Saturday, February 1, 2014

బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ ల పునరుద్ధరణ పై మంత్రివర్గ ఉపసంఘం 31.1.2014 న చేసిన నిర్ణయాలు; గురజాడ సూక్తి

బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ ల పునరుద్ధరణ పై మంత్రివర్గ ఉపసంఘం 31.1.2014 న చేసిన నిర్ణయాలు
1.      ఉద్యోగుల వేతనాల చెల్లింపుకై అప్పు ఇచ్చేందుకు నిర్ణయం
నష్టాలలో వున్న బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లకు  డి ఓ టి నుండి వచ్చిన సిబ్బంది వేతనాల పై అయ్యే ఖర్చును భరించేందుకు కొంత అప్పు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం  నిర్ణయించింది. డి ఓ టి ఈ విషయములో పంపిన ప్రతిపాదన పై మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. బి ఎస్ ఎన్ ఎల్ కు 2013-14 లో ఉద్యోగుల జీతభాత్యాలపై ఖర్చు రు.14000 కావచ్చునని అంచనా. అప్పు ఎంత ఇస్తారు అనే ప్రశ్నకు డి ఓ టి సెక్రెటరీ  ఫరూకీ, ఉద్యోగులలో ఒక పరిమిత సంఖ్యను తీసుకుని దాని ఆధారముగా ఈ లెక్క తయారు చేస్తామని అన్నారు.  బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రభుత్వము సుమారు రు.  8500 కోట్లు అప్పు ఇచ్చే అవకాశం వుంది. అయితే ఇది ఒకే సారి ఇవ్వటం జరగదు.  10 సంవత్సరాలలో వాయిదాల పద్ధతిలో ఈ అప్పు ఇస్తారు. దీనిపై వడ్డీ 1 శాతం. ఎం టి ఎన్ ఎల్ కు రు.1000 కోట్లు రుణం ఇచ్చే అవకాశం వుంది. మొదటి సంవత్సరం బి ఎస్ ఎన్ ఎల్ కు రు.2000 కోట్లు, ఏం టి ఎన్ ఎల్ కు రు.390 కోట్లు రుణం ఇచ్చే అవకాశం వున్నది. పది సంవత్సరాల తరువాత ఈ రుణాన్ని చెల్లించటం ప్రారంభించాలి.
2.    టవర్స్ ను  విడగొట్టి ఒక కంపెనీగా ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయముగా అంగీకారం
బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ ను బి ఎస్ ఎన్ ఎల్ నుండి విడగొట్టి దానికి అనుబంధముగా వుండే ఒక టవర్సు కంపెనీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వున్నది.  బి ఎస్ ఎన్ ఎల్ కు మొత్తం 61622 టవర్సు వున్నాయి. ఈ టవర్స్ ను  ఈ విధముగా మరో కంపెనీ కి బదిలీ చేస్తే ఆ టవర్స్ తో పాటు సుమారు 3000 మంది బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు కూడా కొత్త కంపెనీకి వెళ్ళాల్సి వుంటుంది.  ఈ టవర్స్ కంపెనీలో ఈ విధముగా బి ఎస్ ఎన్ ఎల్ నుండి విలీనమయ్యే ఉద్యోగులకు పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎవరు చెల్లించాలి? బి ఎస్ ఎన్ ఎల్ చెల్లిస్తుందా లేక టవర్ కంపెనీ చెల్లిస్తుందా? ఈ సమస్యని పెన్షన్ డిపార్టుమెంటు లేవనెత్తింది. దీని పరిశీలించి పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని డి ఓ టి అంటున్నది.
మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఈ టవర్సు కంపెనీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారించింది. ఈ ఉప కంపెనీ ఏర్పాటుకు ప్రణాళికను తయారు చేస్తున్నామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు.
