Friday, September 4, 2020

షేర్‌ మార్కెట్‌లో వింతలు

 షేర్‌ మార్కెట్లలో 'తెలివిగా' పెట్టుబడులు పెట్టి తేలికగా లాభాలు సంపాదించుకోవచ్చుననే 'ఆశాజీవులు' మధ్య తరగతిలో చాలామంది ఉన్నారు. ఈ లేఖ వారి కోసం మాత్రమే కాదు. ప్రస్తుత కార్పొరేట్‌ ప్రపంచపు డొల్లతనం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారి కోసం కూడా -ఎడిటర్‌

షేర్‌ మార్కెట్‌ లోకి 2020వ సంవత్సరంలో కొత్తగా అడుగు పెట్టదలుచుకున్న ప్రియమైన పెట్టుబడిదారులారా....
ప్రస్తుతం షేర్‌ మార్కెట్‌లో జరుగుతున్న వింతలు చూస్తుంటే ఏం చెప్పాలో తోచడంలేదు. మీ పెట్టుబడి ప్రయాణాన్ని విజయవంతంగా ముందకు సాగిస్తారా... లేక సర్దుకుని వెనక్కి వెళ్లిపోతారా అనేది ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే ఆధారపడి ఉంటుంది. వింతలు జరుగుతున్నాయని అన్నాను కదా. అలా అనడానికి చాలా కారణాలే ఉన్నాయి.
స్టాక్‌ మార్కెట్‌ సూచికలు నూతన గరిష్ట స్థాయికి చేరుతూ ఉంటే జిడిపి లెక్కలు దశాబ్దాల కనిష్టానికి పడి పోవడం వింతే కదూ! రుణాలపై వడ్డీ రేట్లు అత్యంత తక్కువ స్థాయికి పడిపోయినప్పటికీ, అప్పుల కోసం వచ్చేవారు పెరగకపోవడం అసాధారణమే కదా! మార్చితో పోల్చుకుంటే నిఫ్టీ 50 శాతం తగ్గినప్పటికీ జూన్‌తో అంతమయ్యే త్రైమాసిక ఆదాయం ఏడాది క్రితంతో పోల్చినప్పుడు సగానికన్నా ఎక్కువ తగ్గడం వింతే. కాదంటారా? కష్టపడి దాచుకున్న మొత్తాలు ఖర్చయిపోతాయన్న భయంతో దాదాపుగా అందరూ సరుకులను కొనేందుకు ఆసక్తి చూపని సమయమిది. డిమాండ్‌ తగ్గిపోయినా వినిమయ ధరల పెరగుదల 6.9 శాతపు అత్యంత గరిష్టానికి చేరడం అసహజం కాదా!
కోవిడ్‌ కష్టకాలంలో రేపు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ సంపదను సృష్టించడానికి కొత్త బ్రోకరేజి ఖాతాలు పెద్దఎత్తున ప్రారంభం కావడం, బ్రోకరేజి కూడా అనూహ్యంగా పెరగడం హాశ్చర్యమే కదా!
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు 6 శాతానికన్నా తక్కువకు పడిపోతున్న సమయంలోనే గూగుల్‌ న్యూస్‌ఫీడ్‌లో '10.53 శాతం వరకు ఆదాయం పొందండి..ఫలానా కంపెనీ అత్యధిక లాభాలనిస్తుంది' అంటూ వార్తలు, ప్రకటనలు కనిపించడం వింతే కదా!
ఇటువంటి అనూహ్యమైన విషయాలను మరెన్నో చెప్పుకోవచ్చు, కానీ, ప్రసుత సమయం అంత అసాధారణంగా ఎందుకు మారిందో పరిశీలిస్తాం.
దురాశా...భయమా!
మార్కెట్లు ఆదాయాన్ని వృద్ధి చేస్తాయన్న సంగతి మీకు తెలుసు. భవిష్యత్తు సక్రమంగా దర్శిస్తే సంవత్సరాల తరబడి అవి వృద్ధి బాటనే ప్రయాణం చేయవచ్చు. అనూహ్య లాభాలనూ ఇవ్వవచ్చు. కానీ, వర్తమానం గందరగోళంగా ఉండి, ముందుకు వెళ్లే దారి స్పష్టంగా కనిపించనప్పుడు కూడా, ఆర్భాటపు లాభాల అంచనాలను ప్రదర్శించడం మార్కెట్‌ మానుకోలేదా?
ఆదాయాలు సహేతుకంగా కనిపించనప్పుడు, మీరు సందేహించడం, భయపడటం నేర్చుకోవాలి. ఇప్పటికే మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం.
మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకునేలా ఊరించే స్థాయికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించి ఉండవచ్చు. కానీ, చేస్తున్న ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, చేతికి అందుతున్న జీతం అంతే మొత్తంలో ప్రతి నెలా వస్తుందో రాదో తెలియని ప్రస్తుత స్థితిలో మీరు ఇంటిని కొనగలరా? కంపెనీల పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం వున్నదే మూత పడకుండా చూడటం కష్టంగా మారిన నేపథ్యంలో కొత్త ప్లాంట్లను నిర్మించడానికిగానీ, కొనడానికి గానీ ఏ కంపెనీ ఆసక్తి చూపుతుంది? కాబట్టి వడ్డ్డీరేట్లు తగ్గించడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. భవిష్యత్‌ వృద్ధి దృశ్యం అస్పష్టంగా ఉండటానికి ఇదో కారణం. రిలయన్స్‌ ఇండిస్టీస్‌...