Thursday, April 21, 2022

 

శ్రీలంక అనుభవం-గుణ పాఠాలు

 

శ్రీలంక అనుభవం నుండి నేర్చుకోకపోతే తీవ్రమైన  ఇబ్బందుల పాలవుతాము. దీనిని అర్థం చేసుకునేందుకు ప్రజాశక్తి 21.04.2022 సంచికలో ప్రచురించబడిన శ్రీ ఏం.వి.ఎస్.శర్మ గారి వ్యాసాన్ని కొంత సంక్షిప్తీకరించి దిగువన ఇస్తున్నాము.  తప్పక చదవండి:

రోజువారీ ఆహార దినుసులు మార్కెట్‌లో లభించకపోవడం... ఒకవేళ లభించినా వాటి ధరలు అనూహ్యంగా పెరిగిపోవడం... పెట్రోల్‌, డీజిల్‌ దోరకకపోవడం... శ్రీలంక ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టిన తక్షణ కారణాలు. దేశ అవసరాలకు కావలసిన ఆహార దినుసులను చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోడానికి అవసరమైన విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది.

ఆహారం విషయం లో స్వావలంబన అవసరాన్ని  గుర్తించకుండా పాలకులు వ్యవహరించినందున తిండి  కోసం దిగుమతులపై ఆధార పదాల్స్సిన దుస్థితి శ్రీలంకలో ఏర్పడింది.   టి, కాఫీ, సుగంధ దవ్యాలు తదితర తోటల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి తద్వారా సంపాదించే  విదేశీ మారక ద్రవ్యం తో పెట్రోలు, ఆహార ధాన్యాలు  దిగుమతి చేసుకునే విధానాన్ని ఆ దేశ పాలకులు అవలంబించారు.

బ్రిటిష్‌ వారికి వలసగా ఉన్న కాలంలో శ్రీలంకలో టి, కాఫీ, సుగంధ ద్రవ్యాలు తదితర  తోటలను ఎక్కువ విస్తీర్ణంలో పెంచారు. అందుకోసం పెద్ద సంఖ్యలో తమిళులు  భారత దేశం నుండి శ్రీలంకకు వలస వెళ్లారు. ఈ చారిత్రక కారణం వలన  గణనీయమైన సంఖ్యలో తమిళ భాష మాట్లాడేవారు శ్రీలంకలో ఉన్నారు. ఈ తోటల ద్వారా వచ్చే ఉత్పత్తులను ఎగుమతి చేసి కీలకమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో కీలక పాత్ర పోషించారు. 

కానీ 1960 వ దశకం లో ఒక్క సారిగా తోటల ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయముగా అనూహ్యముగా పడి  పోవటం తో విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడింది. ఈ వాస్తవాన్ని గుర్తించిన తరువాత శ్రీలంక ప్రభుత్వము  ఆహార స్వావలంబన కోసం హరిత విప్లవ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కానీ ఈ కార్యక్రమం పూర్తి అయి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలిన అవసరం లేకుండా స్వాలంబన సాధించే లోగా   సింహళ  జాతీయ వాదం పేరుతో  దేశం లో గణనీయమైన సంఖ్యలో వున్న తమిళుల పట్ల వివక్షతను  ప్రదర్శించటం పెద్ద ఎత్తున  ప్రారంభమయింది.  

ఈ సింహళ  జాతీయ వాదం కారణముగా తాము పరాయివారుగా చూడబడుతున్నామనే భావం తమిళులలో ప్రబలమయింది. ఈ వివక్షతని ఎదుర్కొనేందుకు తమిళులలో  ఎల్ టి టి ఈ వంటి తమిళ ఉగ్రవాద సంస్థలను ఆశ్రయించే ధోరణి పెరిగినందున వాటి   బలం పెరిగి అంతర్యుద్ధానికి దారి తీసింది.

దాదాపు  25 సంవత్సరాల పాటు తమిళ టైగర్లతో పోరాటానికి, ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి శ్రీలంక ప్రభుత్వం తన శక్తినంతటినీ వినియోగించవలసి వచ్చింది. ఈ సుదీర్ఘ అంతర్యుద్ధం కారణముగా స్వదేశీ, విదేశీ పారిశ్రామిక వేత్తలు  పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రాలేదు. ఇంకోపక్క సంపన్నులుగా వున్న తమిళులు భారత దేశానికో పశ్చిమ దేశాలకో తరలిపోయారు. వ్యాపారాల్లో, సాంకేతికతలో తగు నైపుణ్యం ఉన్న తమిళులు దేశాన్ని వదలి పెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేసే అవకాశమే లేకుండా పోయింది.

 

ఏడాది క్రితం వంద శాతం సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించడంతో దేశంలో పండే పంటల దిగుబడులన్నీ పడిపోయాయి. ప్రజల కడుపులు నింపడానికి శ్రీలంక ప్రభుత్వం బొచ్చె పట్టుకుని ఐఎంఎఫ్‌ దగ్గరికి పోయి 17వ సారి అప్పు ఇవ్వాలని వేడుకుంటోంది.

శ్రీలంక  దేశ అనుభవం ఈ క్రింది  విషయాలను స్పష్టముగా రుజువు చేస్తున్నది:


1) భిన్న జాతులు, సమూహాలు ఉన్న దేశంలో వాటి నడుమ విద్వేష పూరిత వాతావరణం, ఘర్షణలు నెలకొంటే ఆ దేశంలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. ఆర్థిక పరముగా అధోగతి పాలవుతుంది.