3.      ఖాళీ స్థలాలను సొమ్ము చేసుకునే విషయం
బి ఎస్ ఎన్ ఎల్ తనకి 82 చోట్ల వున్న స్థలాలను సొమ్ము చేసుకోటానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించి అది ప్రతిపాదించిన ప్రణాళికను అమలు చేస్తే కనీసం రు.13500 కోట్లు వస్తాయని అంచనా. ఈ 82 లో 10 చోట్ల పైలట్ పథకాలు ప్రతిపాదించింది. ఇందులో 5 పథకాలకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతి కోరుతున్నది. ఈ 5 పథకాల వివరాలు-(1) బోరివాలి ముంబయి లో 37 ఎకరాలు గృహ నిర్మాణానికి, (2) శాంతాక్రూజ్ ముంబయి లో 6.63 ఎకరాలు నాలెడ్జ్ పార్క్ కు (3) దేవ్ నార్ ముంబయి లో 25.5 ఎకరాలు గృహ నిర్మాణానికి (4) నోయిడా సెక్టార్ 33 లో 1.48 ఎకరాలు ఆఫీస్ కాంప్లెక్స్ కు (5) నోయిడా సెక్టార్ 18 లో 0.84 ఎకరాలు ఆఫీస్ కాంప్లెక్స్ కు. ఈ ఆస్తులను డెవలప్మెంట్ కోసం ప్రయివేట్ కంపెనీలకు వేలం లో అమ్మాలని, ఈ వేలం బి ఎస్ ఎన్ ఎల్ బోర్డ్ పర్యవేక్షణలో జరగాలనీ ప్రతిపాదించింది. ఈ 5 స్థలాలనుండి రు. 3500 కోట్లు వస్తుందని బి ఎస్ ఎన్ ఎల్ అంచనా. గతం లో బి ఎస్ ఎన్ ఎల్ పై నియమించబడిన శ్యామ్ పిట్రోడా కమిటీ బి ఎస్ ఎన్ ఎల్ వద్దనున్న ఖాళీ స్థలాల డెవలప్మెంటు కు,  ఖాళీగా వున్న క్వార్టర్సు వినియోగానికి  ఒక ఉప కంపెనీని  బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్సింది.  అయితే ఈ ఉప కంపెనీ ఏర్పాటుకు సమయం పడుతుందని, కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు తక్షణమే నిధుల అవసరం వున్నదని డి ఓ టి అభిప్రాయం. తనకి వున్న ఖాళీ స్థలాలని ఏ విధముగా సొమ్ము చేసుకోవచ్చో తెలియజేసేందుకు వొయంట్స్ సోల్యూషన్స్  లిమిటెడ్ అనే కన్సల్టెన్సీని బి ఎస్ ఎన్ ఎల్ నియమించింది.
రియల్ ఎస్టేట్ కార్యక్రమం ద్వారా సమీప భవిష్యత్తు లో రు.150-200 కోట్లు, దీర్ఘ కాలం లో రు.300-400 కోట్లు వస్తాయని ఎం టి ఎన్ ఎల్ అంచనా.
అయితే ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
4.      వి ఆర్ ఎస్
లక్ష మండి ఉద్యోగులకు వి ఆర్ ఎస్ ఇవ్వాలంటే రు. 12000 కోట్లు భారీ మొత్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రతిపాదనని పక్కకి పెట్టటం జరిగింది.
గత నాలుగు సంవత్సరాలుగా బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు నష్టాలలో వున్నాయి. 2017-18 నాటికి నష్టాలను అధిగమించి లాభం పొందే స్థితికి వస్తాయని ఈ రెండు కంపెనీలూ అంటున్నాయి.