ఏకైక కంపెనీ! జియా ప్లాట్‌ఫామ్‌లపై జరిగిన వరుస ఒప్పందాలతో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సంజీవనిలా కనిపించి, నిఫ్టీలో ఆశలు రేకెత్తించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మండు వేసవిలో ఒక చుక్క నీరు దాహార్తిని ఎలా తీరుస్తుంది? మిగిలిన కార్పొరేట్‌ ప్రపంచం సంగతేంటి? వాటికి మూలధనమూ లేదు. రుణాలూ అందడం లేదు. చిన్న కంపెనీలు మునిగిపోకుండా ఉండటానికి తమ నిల్వలను వెలికితీసి ఖర్చు చేయాల్సిన స్థితి. ఇలా కొట్టుమిట్టాడుతున్న కార్పొరేట్‌ ప్రపంచమే నిజమైన ఆర్థిక వ్యవస్థను ప్రతిఫలిస్తోంది. ఈ కారణం చేతనే మీ జిడిపి వృద్ధి దశాబ్దాల కనిష్టానికి చేరుకుంది.
రిటైల్‌ రద్దీ
మార్కెట్‌లో అడుగు పెట్టిన నాలుగు నెలల్లోనే చిన్న-మిడ్‌కాప్‌ స్టాక్‌ల నుండి 50 నుండి 100 శాతం ఆదాయం వస్తే స్టాక్‌ మార్కెట్‌ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని మీరు అనుకుంటే తప్పేమీ కాదు. అలా అనుకోవడం సహజం కూడా! కానీ, మార్కెట్‌కు కొత్త కాబట్టి దీర్ఘకాలంలో అవి పెట్టిన బాధ గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. రెండు పూర్తి సంవత్సరాల కాలం 2018, 2019 లలో 40 నుండి 60 శాతం పతనమై, ఇప్పటికీ 2017 నాటి స్థాయికి చేరుకోకపోతే పెట్టుబడి పెట్టినవారికి ఎంత నష్టం వస్తుందో మీకు అర్ధం కాకపోవచ్చు. ఆ స్థితి అనేక కంపెనీలను పాతాళానికి పడేసింది. ఎంతగా అంటే దివాలా తీసిన ఆ షేర్‌లను అమ్మకానికి పెట్టడానికి కూడా వారి వద్ద నగదు లేదు!
మీరే కాదు...అనేక మంది రిటైల్‌ పెట్టుబడిదారులు ఈక్విటీల కొనుగోలు కోసం బారులు తీరిన సమయమిది. రిటైల్‌ విభాగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కొనుగోళ్ల గురించే ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో మాట్లాడుకుంటున్నారు. రిటైల్‌లో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడింది? చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఈ రంగంలో పెద్దన్నలుగా పిలవబడే దేశీయ వ్యవస్థాగత సంస్థలు గడిచిన రెండు, మూడు నెలలుగా తమ స్టాక్‌ను తెగనమ్ముతున్నాయి. వారికి కూడా తెలియని విషయం ఏమిటంటే డైనమిక్‌ ఈక్విటీ ఫండ్స్‌ కలిగి ఉన్న అనేకమంది కూడా తమ షేర్లను ఈ కాలంలోనే వదిలించుకుంటున్నారు. బ్రోకరేజి రుసుం చెల్లించడానికి దీర్ఘకాలిక స్టాక్‌లను అప్పుగా ఇవ్వాలని అడగడం సురక్షితమైనదేనా అని ఇటీవల ఒకరు ప్రశ్నించారు. మార్కెట్‌లో భయం అనే పదానికి అర్ధం లేదని ఇది తెలియచేస్తోంది. కానీ, ఇది మంచిది కాదు!
ఇది కేవలం ఈక్విటీ మార్కెట్ల కథ మాత్రమే కాదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ ఇవ్వడమే బ్యాంకులకు కష్టంగా మారిన సమయంలోనే బ్యాంకింగ్‌ ఏతర సంస్థలు 10.5 శాతం ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తామని ఎలా చెబుతున్నాయి? తక్కువ ప్రతిఫలాలు వస్తున్న సమయంలో ఇలా అధిక రేట్లకు ఆకర్షితులు కావడం రిస్క్‌ అని ఎక్కువకాలం మార్కెట్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నవారికి అర్ధమవుతుంది. కానీ, కొత్తగా వచ్చిన వారికి ఇది డబ్బు సంపాదనకు మంచి అవకాశంగా మాత్రమే కనపడుతుంది.
కొత్త మిత్రులారా...! మీరు అసాధారణమైన 2020వ సంవత్సరాన్ని చూస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న పరిణామాలను సరైన క్రమంలో విశ్లేషించుకుని, అర్ధం చేసుకోకపోతే భవిష్యత్తులో ఆడాల్సిన ఆటలోనూ తప్పటడుగులు వేసే ప్రమాదమే ఎక్కువ. క్లుప్తంగా చెప్పాలంటే 2020లో చూసే దాని ఆధారంగా పెట్టుబడి మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించలేరు. 2020లో నేర్చుకోబోయే దాని ద్వారానే సంపాదన కోసం చేసే ప్రయాణంలో ముందుకు సాగగలరు.
                                             * విద్యా బాల ( 'ది హిందూ' సౌజన్యంతో )

No comments:

Post a Comment