Friday, March 4, 2022

కేంద్ర కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఫెడరేషన్ల/సంఘాల సంయుక్త వేదిక పిలుపుననుసరించి 2022 ఫిబ్రవరి 23,24 తేదీలలో జరుగు రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయండి

 


ఢిల్లీ లో 11.11.2021 న కేంద్ర ట్రేడ్ యూనియన్లు మరియు స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాల సంయుక్త వేదిక ఆధ్వర్యమున  కార్మిక వర్గ జాతీయ సదస్సు జరిగినది.  కేంద్రం లో బిజెపి ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, జాతీయతా వ్యతిరేక వినాశకర  విధానాలకు నిరసనగా రెండు రోజుల సార్వతిక సమ్మె కి పిలుపునివ్వాలని నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాలు జరిగే సందర్భములో ఈ సమ్మె జరగాలని, తదనుగుణముగా సమ్మె తేదీలను తదుపరి జరుగు  సంయుక్త వేదిక సమావేశం లో నిర్ణయించాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ ప్రకారమే 3.12.2021 న  ఢిల్లీలో జరిగిన సంయుక్త వేదిక సమావేశం లో 2022 ఫిబ్రవరి 23,24 తేదీలలో సార్వత్రిక సమ్మె జరగాలని నిర్ణయించారు. ఈ సార్వత్రిక  సమ్మె ప్రధాన నినాదం గా  “ ప్రజలని కాపాడండి,  దేశాన్ని కాపాడండి(“Save the people, save the Nation”) అనే నినాదం వుండాలని ఈ సమావేశం నిర్ణయించింది.

కేంద్ర ట్రేడ్ యూనియన్లు మరియు స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాల సంయుక్త వేదిక లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా వున్నది. 22.12.2021 న జరిగిన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆన్ లైన్ కేంద్ర కార్యవర్గ సమావేశం ఈ రెండు రోజుల సార్వత్రిక సమ్మె లో పాల్గొనాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. సమ్మేలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది.

సమ్మెకి  తయారు చేసే కార్యక్రమములో భాగముగా సంయుక్త కిసాన్ మోర్చా తో సమన్వయం చేసుకుని బహిరంగ సభలు నిర్వహించాలని, ప్రత్యేకించి 2022 మొదట్లో వివిధ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన   “మిషన్ ఉత్తరప్రదేశ్” “మిషన్ ఉత్తరాఖండ్” పిలుపులను బలపరచాలని కార్మిక సంఘాల సంయుక్త వేదిక నిర్ణయించింది.

రైతు వ్యతిరేక చట్టాలను మోడి ప్రభుత్వము ఉపసంహరించుకునేలా చేసి ఘన విజయం  సాధించిన అనంతరం మిగతా డిమాండ్స్ కోసం సంయుక్త కిసాన్ మోర్చా చేస్తున్న ఉద్యమాలకు తన మద్దతు కొనసాగుతుందని కార్మిక   సంఘాల సంయుక్త వేదిక ప్రకటించింది.

కార్మిక సంఘాల సంయుక్త వేదిక రాష్ట్ర శాఖలు రాష్ట్ర స్థాయి సదస్సులు, మానవ హారాలు, టార్చ్ లైట్ ప్రదర్శనలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు  నిర్వహించటం తో పాటు ప్రాంతాల వారీగా కూడా ప్రచారాలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను వినాశనం అంచుకు తెచ్చిన  కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, జాతీయతా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చింది. 2021 డిసెంబరు 16-17 న జరిగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించటం తో పాటు ఆ సమ్మె విజయవంతమైనందుకు అభినందించింది. ఫిబ్రవరి 1 న జరిగిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఐక్య వేదిక,  ఎలక్ట్రిసిటీ ప్రయివేటీకరణకు దారి తీసే బిల్లును పార్లమెంటు ఆమోదం పొంది చట్టం గా మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకముగా ఫిబ్రవరి 1న సమ్మె  చేయాలని నిర్ణయించింది. ఇందుకు  ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఐక్య వేదికకు కార్మిక సంఘాల సంయుక్త వేదిక అభినందనలు తెలియజేస్తున్నది. ఈ సమ్మేకి పూర్తి మద్దతు ప్రకటించింది.

