Saturday, September 7, 2013

సంస్కరణలే సంక్షోభానికి మూలం

ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా 1991 నుంచి అమలైన సరళీకరణ సంస్కరణలే ఇప్పటి సంక్షోభానికి కారణం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని రాయితీలను ఇవ్వడానికి సరళం చేయడానికి సిద్ధమవుతున్నది. స్వల్పకాలిక విదేశీ పెట్టుబడులపై మూలధన లాభాలపై పన్నును(క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌)ను రద్దు చేయడానికి, రియల్‌ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నది. దిగుమతులను విచ్ఛలవిడిగా ప్రోత్సహించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అనేక దేశాలతో చేసుకుంటున్నది.
దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని సర్వత్రా చర్చ జరుగుతున్నది. 200 టన్నుల బంగారం అమ్ముకుని అప్పులు తీర్చి గట్టెక్కిన 1991 నాటి దుస్థితి మళ్ళీ దాపురించిందని అనేక మంది అంటు న్నారు. పరిస్థితి బాగా లేని మాట నిజమే కానీ మరీ అంత ఆందోళనకరం కాదని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ పార్లమెంటులో ప్రకటన చేస్తూ అన్నారు. మాటల్లో ఎన్ని తేడాలున్నా దేశం గడ్డు పరిస్థితినెదుర్కొంటున్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు సామాన్య ప్రజలకు తీవ్ర హాని చేస్తున్నాయి. వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. పెరిగిన ధరలు వేతనాలకు, ఆదాయాలకు గండిపెడుతున్నాయి. ఉన్న వారికి ఉపాధిపోతున్నది. కొత్తవారికి ఉపాధి దొరకటం లేదు. చేసిన అప్పులు తీర్చలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పరిస్థి తిని సరిదిద్దేందుకు ఆర్థిక శాఖా మంత్రి ఎంతగా నమ్మకం కల్గించే మాటలు చెప్పినా, పరిస్థితి కుదుటపడడంలేదు. ఇంకా దిగజారుతుందేమోనన్న భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ సరళీకరణ విధానాలు ప్రస్తుత పరిస్థితికి కారణమో, అవే విధానాలను పరిష్కారాలుగా ప్రభుత్వం చూపుతున్నది. ఈ పరిష్కారాలు సంపన్నులకు మరిన్ని రాయితీలను కల్పిస్తాయి. ప్రజలపై మరిన్ని భారాలను మోపుతాయి. ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారుతున్నదో అయిదు అంశాలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు.
మొదటిది స్థూల ఆర్థికాభివృద్ధి మందగించడం. దేశ స్థూల ఉత్పత్తి 2010-11లో 9.3 శాతం ఉంటే 2012-13లో 5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరం పుంజుకుంటుందని ఆర్థిక మంత్రి చెప్తున్న అంచనాలకు భిన్నంగా 2013-14 మొదటి త్రైమాసికంలో స్థూల ఉత్పత్తి పెరుగుదల 4.4 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకూ ఆర్థికాభివృద్ధిలో సింహభాగాన్ని అందిస్తున్న సేవా రంగం 6 శాతానికి పడిపోయింది. పారిశ్రామికోత్పత్తి మరీ ఘోరంగా 1.2 శాతానికి పడిపోయింది.
ఆర్థికాభివృద్ధి కోసం స్వల్పకాలిక విదేశీ పెట్టుబడుల మీద, అప్పుపై ఆధారపడి పెరిగిన వినియోగం మీద ఆధారపడడం వలన ప్రస్తుత దుస్థితి వచ్చింది. విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండేందుకు గతంలో ఉన్న ఆంక్షలనన్నింటినీ తొలగించారు. దేశంలోకి స్వల్పకాలిక పెట్టుబడులు, అప్పులు ఇబ్బడిముబ్బడిగా ప్రవేశిం చాయి. దీనితో స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. భూముల విలువలు, అద్దెలు ఆకాశాన్ని అంటాయి. రియల్‌ ఏస్టేట్‌, స్టాక్‌ మార్కెట్టు వ్యాపారాలకు, వినిమయ సరుకుల కొనుగోలుకు రుణా లను బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉదారంగా ఇచ్చింది. దీనితో ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పెరుగుతున్నదన్న బూమ్‌ వాతావరణం ఏర్పడింది. ఆర్థికాభివృద్ధి బుడగలాగా ఉబ్బింది. స్వల్పకాలిక పెట్టుబడులన్నీ చీమ చిటుక్కుమన్నా దేశాన్ని వదిలి పారిపోయే పెట్టుబడులే. దీనితో అప్పుల మీద ఆధారపడిన ఆర్థికాభివృద్ధి బుడగ పేలిపోయింది.