 ప్రస్తుతం మన దేశంలో మోడీ ప్రభుత్వం కూడా మెజారిటేరియన్‌ ఆధిపత్యవాదాన్నే వివిధ రూపాల్లో ప్రదర్శిస్తోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య...హిందువులకు, ముస్లిములకు మధ్య...హిందీ వారికి, హిందీయేతరులకు మధ్య ఘర్షణలను బిజెపి - ఆరెస్సెస్‌ కూటమి రెచ్చగొడుతోంది.


ఇటువంటి స్థితిలో 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' విషయంలో ఎన్ని మార్పులు చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఇన్ఫోసిస్‌ వంటి కొన్ని బడా కంపెనీలు తమ ప్రధాన కార్యకలాపాలను వేరే దేశాలకు తరలిస్తున్నాయి. దేశంలో కార్పొరేట్లు పెట్టే మదుపులు తగ్గిపోయాయి.

 

2) ఈ ఉన్మాద పూరిత విధానాలు అహర విషయం లో దిగుమతులపై ఆధార పడేలా చేస్తాయి.      ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ స్వాలంబనకే ఎసరుపెట్టే వ్యవసాయ చట్టాలను తెచ్చింది. రైతుల చారిత్రాత్మక పోరాట ఫలితంగా ఆ చట్టాలు రద్దయి వుండొచ్చు. కాని మోడీ ప్రభుత్వం ఆలోచనలో మార్పు లేదు. మళ్లీ ఏదో ఒక విధంగా ఆ చట్టాలను తేవాలని వ్యసాయాన్ని కార్పొరేటీకరించాలని ప్రయత్నిస్తోంది. అదే జరిగితే మన దేశ ఆహార స్వావంలంబన దెబ్బతినడం ఖాయం. ఇంత పెద్ద దేశం తన ప్రజలకు కావాల్సిన తిండి గింజలను పండించుకోలేని పరిస్థితే వస్తే, తిండి కోసం దిగుమతులపై ఆధారపడవలసి వస్తే ఎటువంటి భయంకర వాతావరణం నెలకొంటుందో ఆలోచించండి!


3) నయా ఉదార వాద ఆర్థిక విధానాల (సరళీకరణ-ప్రయివేటీకరణ-ప్రపంచీకరణ )  పర్యవసానాలు తీవ్రముగా వుంటాయి:   1979 నుండి శ్రీలంక నయా ఉదారవాద విధానాలను ప్రారంభించింది. ఐఎంఎఫ్‌ పరతులన్నింటికీ తలొగ్గింది. తన దేశంలో ఉత్పత్తి చేయగల సరకులను సైతం దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. టూరిజం వంటి రంగాల మీదనే ఎక్కువగా ఆధారపడింది. చివరికి ఇప్పుడు ఈ దుస్థితికి చేరింది.


 
మన దేశంలో కూడా నయా ఉదారవాద విధానాలనే వేగంగా అమలు చేస్తున్నారు. దేశీయ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేసే బదులు మనకి ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నారు. యావత్‌ ప్రపంచానికీ వ్యాక్సిన్లను అందించగల సామర్థ్యాన్ని పెంపొందించుకున్న మన దేశం నేడు కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం దిగుమతుల పైనే ఆధారపడవలసి వస్తోంది. రక్షణ రంగం వంటి కీలక రంగాల్లో సాధించుకున్న స్వావలంబనను నాశనం చేసుకుని అమెరికాతో రక్షణ బంధం పేర ఒప్పందాలు చేసుకుంటున్నాం. అమెరికన్‌ ఉత్పత్తుల పైనే మొత్తం ఆధారపడవలసిన స్థితికి దిగజారాం.

 

సాఫ్ట్‌వేర్‌ రంగం (మేథోశ్రమ)లో ముందడుగు వేశాం కాని కీలకమైన హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల విషయాన్ని విస్మరించాం. దీని ఫలితంగా కీలకమైన ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ అంతా విదేశాల నుండే దిగుమతి చేసుకోవలసి వస్తోంది. దీని పర్యవసానంగా మన సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కూడా మందగించిపోయింది. పొరుగు దేశం చైనా ఇందుకు భిన్నంగా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువ కేంద్రీకరించింది. కనుకనే నేడు ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద ఎగుమతిదారుడిగా ఎదిగింది. నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేస్తున్నది.
   
దేశభక్తి గురించి కబుర్లతోటే శివాలెత్తి పోవడం, ఆ పేరుతో ఇరుగు పొరుగు దేశాలతో కయ్యాలను ప్రేరేపించడం, తప్ప నిజంగా దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసే ఆలోచన ఈ మోడీ ప్రభుత్వానికి లేదు.

 శ్రీలంకలో సింహళ జాతీయవాదం-నయా ఉదారవాద విధానాల కాంబినేషన్‌ ఆ దేశాన్ని, అక్కడి ప్రజలకు ఎటువంటి స్థితికి తెచ్చిందో చూస్తున్నాం. ఇక్కడ మన దేశంలో హిందూత్వ జాతీయవాదం - కార్పొరేట్‌ శక్తుల కాంబినేషన్‌ కూడా ఆ విధానాలనే బరితెగించి అమలు చేస్తోంది. ఈ జోడీకి ఎంత త్వరగా చెక్‌ పెట్టగలిగితే అంత త్వరగా మన దేశాన్ని వినాశనం నుండి కాపాడు కోగలుగుతాం. ఇదే దేశ భక్తులందరి కర్తవ్యం.