మన పోరాటం ప్రజల హక్కులను మరియు జీవితాలను జీవనాధారాలను కాపాడేందుకే గాక దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామిక వ్యవస్థను మరియు సమాజం మొత్తాన్ని వినాశనం చేసేందుకు అధికారం లో వున్న నియంత్రత్వ శక్తులు స్వదేశీ విదేశీ కార్పొరేట్ల మద్దతు తో అవలంబిస్తున్న వినాశకర విధానాలను ఓడించటం తో పాటు తమ అధికార బలం తో ఆ విధానాలను ముందుకు తీసుకెలుతున్న  రాజకీయ శక్తులను కూడా ఓడించాలని కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది.

అధికార దర్పం తో వున్న మోడి ప్రభుత్వాన్ని అది చేసిన 3 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించేలా  సంయుక్త కిసాన్ మోర్చా చేసింది. చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ప్రజల జీవితాలు,  జీవనోపాధి, ఉద్యోగాలు, పెరుగుతున్న దారిద్ర్యం, ఆకలి బాధలు, మరియు ప్రజస్వామ్యం పై  ప్రజల  ఐక్యత పై జరుగుతున్న  దాడులను తిప్పి కొట్టి మన ప్రియమైన భారత దేశాన్ని వినాశనం నుండి కాపాడేందుకు సకల రంగాల ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం వున్నది.

పని హక్కును, జీవన వేతనాన్ని, నాణ్యమైన ఉచితమైన ఆరోగ్య వ్యవస్థ, పౌరులందరికి విద్యా సౌకర్యం,  రాజ్యాంగ హక్కుల అమలు  మరియు కార్మికుల, రైతుల, ప్రజల డిమాండ్స్ కు తమ మద్దతు వున్నదని వాటిని పరిష్కరిస్తామని అన్ని  రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళిక లో చేర్చాలని, రానున్న శాసన సభల  ఎన్నికల సందర్భముగా మరియు ఆ తరువాత 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భముగా తాము అధికారం లోకి వస్తే అమలు చేస్తామని అన్ని  రాజకీయ పార్టీలను   మనము డిమాండ్ చేయాల్సిన అవసరం వున్నది.

రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ, పెట్రోలు డీజిల్ పై కేంద్రం విధించిన పన్నులలో స్వల్పముగా తగ్గించటం అనేది రైతులు సుదీర్ఘ కాలం ఉద్యమించినందున మరియు ఆ ఉద్యమానికి మద్దతుగా దేశ  వ్యాప్త ముగా జరిగిన సౌహార్ద్రిక  ఉద్యమాలు, అనేక రూపాలలో ఈ విధానాలకు వ్యతిరేకముగా  పెల్లుబుకుతున్న నిరసనలు,  కేంద్రం లో అధికారం లో వున్న పార్టీ  ఇటీవలి కాలం లో జరిగిన ఉప ఎన్నికల లో ఒడి పోవటం- ఇవన్నీ పాలక పార్టీ పై ఒత్తిడి పెంచాయి. కాబట్టి దృఢ నిశ్చయం తో సమైక్య పోరాటాన్ని మరింత తీవ్రం చేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించాలి. ఫిబ్రవరి 23, 24 న జరుగు రెండు  రోజుల సార్వత్రిక సమ్మె కి  సంపూర్ణ  విజయం చేకూర్చటం ద్వారా మన దృఢ నిశ్చయాన్ని వ్యక్తం చేయాలి.

సమ్మె డిమాండ్స్ 

1.      కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి. ఈడిఎస్ఏ (EDSA—ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ యాక్ట్)  ని రద్దు చేయాలి.

2.      మూడు రైతు చట్టాలను ప్రభుత్వము ఉపసంహరించుకున్న అనంతరం సంయుక్త కిసాన్  మోర్చా డిమాండ్స్ లో వున్న 6 డిమాండ్స్  ను ప్రభుత్వము ఆమోదించాలి.

3.      ఏ రూపములో నైనా  సరే, ప్రయివేటీకరణ చేయవద్దు. జాతీయ ద్రవ్యీకరణ విధానాన్ని రద్దు చేయాలి.

4.      ఆదాయపు పన్ను  పరిధిలోకి రాని కుటుంబాలకు ఆహారము  మరియు ఆదాయములకు మద్దతుగా నెలకి రూ. 7500/- చెల్లించాలి.

5.      MNREGA (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) కి నిధుల కేటాయింపులు పెంచాలి. పట్టణాలకు కూడా ఈ ఉపాధి హామీ స్కీమును వర్తింప జేయాలి.