ఆర్థికాభివృద్ధిలో వచ్చిన మందగింపు ఉపాధిపై తీవ్రంగా పడింది. ఉన్న కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులను తొలగిస్తున్నారు. ఆటోమొబైల్‌, స్టీల్‌, ఐటి, బ్యాంకింగ్‌, నిర్మాణం వంటి రంగాల్లో తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి. లే-ఆఫ్‌లు ప్రకటిస్తున్నారు. పని దినాలు కుదిస్తున్నారు. 2004-05లో ఉపాధిలో ఉన్న కార్మికులు 42 శాతం ఉండగా 2009-10కి 36.5 శాతానికి, 2011-12కు 35.4 శాతానికి పడిపోయింది. 2013-14 మొదటి త్రైమాసికంలోనే ఐదు లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని అంచనా. దేశంలో ప్రతి సంవత్సరం 45 లక్షల మంది అదనంగా ఉపాధి కోసం ఉద్యోగార్థుల్లో చేరుతున్నారు. ఉన్నవారికే ఉపాధి ఊడిపోతుంటే కొత్తవారికి ఉపాధి దొరికే పరిస్థితి ప్రస్తుతం కన్పించడం లేదు. స్థూల ఉత్పత్తి 7 శాతం ఉంటే ఉపాధి పెరుగుదల 10.5 శాతం ఉంటుంది. స్థూల ఉత్పత్తి 5 శాతానికి పరిమితమైతే ఉపాధి పెరుగుదల 7.5 శాతానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం జాతీయ స్థూల ఉత్పత్తి బాగా దిగజారడంతో నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
రెండవది, వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం. 2012లో ద్రవ్యోల్బణం 9.3 శాతం ఉంటే ఇప్పుడు 11.14 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం గత మూడు నెలల్లో పెట్రోల్‌ ధరలు ఆరుసార్లు పెంచింది. మార్చిలో లీటర్‌ రూ.75 ఉంటే ఇప్పుడు రూ.93కు చేరింది. గత ఆరు నెలల్లో డీజిల్‌ ధరను ఆరు సార్లు పెంచింది. మార్చిలో రూ.53 ఉంటే ఇప్పుడు రూ.57కు చేరింది. పార్లమెంటు సమావేశాల తరువాత మళ్ళీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కిరోసిన్‌ ధరలన్నింటినీ పెంచాలని యోచిస్తున్నది. ఇంధన ధరలు ఈ రకంగా పెంచడం ఇతర సరుకుల ధరలన్నీ పెరగడానికి కారణమవుతుంది. నిత్యజీవితావసర సరుకుల ధరలన్నీ పెరిగాయి. ఉల్లి రూ.60, మిర్చి రూ.100, బియ్యం రూ.50 అమ్ముతున్నాయి. అన్ని కూరగాయ ధరలూ ఆకాశాన్నంటుతు న్నాయి. చాలీచాలని వేతనాలతో, ఆదాయాలతో బ్రతుకు తున్న పేద ప్రజల జీవన ప్రమాణాలు ధరల పెరుగుదలతో దెబ్బతిం టున్నాయి. ఈ సంవత్సరం వర్షపాతం బాగా ఉన్నందున వ్యవసాయోత్పత్తి పెరిగి త్వరలోనే ధరలు తగ్గుతాయని ప్రధాన మంత్రి చెప్తున్నారు. ప్రధాన మంత్రి చెప్పింది నిజమనుకున్నా రూపాయి పతనంతో పెరిగే ధరలను సానుకూల వర్షపాతం తగ్గించజాలదు.
మూడవది, రూపాయి విలువ పతనం. గత మూడు నెలల నుంచి రూపాయి విలువ వేగంగా పతనం అవుతూ ఉన్నది. 2011 ఆగస్టులో డాలరుకు రూపాయి మారకం 45 ఉంటే 2012 ఆగస్టు నాటికి 55, ఈ నాటికి(2013 సెప్టెంబర్‌) 67కు పడిపోయింది. రూపాయి విలువ ఈ సంవత్సరంలోనే 20 శాతం పతనం అయింది. అమెరికాలో పరిస్థితి బాగాలేనప్పుడు విదేశీ పెట్టుబడులు మనలాంటి ఆర్థిక వ్యవస్థ వైపు ఆసక్తి కనబర్చాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఇప్పటి వరకూ అమలు జరుపుతున్న ఉద్దీపన పథకాన్ని క్రమేణా ఉపసంహరిస్తామని ప్రకటించడంతో అక్కడ వడ్డీరేట్లు పెరిగి లాభకరంగా ఉంటుందన్న ఆలోచనతో పెట్టుబడులన్నీ మళ్ళీ విదేశాలకు తరలిపోవడం ప్రారంభమైంది.
