Monday, September 2, 2013

సెప్టెంబరు 5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్త సభలు, ధర్నాలు—సి పి ఎం రాష్ట్ర కమిటీ పిలుపు

  ధరల పెరుగుదల, రూపాయి పతనం, అభివృద్ధి తరుగుదల, ఉపాధి క్షీణతకు కారణమైన యుపిఎ ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా ఈనెల 5,6 తేదీల్లో అన్ని జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో సభలు, ధర్నాలు తదితర పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.

'కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరను లీటర్‌పై మూడు రూపాయలు, డీజిల్‌పై ధరను అర్దరూపాయి పెంచింది. గత మూడు నెలల్లో పెట్రోలు ధర ఆరుసార్లు, డీజిల్‌ ధర గత ఎనిమిది నెలల్లో 8సార్లు పెరిగాయి. మరో వారంలో కిరోసిన్‌, గ్యాస్‌ ధరలను కూడా పెంచుతారనే వార్తలొస్తున్నాయి. సిరియాపై అమెరికా అక్రమదాడి చేస్తే ఆ పేరుతో ధరలను ఇంకా పెంచే ప్రమాదముంది. ఇప్పటికే నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో ఉల్లి రూ.60, బియ్యం రూ.50, మిర్చి రూ.100 పలుకుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఉపసంహరించాలని, నిత్యజీవితావసర సరుకుల ధరలను నియంత్రించాలని, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గతేడాది ఆగస్టులో రూ.49 ఉంటే, ఇప్పుడు రూ.69కి పతనమైంది. గత నాలుగు నెలల్లో రూపాయి విలువ 25% పతనమైంది. దీంతో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది.

స్థూల ఉత్పత్తి పెరుగుదల ఎప్పుడూ లేనంతగా 4.4%కి పడిపోయింది. ఉపాధితోపాటు వివిధ రంగాల్లో 10 నుండి 30శాతం వరకు పడిపోయింది. లక్షల మంది పనులు కోల్పోయి, ఉపాధి కోసం పడిగాపులు కాస్తున్నారు. పనిచేస్తోన్న అసంఘటిత కార్మికులు సైతం వేతనాలు చాలక, ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. కోస్తా, రాయలసీమల్లో రేషన్‌ డీలర్ల సమ్మెతో పేదలకు ఈ నెల చౌకబియ్యం పంపిణీ ప్రశ్నార్థంగా మారింది. రేషన్‌ బియ్యం పంపిణీకి అవసరమైన చర్యలు సత్వరం తీసుకోవాలని కోరుతున్నాం. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన పేదలకు గత మూడు నెలల నుండి రావాల్సిన వేతనం అందలేదు. దీంతో వారు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి బకాయిలను చెల్లించే ఏర్పాటు వెంటనే చేయాలి' అని రాఘవులు తన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 





No comments:

Post a Comment