6.      అనధికారిక (ఇన్ఫార్మల్) రంగాలలో పని చేస్తున్న వారందరికి సార్వత్రిక సాంఘిక భద్రత

7.      అంగన్వాడీ, ASHA(ఆశా), మధ్యాహ్న భోజనం తదితర స్కీము వర్కర్స్ కు చట్టబద్ధమైన కనీస వేతనం మరియు సాంఘిక భద్రత ఆమలు  చేయాలి.

8.      కరోనా మహమ్మారి వున్నప్పటికి ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు తగు రక్షణ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కలిగించాలి.

9.      వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర  ప్రజా ఉపయోగ  సౌకర్యాలకు ప్రభుత్వము  నిధుల కేటాయింపు ను పెంచాలి. ఇందుకోసం అవసరమైన నిధులను పెంచేందుకు సంపన్నుల పై సంపద పన్ను తదితర పన్నులు విధించాలి. తద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి.

10.   పెట్రోలియం ఉత్పత్తుల పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ని గణనీయముగ తగ్గించాలి మరియు అధిక ధరలను అరికట్టేందుకు తగు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి.

11.   కాంట్రాక్ట్ వర్కర్స్ ను స్కీము వర్కర్స్ ను రెగ్యులరైజ్ చేయాలి. అందరికీ సమాన పనికి సమాన వేతనం ను ఆమలు  చేయాలి.

12.   నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.  ఈపిఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) లో మినిమమ్ పెన్షన్ ను గణనీయముగా పెంచాలి.

పైన పేర్కొన్న 12 డిమాండ్స్ తోపాటు ఆయా రంగాలకు సంబంధించిన ఉద్యోగులు గతం నుండి  పోరాడుతున్న కొన్ని డిమాండ్స్ ను కూడా సమ్మె నోటీసు లో చేర్చేందుకు కేంద్ర కార్మిక సంఘాలు మరియు రంగాల వారి సంఘాలు నిర్ణయించాయి. దీని ప్రకారం  బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వర్తించే ఈ క్రింది డిమాండ్స్ ను కూడా సమ్మె నోటీస్ లో ఎంప్లాయూస్ యూనియన్ నిర్ణయించింది.

1.     ఎక్విప్మెంట్ ను కొనుగోలు చేసే విధానం లో బి ఎస్ ఎన్ ఎల్ పట్ల వివక్షత పనికి రాదు. ర్జీ సేవలను బి ఎస్ ఎన్ ఎల్ వెంటనే ప్రారంభించాలి. 5జి సర్వీసులను బిఎస్ఎన్ఎల్  సకాలం లో ప్రారంభించే విధముగా  చూడాలి.

2.    “నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్”  విధానాన్ని రద్దు చేయాలి.  బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లను మరియు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ను  మానిటైజ్ చేయ వద్దు.

3.    బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి.

4.    రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ చేయాలి.

5.    రిట్రెంచ్ చేయబడిన కాంట్రాక్ట్ వర్కర్స్ ను వెంటనే  తీసుకోవాలి. వారి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి.

 

“ప్రజలను కాపాదండి, దేశాన్ని కాపాడండి”

అభినందనలతో

ఐఎన్ టి యుసి, ఏఐటియుసి, హెచ్ఎంఎస్, సిఐటియు,  ఏఐయుటియుసి, టియుసిసి, ఎస్ఈవిఏ  SEWA, ఏఐ సిసిటియు,  ఎల్పిఎఫ్, యు టి యు సి  మరియు రంగాల వారి స్వతంత్ర ఫెడరేషన్లు మరియు అసోసియేషన్లు

                                      పై డిమాండ్స్ లో కొన్నింటి పై  వివరణ

(ఎ)EDSA చట్టాన్ని రద్దు చేయాలిEDSA=  ఎసెన్షియల్ డిఫెన్స్  సర్వీసెస్ ఆక్ట్—సైన్యానికి అవసరమయ్యే ఆయుధాలు మరియు ఇతర సామాగ్రి తయారు చేసే  41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 7 కార్పొరేషన్లుగా చేయుటకు వ్యతిరేకముగా రక్షణ రంగానికి చెందిన సివిల్ ఉద్యోగుల సంఘాలు నిరవధిక సమ్మె ప్రకటించిన సందర్భముగా మోడీ ప్రభుత్వము ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారం సమ్మె లో పాల్గొన వారికి సంవత్సరం, సమ్మె చేయాలని రెచ్చగొట్టిన వారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ డిఫెన్స్ ఉద్యోగుల సంఘాలు ఢిల్లీ మరియు చెన్నై హైకోర్టులలో కేసు వేశారు. కార్పొరేటికరణ సమస్యపై యూనియన్లు జరిపిన రిఫరెండమ్ లో 99 శాతం ఉద్యోగులు కార్పొరేటికరణ వద్దని అన్నారు. అయినప్పటికి మోడి ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తూ 246 సంవత్సరాల చరిత్ర వున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్ ను రద్దు చేసి  దాని అధీనం లో వున్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 1.10.2021 నుండి 7 ప్రభుత్వ రంగ సంస్థల అధీనం లోకి వెళ్లాలని ఆదేశించింది. ఆ తరువాత ప్రయివేటు పరం చేసేందుకే ఈ కార్పొరేటికరణ జరుగుతున్నది.