దీనితో విదేశాలకు తీసుకెళ్ళేందుకు లేదా చెల్లించేందుకు డాలర్లకు డిమాండు పెరగడంతో డాలరు విలువ పెరిగి రూపాయి విలువ దిగజారడం ప్రారంభమయ్యింది. ఈ పరిస్థితులను సొమ్ము చేసుకోవడానికి మారకద్రవ్య వ్యాపారులు స్పెక్యులేషన్‌కు పాల్పడడంతో రూపాయి పరిస్థితి మరింత దిగజారింది. రూపాయి విలువ పతనంతో దిగుమతుల ధరలు పెరిగిపోతున్నాయి. మనకు అవసరమైన ముడి చమురులో 80 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నది. 40 శాతం రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకుంటున్నది. పుష్కలంగా బొగ్గు ఉండి కూడా 135 మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల నుంచి తెచ్చుకుంటున్నది. సామాన్యులు, మధ్యతరగతి వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వంటనూనెల ధరలు, రైతులు వినియోగించే రసాయన ఎరువుల ధరలు, విద్యుత్తుత్పత్తికి వాడే బొగ్గు ధరలు భారీగా పెరుగాయి. సిరియాపై అమెరికా దాడి చేయనున్నదన్న ఆందోళన వలన అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇంధన ధరలకు మరింత ఆజ్యం పోశాయి. రుణాలు తీసుకుని విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు చెల్లింపు మొత్తాలు పెరిగాయి. విదేశాల నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు తెచ్చిన అప్పులు చెల్లించడానికి, విదేశీ పర్యటనలు చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ప్రజావసరాలకు కూడా దిగుమతుల మీద ఆధారపడే మన లాంటి దేశాలలో రూపాయి విలువ పతనం సామాన్య ప్రజల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
నాలుగవది, కరెంటు ఖాతా లోటు భారీగా పెరగడం. కరెంటు ఖాతా అంటే ఎగుమతుల, దిగుమతుల వ్యయం మధ్య తేడా, విదేశాల నుంచి వచ్చే విదేశాలకు పోయే వడ్డీ, లాభాల మొత్తాల మధ్య తేడా, దేశంలోకి దేశం బయటకు బదిలీ అయ్యే డబ్బు మధ్య తేడా. ఈ మూడింటిని కలిపినప్పుడు మిగులు ఉంటే కరెంటు ఖాతా మిగులు అంటారు. తరుగు ఉంటే కరెంటు ఖాతా లోటు అంటారు. ప్రస్తుతం మన దేశం భారీ లోటులో ఉన్నది. 2007లో కరెంటు ఖాతా లోటు 800 కోట్ల డాలర్లు ఉంటే ఇప్పుడు 9,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈలోటు ప్రస్తుతం జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.8 శాతానికి చేరింది. 2.5 శాతం లోపైతే ఆర్థిక వ్యవస్థ కొంత మేరకు తట్టుకోగలదు. అంతకు మించితే దేశంలో ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా హరించుకుపోయి బయటి దేశాలకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి వస్తుంది.
కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగితే దాని దుష్ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. విదేశీ ఎగుమతిదారులకు, పెట్టుబడి మదుపరులకు నమ్మకం సన్నగిల్లి పరపతి తగ్గిపోతుంది. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు మనకు రేటింగ్‌ తగ్గిస్తాయి. దీంతో దేశంలోకి అప్పులు, పెట్టుబడులు రావడం మరింత సన్నగిల్లుతాయి. ఇది ఒక విషయవలయంగా మారి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది.
ఐదవది, విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోతుండడం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉంటేనే కరెంటు ఖాతా లోటును పూడ్చుకోగలం. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 2011 ఆగస్టులో 31,800 కోట్ల డాలర్లు ఉంటే, 2013 ఆగస్టు నాటికి 27,500 కోట్ల డాలర్లకు తగ్గాయి. 2013 మార్చి నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదు నెలల్లోనే విదేశీ మారకద్రవ్య నిల్వలు 1,400 కోట్ల డాలర్లు తగ్గాయి. విదేశీ చెల్లింపులకు 2013 సంవత్సరానికి 26,600 కోట్ల డాలర్లు కావాలని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వలు ఆరు నెలల దిగుమతుల ఖర్చును చెల్లించడానికి కూడా సరిపోవు. ఇక చెల్లింపులు చేయడానికి విదేశీ మారకద్రవ్యం ఉండదు.
ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువైనందున విదేశీ మారకద్రవ్యం రావడంలేదు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం మూలంగా ప్రవాస భారతీయులు స్వదేశానికి డబ్బు పంపడం కూడా తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు, విదేశీ అప్పుల ద్వారా వచ్చే నిధులపైనే విదేశీ మారకద్రవ్యానికి ఆధారపడాల్సి ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వస్తే మారక నిల్వలు కొంత నిలకడగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ పెట్టుబడి నిష్పత్తి విదేశాల నుంచి వచ్చే మొత్తం పెట్టుబడిలో రోజురోజుకు తగ్గిపోతున్నది. మొత్తం విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిలో ప్రత్యక్ష పెట్టుబడి వాటా 35 శాతం మాత్రమే. మిగతాదంతా నిలకడలేని స్వల్ప కాల పెట్టుబడి మాత్రమే. ఈ పెట్టుబడి ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పలాయనం చిత్తగిస్తుంది.
విదేశీ అప్పు దేశ స్థూల ఉత్పత్తిలో 2011 మార్చిలో 17.5 శాతం ఉంటే 2013 మార్చి నాటికి 21.2 శాతానికి పెరిగింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో స్వల్పకాలిక అప్పులు, వ్యాపార రుణాల నిష్పత్తి 2012 మార్చిలో 42 శాతం ఉంటే 2013 మార్చి నాటికి 59 శాతానికి పెరిగింది. ప్రస్తుతం స్వల్పకాలిక అప్పులు 17,000 కోట్ల డాలర్లుగా ఉన్నది. ఈ అప్పులను ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉండడంతో మారకద్రవ్య నిల్వలు స్థిరంగా ఉండవు. స్వల్పకాల విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, విదేశీ అప్పుల వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి రావడం వేగంగా తరిగిపోతాయి. కరెంటు ఖాతా లోటును పూడ్చుకోవాల్సి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురవుతుంది. ఇప్పుడు జరుగుతున్నదదే.
ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా 1991 నుంచి అమలైన సరళీకరణ సంస్కరణలే ఇప్పటి సంక్షోభానికి కారణం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని రాయితీలను ఇవ్వడానికి సరళం చేయడానికి సిద్ధమవుతున్నది. స్వల్పకాలిక విదేశీ పెట్టుబడులపై మూలధన లాభాలపై పన్నును(క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌)ను రద్దు చేయడానికి, రియల్‌ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నది. దిగుమతులను విచ్ఛలవిడిగా ప్రోత్సహించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అనేక దేశాలతో చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను, స్వదేశీ గుత్త సంస్థలను సంతృప్తి పరిచే విధానాలను విడనాడి పెట్టుబడి పలాయనం కాకుండా, అనవసర దిగుమతులు పెరగకుండా సరైన ఆంక్షలను విధిస్తే ప్రస్తుత పరిస్థితిని అధిగమించవచ్చు. అలాగే ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడుతున్న బొగ్గు, రసాయనిక ఎరువులు, వంటనూనెల దేశవాళీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. బంగారం, విలాస వస్తువుల దిగుమతులపై గట్టి నియంత్రణలను పెట్టాలి. భారీగా దిగుమతులు చేసుకోవాల్సిన ముడి చమురును చౌకగా సరఫరా చేసే వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇంధనం దిగుమతి చేసుకునే ఈ దేశాలకు మన ఎగుమతులను కూడా పెంచడం ద్వారా మారకద్రవ్య చెల్లింపులను పరిమితం చేసుకోవచ్చు. విదేశీ పెట్టుబడులకు, స్వదేశీ గుత్త సంస్థలకు ఇష్టం లేని ఈ చర్యలు దేశానికి మాత్రం ఎంతో ఉపయోగం. కానీ మన దేశ పాలకులు దేశ ప్రయోజనాలు, ప్రజల క్షేమం కన్నా విదేశీ పెట్టుబడి, సంపన్న వర్గాల విలాస జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడాన్ని విరమించుకుంటేనే ప్రస్తుత పరిస్థితికి శాశ్వత పరిష్కారం. లేకపోతే పదేపదే ఇటువంటి సంక్షోభాలు తప్పవు. 
                                                                                                -బివి రాఘవులు(ప్రజాశక్తి 7.9.2013)

No comments:

Post a Comment