Wednesday, February 10, 2016

మార్చి 10 న ప్రదర్శనలకి కేంద్ర కార్మిక సంఘాల పిలుపు


ఢిల్లీలో 27.1.2016న సమావేశమయిన కేంద్ర ట్రేడ్ యూనియన్లు (ఐ ఎన్ టి యు సి, బి ఏం ఎస్, ఏ ఐ టి యు సి, సి ఐ టి యు, హెచ్ ఏం ఎస్ మొ.) మోడి ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమీక్ష చేశాయి. కార్మిక హక్కుల రద్దు చేయటానికి చట్టాలు సవరించేందుకు మోడి ప్రభుత్వము ఉపక్రమిస్తున్నదని, ఈ చట్ట సవరణలు జరిగేలోగా కార్యనిర్వాహక ఆర్డర్సు ద్వారా కార్మిక హక్కులు రద్దు చేయటానికి ఉపక్రమిస్తున్నదని, కార్మిక హక్కులు రద్దు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్నదని  కార్మిక సంఘాలు గుర్తించాయి. ఇంతేగాక ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంటుకు, కీలక రంగాలలో ఎఫ్ డి ఐ అనుమతికి ఉపక్రమిస్తున్నదని గమనించాయి.
 ఇటీవలే మోడి ప్రభుత్వము జనవరి 12న మోడి ప్రభుత్వము ఒక ఆర్డరును కార్మిఖ శాఖ కార్యదర్శి ద్వారా విడుదల చేయించింది. దీని ప్రకారం స్టార్ట్ అప్ కంపెనీలు వాటి వార్షిక టర్నోవరు ఋ.25 కోట్ల లోపు వుంటే అవి పారిశ్రామిక వివాదాల చట్టం, ఈ పి ఎఫ్ చట్టం, ఈ ఎస్ ఐ చట్టం, ట్రేడ్ యూనియన్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, బిల్డింగ్ మరియు కంస్ట్రక్షన్ వర్కర్స్ చట్టం, ఇంటర్ స్టేట్ మైగ్రాంట్ వర్కర్స్ చట్టం, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ (స్టాండింగ్ ఆర్డర్) చట్టం, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-ఈ  9 కార్మిక చట్టాలను పాటిస్తున్నాయా లేదా పరిశీలించటానికి లేబర్ ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేయకూడదని, ఈ పి ఎఫ్ ఈ ఎస్ ఐ సంస్థలు కూడా పట్టించుకోకూడదని,  ఈ చట్టాలను పాటిస్తున్నట్లు అవి ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ఇస్తే చాలునని ఈ ఆర్డరు సారాంశం. ఈ విధముగా ఈ కంపెనీలు కార్మిక చట్టాల అమలును ఉల్లంఘించినా దిక్కు లేని పరిస్థితిని మోడి ప్రభుత్వము సృష్టిస్తున్నది. స్టార్ట్ అప్ కంపెనీలు ప్రారంభమయిన మొదటి 3 సంవత్సరాలు ఈ మినహాయింపునివ్వాలని ప్రభుత్వము ఆదేశించింది. ఇప్పటికే అనేక బడా కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని స్టార్ట్ అప్ కంపెనీల రూపం లోకి మార్చి మోడి ప్రభుత్వము స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రకటించిన 3 సంవత్సరాల పన్నుల మినహాయింపు, మూడు సంవత్సరాల కార్మిక చట్టాల మినహాయింపు రాయితీలను వాడుకోవాలనే ప్రయత్నం లో వున్నాయి.  స్టార్ట్ అప్ కంపెనీలలో పని చేసే కార్మికులను వెట్టి చాకిరీ చేసే బానిసలుగా మార్చటమే ఈ విధానాల ఉద్దేశం. మోడి ప్రభుత్వము దృష్టిలో పరిశ్రమలను ప్రోత్సహించటం అంటే రైతుల భూములను ఉచితముగా ఇవ్వటం, కార్మిక హక్కులు రద్దు చేయటమేనని స్పష్టమవుతున్నది.
మోడి ప్రభుత్వము అనుసరిస్తున్న ఈ విధానాలను కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఖండించాయి. బ్యాంకింగు, రక్షణ, బొగ్గు, పోర్ట్ అండ్ డాక్స్, టెలికాం తదితర రంగాలలో కార్మికులు/ఉద్యోగులు మరియు అంగన్వాడీలు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలిపాయి. 7వ వేతన సంఘం చేసిన తిరోగమన సిఫార్సులకు వ్యతిరేకముగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ట్రేడ్ యూనియన్లు బలపరచాయి. కోయంబత్తూరు లో ప్రికాల్ లిమిటెడ్ కంపెనీ వర్కర్సు 8 మందికి అతి కఠినముగా "రెండు రెట్ల యావజ్జీవ జైలు శిక్ష" ని న్యాయ స్థానం విధించటం పట్ల కేన్ద్ర్ర ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. వారికి మద్దతును, సహాయాన్ని అందించాలని కార్మికులందరికి కేంద్ర ట్రేడ్ యూనియన్లు విగ్జ్ఞప్తి చేశాయి.
మార్చి 2016 ఆఖరు వారం లో ఢిల్లీ లో తల్కతోరా స్టేడియం లో భారీస్థాయిలో కార్మిక వర్గ జాతీయ సదస్సు జరిపి భావిష్యత్తు ఐక్య కార్యాచరణను ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
మోడి ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు మార్చి 10న దేశ వ్యాపితముగా నిరసన చర్యలకు దిగాలని కార్మిక వర్గానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మేలో పాల్గొనకుండా మోడి ప్రభుత్వము ఏదో ఒరగబెడుతుందనే సాకుతో చివరి నిముషములో విరమించిన బి ఏం ఎస్ కూడా ఈ పిలుపులో భాగస్వామిగా వున్నది.
కార్మికులపై, ప్రజలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకముగా ఈ నిరసన ప్రదర్శనలలో అన్నీ రంగాల కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు  పెద్ద ఎత్తున పాల్గొనాలి.




No comments:

Post a Comment