలిసింది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను  సమంజసమైన పద్ధతిలో నిర్వహించటమే గాక అలా నిర్వహించినట్లు కనిపించే విధముగా ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం వున్నది.

(ఇందులో వున్న అంశాలను  సిపి ఏం పార్టీ ప్రధాన  కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి గారు 18.8.2020 న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కు రాసిన లేఖ నుండి తీసుకోటం జరిరిగినది) 

Thursday, August 27, 2020

రైతు వెన్నెముక విరిచే ఆర్డినెన్సులు

 


కేంద్ర ప్రభుత్వం జూన్‌ 5న తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులు రైతు వెన్ను విరిచేస్తాయి. మన వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పండిన పంటను రెగ్యులేటెడ్‌ వ్యవసాయ మార్కెట్‌లో కాక ఎక్కడైనా అమ్ముకోవచ్చునని తెచ్చిన ఆర్డినెన్సుతో కేంద్ర ప్రభుత్వం రైతుకు మద్దతు ధర చెల్లింపజేసే బాధ్యతకు మంగళం పాడడంతోపాటు వ్యాపారులు మార్కెట్‌ సెస్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే పని లేకుండా చేస్తోంది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేసే రెండో ఆర్డినెన్స్‌ ద్వారా కార్పొరేట్లకు రక్షణ కల్పించనుంది. ఇక నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ ఆర్డినెన్స్‌తో వ్యాపారులు వ్యవసాయోత్పత్తుల ధరలను దిగ్గొయ్యడానికి, వాటిని నల్ల బజారుకు తరలించడానికి మార్గం సుగమం చేస్తుంది.

 

దేశ విదేశీ కార్పొరేట్లకు మేలు చేసేందుకు భారత రైతు వెన్ను విరిచేందుకైనా మోడీ సర్కారు వెనకాడదనిఈ మూడు ఆర్డినెన్సుల జారీతో స్పష్టమయింది. భారత రాజ్యాంగంలో వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి విధానపరమైన మార్పులు చేయాలంటే మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా శాసన సభల ఆమోదం కూడా అవసరం. ఇవేమీ లేకుండానే ఆర్డినెన్సులతో కీలక మార్పులు చేయడం ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం మాత్రమే కాక అత్యంత నిరంకుశ చర్య. ఆగస్టు 20 నుండి 26 వరకు సిపిఎం దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ఛార్టర్‌లో 'మూడు ఆర్డినెన్సుల రద్దు' 6వ డిమాండ్‌గా వుంది.
రైతు పండించిన పంటను స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోనే అమ్ముకోవాలన్న నిబంధన పోయి, దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని బిజెపి పెద్దలు చెబుతున్నారు.

నిజానికి 2015-16 భూ కమతాల సెన్సస్‌ ప్రకారం 86.2 శాతం మందికి రెండు హెక్టార్లకు మించి భూమి లేదు. సన్న చిన్నకారు రైతు దేశంలో ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పంటను ఎలా తీసుకెళ్తాడు? ఎలా అమ్ముకుంటాడు? కాబట్టి అదంతా అసత్య ప్రచారమే! వాస్తవం ఏమిటంటే పంటను మార్కెట్‌ యార్డులో కాకుండా ఎక్కడైనా కొనుక్కోవచ్చు కనుక ప్రైవేటు వ్యాపారులు తమ ఇష్టమొచ్చిన ధరను మాత్రమే చెల్లిస్తారు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కెట్‌ సెస్‌ చెల్లించనక్కరలేదు (ఆర్డినెన్స్‌ క్లాజు6) ఆర్డినెన్స్‌ అసలు బండారం ఇదీ!

 

వ్యవసాయ మార్కెట్లను వ్యాపారుల స్వేచ్ఛకు వదిలేయాలని రెండు దశాబ్దాల క్రితం నుండీ ప్రపంచ బ్యాంకు చెబుతోంది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్‌ మార్కెట్‌ చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపింది కానీ అత్యధిక రాష్ట్రాలు అందుకు పూనుకోలేదు. ఇప్పుడు మోడీ సర్కారు నేరుగా ఆర్డినెన్స్‌ రూట్‌ను ఎంచుకుంది.


కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయడమేగాక కార్పొరేట్ల ఇష్టారాజ్యంగా మార్చి, రైతుల హక్కులు కాలరాసే ఆర్డినెన్సు ఇంకొకటి. కాంట్రాక్టు వివాదం ఏదైనా వస్తే ఆర్‌డిఓ తుది పరిష్కారం చేస్తారని చెప్పడం ద్వారా బలవంతులదే రాజ్యం అని చెప్పకనే చెప్పినట్టయింది. కాంట్రాక్టు, కార్పొరేట్‌ సేద్యం కూడా ప్రపంచ బ్యాంకు విధానాలే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసి రైతులను భ్రష్టు పట్టించిన విషయం చాలామందికి గుర్తుండే వుంటుంది.

నిత్యావసర సరుకుల నిల్వలపై పరిమితులు ఎత్తేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ నల్ల బజారుకు గేట్లెత్తడమేగాక రైతు పంటకు న్యాయమైన ధర కూడా రాకుండా చేయడానికే. 1955 నుండి అమలులోవున్న నిత్యావసర సరుకుల చట్టానికి ఈ సవరణలు చేయడం ద్వారా వ్యాపారులు సరుకులను అపరిమితంగా నిల్వ చేస్తారు. వివిధ పంటలను అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా దొరికేటపుడు కొని, ఇక్కడ స్టాక్‌ చేస్తారు. ఆ వ్యవసాయోత్పత్తులు నిల్వలు కావాల్సినంత వున్నాయని చెప్పి రైతుల నుండి తక్కువ ధరకు కొంటారు. కొంత కాలం తరువాత కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచి వినియోగదారుల్ని దోపిడీ చేస్తారు. ఇప్పుడైతే సరుకు నిల్వకు పరిమితులున్నాయి కనుక అది సాధ్యం కకావడంలేదు. ఇకపై దేశ, విదేశీ వ్యాపారులకు ఇష్టారాజ్యం అవుతుంది. ఈ ఆర్డినెన్స్‌ కూడా డబ్ల్యుటిఒ ఒప్పందాల కొనసాగింపుగానే వచ్చిందని నిపుణులు అంటున్నారు.

రైతులకు, యావత్‌ దేశానికి నష్టదాయకమైన ఈ మూడు ఆర్డినెన్స్‌లను ప్రతిఘటించడం ప్రతి దేశభక్తుని కర్తవ్యం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. విస్తారమైన మార్కెట్‌ వ్యవస్థ కలిగిన పంజాబ్‌లో అక్కడి రైతులు ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం జరిపారు. ఈ ఆర్డినెన్సులను ఉపసంహరించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణ, కేరళ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్డినెన్సులను వ్యతిరేకించాయి కాని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం కిమ్మనలేదు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగినా, ఖజానాకు చిల్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నిరసన తెలియజేయడంతోపాటు ఆర్డినెన్సులను వ్యతిరేకించాలి.