ఇంతకు ముందు ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు బి డబ్ల్యూ ఎ స్పెక్ట్రమ్ వాపసు ఇచ్చినందుకు అది చెల్లించిన రు.6700 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు పది సంవత్సరాలలో రు.8500 కోట్లు రుణం ఇస్తానంటున్నది. కానీ ఇది చాలా స్వల్ప ఉపశమనం మాత్రమే. 2012-2017 మధ్య కాలములో మొత్తం రు.40000 పెట్టుబడి పెట్టి నెట్ వర్క్ విస్తరణ, ఆధునికీకరణ చేస్తే 2017-18 నాటికి బి ఎస్ ఎన్ ఎల్ కు లాభం వచ్చే పరిస్తితి ఏర్పడుతుందని గతం లో బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వము ఉచితముగా ఇచ్చిందేమీ లేదు. బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ కోసం బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించిన సొమ్మునే ఆ స్పెక్ట్రమ్ ను వాపసు తీసుకుని ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు తిరిగి ఇస్తున్నది. ఇప్పుడు చెపుతున్న రు. 8500 కోట్లు ఉద్యోగుల వేతనాల ఖర్చు భరించేందుకు ఇస్తున్న అప్పు. అది కూడా వాయిదాల పద్ధతిలో 10 సంవత్సరాలలో ఇస్తారు. టవర్సును విడగొట్టి విడిగా ఒక కంపెనీగా రూపొందించటంలో ఉద్దేశం కంపెనీని ముక్కలు చేసి డిజిన్వేస్టుమెంటు చేసేందుకే.
బి ఎస్ ఎన్ ఎల్ అనేక సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నది. ప్రయివేటు కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య స్వల్పం కాగా బి ఎస్ ఎన్ ఎల్ లో డి ఓటి నుండి వచ్చిన ఉద్యోగులు 2.5 లక్షలమంది వున్నారు. ఆ విధముగా అది ఉద్యోగావకాశాలు కల్పించి సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నది. అది నష్టాలు భరించి ల్యాండ్ లైన్స్ ను నిర్వహించి దాని ద్వారా దేశ వ్యాపితంగా  నాణ్యమయిన బ్రాడ్బ్యాండ్ సర్వీసులిచ్చి విజ్ఞాన వ్యాప్తికి ప్రజల అవసరాలు తీర్చటానికి కృషి చేస్తున్నది. దేశ భద్రత రీత్యా కొన్ని విదేశీ కంపెనీల నుండి జి ఎస్ ఎం ఎక్విప్మెంటు కొననీయకుండా ప్రభుత్వము గతములో బి ఎస్ ఎన్ ఎల్ పై ఆంక్షలు విధించినందున అది మొబైల్ సర్వీసుల రంగం లో ప్రయివేట్ కంపెనీలతో పోలిస్తే వెనకబడింది. ఇటువంటి ఆంక్షలను ప్రభుత్వము ప్రయివేటు కంపెనీలపై విధించలేదు. కాబట్టి అతి ముఖ్యమయిన సామాజిక బాధ్యతలను నిర్వహించేందుకు నష్టాలను ఎదుర్కొంటున్న బి ఎస్ ఎన్ ఎల్ కు ఇటువంటి స్వల్ప ఉపశమనాలతో సరిపుచ్చకుండా ప్రభుత్వము ప్రతి సంవత్సరమూ బి ఎస్ ఎన్ ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై వస్తున్న నష్టానికి పూర్తి పరిహారాన్ని ఇవ్వాలి( ఈ నష్టం సుమారు రు 8000 కోట్లు వుంటుంది). ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపూ చేయకుండా ఇపుడు తన వద్ద వున్న స్పెక్ట్రమ్ ను ఉపయోగించి 4 జీసర్వీసులు ఇచ్చేందుకు, మిగులు స్పెక్ట్రమ్ ను ట్రేడ్ చేసేందుకూ ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ ను అనుమతించాలి.ఎక్విప్మెంటు కొనుగోలు విషయములో ప్రయివేటు కంపెనీలపై లేని ఆంక్షలను బి ఎస్ ఎన్ ఎల్ పై విధించరాదు.
గురజాడ సూక్తి
“మతము లన్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబు లన్నవి
యవని విలసిల్లున్”





No comments:

Post a Comment