Wednesday, April 23, 2014

ధరల పెరుగుదల సమస్యపై సి పి ఎం, కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలలో ఏముంది?

సి పి ఎం ఎన్నికల ప్రణాళిక

పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయటానికి దిగువన పేర్కొన్న చర్యలు తీసుకోవాలని సి పి ఎం ప్రతిపాదిస్తున్నది:
  1. పెట్రోలియం ఉత్పత్తుల ధరల నియంత్రణ విధాన వ్యవస్థను తిరిగి ప్రవేశ పెట్టటం
  2. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజు మరియు కస్టంసు పన్నుల తగ్గింపు
  3. సహజవాయు ధరలపై నియంత్రణ  మరియు కేజీ బేసీన్ గ్యాస్ ధరల పెంపు ఉపసంహరణ
  4. వ్యవసాయ ఉత్పత్తుల ముందస్తు ట్రేడింగ్ పై నిషేధం
  5. అత్యవసర వస్తువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు మరియు అందుకోసం అత్యవసర వస్తువుల చట్టం లోని అంశాల పటిష్టీకరణ
  6. గోదాములు, గిడ్డంగులలో ప్రయివేటు నిల్వలను వెల్లడించే నిబంధనలను పటిష్ట పరచటం
  7. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచటం, పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వ గోదాములలో వున్న అదనపు నిల్వలను వివేకముతో ఉపయోగించటం
  8. ధరలు అధికముగా వుండి పెరుగుతున్నప్పుడు ఆహార ధాన్యాల ఎగుమతులను నియంత్రించటం
  9. అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించటం
  10. ఎలెక్ట్రిసిటీ ధరల పెరుగుదలకి కారణమయిన ఎలెక్ట్రిసిటీ చట్టం 2003 ని సమీక్షించటం 
కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలు

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ధరల పెరుగుదల ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను కొనసాగిస్తామని వుంది.  మన లక్ష్యం ఆర్థిక వ్యవస్థ అధిక పెరుగుదల అయినప్పుడు ఒక మోస్తరుగా ధరల పెరుగుదల వుంటుందని, అయితే ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు రిజర్వు బ్యాంకు ఒక వంక ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకి మరొక వంక ధరల స్థిరత్వానికి మధ్య సమతుల్యత సాధించాలని, వున్నది.
బి జె పి ఎన్నికల ప్రణాళికలో ధరల పెరుగుదలని అరికట్టేందుకు అక్రమ నిల్వదారులపై, బ్లాక్ మార్కెటిర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని, ధరల స్థిరికరణ నిధిని ఏర్పాటు చేస్తామని, ఫుడ్ కార్పొరేషన్ ను మూడు ముక్కలుగా చేస్తామని,  దేశం మొత్తం ఒకే మార్కెట్ గా తయారు చేయాలని, వుంది.
ధరల పెరుగుదలకి అసలు కారణాలను కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలు పట్టించుకోటం లేదు. పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల వలన రవాణా ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు(గ్యాస్ తో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి జరుగుతున్నది), రసాయన ఎరువుల(పెట్రోలియం ఉత్పత్తులను ఎరువుల తయారీలో వాడతారు) ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్ , పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు తగ్గించేందుకు ప్రభుత్వమే గతములో వాటి ధరలను నిర్ణయించేది. అందుకు అవసరమయిన సబ్సిడీలిచ్చేది. కాంగ్రెస్, బి జె పి లు దీనిని గురించి మాట్లాడటం లేదు. పెట్రోల్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించే విధానాన్ని ఎత్తి వేయటం బి జె పి హయాములోనే ప్రారంభమయింది. కాంగ్రెస్ దానిని కొనసాగించింది. కె జి బేస్ గ్యాస్ ను అంబానీల కు ఇచ్చి వారినుండి అత్యంత ఎక్కువ ధరకు ప్రభుత్వము కొంటున్నందున గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అంబానీల ఈ దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వము అనుమతిస్తున్నది. బి జె పి దీనిని వ్యతిరేకించకుండా సహకరిస్తున్నది.
ముందస్తు ట్రేడింగ్(ఫార్వర్డ్ ట్రేడింగ్)అనే జూదగొండి ట్రేడింగ్ వలన వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. కానీ ఈ ఫార్వర్డ్ ట్రేడింగ్ రద్దు చేస్తామని కాంగ్రెస్ గాని, బిజెపి గాని అనటం లేదు.  ప్రభుత్వ గోదాముల్లో భారీగా నిల్వలు వున్నందున ముక్కి పోయి పాడవుతున్న ధాన్యాన్ని తక్కువ ధరకు చవుక దుకాణాల ద్వారా ప్రజలకి అందించి ధరలు తగ్గించ వచ్చు. కానీ ఈ పని చేస్తామని కాంగ్రెస్ గాని, బి జె పి గాని అనటం లేదు.
ఎలెక్ట్రిసిటీ చట్టం 2003 ను బి జె పి ప్రభుత్వము తెచ్చింది. విదేశీ, స్వదేశీ ప్రయివేటు ఎలెక్ట్రిసిటీ ఉత్పత్తి కంపెనీలను పెద్ద ఎత్తున అనుమతించి వాటికి భారీ లాభాలు గ్యారంటీ చేసేందుకు ఎలెక్ట్రిసిటీ ధరలు పెంచటం దీని సారాంశం. బి జె పి ప్రభుత్వము ఈ చట్టం తేగా కాంగ్రెస్ దీనిని కొనసాగించింది. ఈ ప్రజావ్యతిరేక చట్టాన్ని మార్చేందుకు కాంగ్రెస్ గాని, బిజెపి గాని సుముఖముగా లేవు.
బ్లాక్ మార్కెటీర్లను శిక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని షరా మామూలే అన్న పద్ధతిలో  బి జె పి అంటున్నది. రిజర్వు బ్యాంకు తన ద్రవ్య విధానంలో  సమతుల్యతని పాటించి ధరలు మరీ పెరగకుండా చూడాలని కాంగ్రెస్ అంటున్నది.

కాంగ్రెస్, బి జె పి లు  ధరల పెరుగుదల సమస్యని పరిష్కరించేందుకు సుముఖముగా లేవని వీరి ఎన్నికల ప్రణాళికలు తెలియ జేస్తున్నాయి. ఇందుకు భిన్నముగా సి పి ఏం ఎన్నికల ప్రణాళిక ధరల పెరుగుదల సమస్యకు నిజమయిన పరిష్కారాలను ప్రతిపాదించింది.


No comments:

Post a Comment