(బి) నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. వాజపాయి గారి హయాములో 1.1.2004 నుండి రిక్రూట్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని ప్రారంభించారు.   దీని ప్రకారం ఉద్యోగులు ప్రతి నెలా తమ పే మరియు డిఏ పై 10 శాతం తాము  ఆప్షన్ ఇచ్చిన  పెన్షన్ ఫండ్ కంపెనీకి జమ చేయాలి. ప్రభుత్వము కూడా మరో 10 శాతం కంట్రిబ్యుట్ చేస్తుంది. ఉద్యోగి రిటైరయిన అనంతరం పెన్షన్ చెల్లించే బాధ్యత ప్రభుత్వానికి వుండదు. తనకి వచ్చే ఆదాయం ప్రకారం ఎంత చెల్లించాలో పెన్షన్ ఫండ్ కంపెనీయే నిర్ణయించి ఆ ప్రకారం చెల్లిస్తుంది. ఆఖరు వేతనం లో 50 శాతం పెన్షన్ గా నిర్ణయించి ప్రభుత్వమే పెన్షన్ చెల్లించే విధానం వీరికి వర్తించదు.   1.1.2004 లేదా ఆ తరువాత రిక్రూట్ అయిన అనేక రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులకు కూడా ఈ నూతన పెన్షన్ విధానం అమలులోకి తెచ్చారు. మన పెన్షన్ నిధులు స్వదేశీ విదేశీ పెన్షన్ ఫండ్ కంపెనీల హస్తగతమయ్యే విధముగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. పెన్షన్ కు భద్రత లేని ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.మన రాష్ట్రం లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ డిమాండ్ కోసం పోరాడుతున్నారు.

ఈ‌పి‌ఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)  ఈపిఎఫ్ లో భాగముగా ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ వున్నది. 1.10.2000 న లేదా ఆ తరువాత బిఎస్ఎన్ఎల్ లో రిక్రూటైన వారికి  ఈపిఎఫ్  వర్తిస్తుంది. అందులో భాగముగా వున్న ఈపిఎస్(ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) స్కీము వీరికి వర్తిస్తుంది. ఈ స్కీమ్ ప్రకారం చెల్లించాల్సిన మినిమమ్ పెన్షన్ ను గణనీయముగా పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

కామ్రేడ్స్,

కేంద్ర  ట్రేడ్ యూనియన్లు మరియు రంగాల వారిగా వున్న  స్వతంత్ర ఫెడరేషన్లు, యూనియన్లు పై డిమాండ్స్ కోసం 2022 ఫిబ్రవరి 23, 24 తేదీలలో రెండు రోజుల సార్వతిక సమ్మేకి పిలుపునిచ్చాయి. ఈ పిలుపు లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా భాగ స్వామిగా వున్నది.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ చేయవద్దని, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ద్రవ్యీకరణ పేరుతో దశాబ్దాల పాటు స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అతి చవుకగా లీజు కిచ్చే విధానలను  విరమించాలని మరియు కార్మిక హక్కులను హరించే లేబర్ కొడ్స్ ను రద్దు చేయాలని మరియు కార్మిక వర్గానికి సంబధించిన ఇతర డిమాండ్స్  ను పరిష్కరించాలని కోరుతూ ఈ సమ్మె పిలుపునిచ్చారు. దీనిని విజయవంతం చేస్తేనే ప్రభుత్వ రంగాన్ని అందులో భాగముగా బిఎస్ఎన్ఎల్ ను కాపాడుకోటం సాధ్యమవుతుంది. కాబట్టి  బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ  ఈ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

అభినందనలతో

 

బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్

 

No comments:

Post a Comment