Wednesday, February 26, 2014

రాష్ట్ర విభ‌జ‌న‌-వామ‌ప‌క్ష ఉధ్య‌మ భ‌విష్య‌త్తు‌


త్వరలో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో గత 60 ఏళ్ళ వర్తమాన భారతదేశ చరిత్రలో మరో నూతనాధ్యాయం ప్రారంభం కానుంది. ఇదొక వాస్తవం. ఇప్పటి వరకు సమైక్యాంధ్రప్రదేశ్ అన్నా లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండు చేసినా అదంతా గడిచిన అధ్యాయం. విడివిడి రాష్ట్రాల్లో ప్రజల బాగోగులు, సమస్యలు, విధానాలు, రాజకీయాలు, ఉద్యమాలు ఎలా ఉండాలో నిర్దేశించుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, ప్రజా ఉద్యమాలపై ఉంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న భావన తెలంగాణా ప్రజల్లో బలంగా నాటుకుంది. టిఆర్యస్ దాన్ని అందిపుచ్చుకుంది. సిపిఐ(యం) మినహా మిగతా వామపక్షాలతో సహా అన్ని పార్టీలూ దీన్ని బలపరుస్తూ వచ్చాయి. తెలంగాణ ప్రజలతో ఘర్షణ పడకుండా తమ విధానాన్ని నచ్చజెప్పుకునే వైఖరిని సిపిఐ(యం) చేపట్టింది. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలా లేక విడిపోవాలా అనే అజెండాను ప్రధానం చేయకుండా ప్రజలెదుర్కొనే రోజువారీ సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల చేతిని వదిలిపెట్టకుండా ప్రయాణించింది. ఏ చిన్న అవకాశం దొరికినా సిపిఐ(యం)ను ఒంటరి చేసి దెబ్బకొట్టాలనుకునే శక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రజలతో మమేకమవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈ కృషిలో చాలా వరకు జయప్రదమైంది. అదే సమయంలో అవకాశవాదానికి తావివ్వకుండా, తన జాతీయ విధానాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించింది. తెలంగాణలో పార్టీ, ప్రజా ఉద్యమాలు ఎంతో చైతన్యంతో కొన్ని చోట్ల నిర్బంధాన్ని, ఒంటరితనాన్ని కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాయి. తెలంగాణ శ్రామిక ప్రజలు తమ అనుభవం ద్వారా సిపిఐ(యం), తదితర వామపక్షాల అవసరాన్ని గుర్తించారు. ఫలితంగా గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సిపిఐ(యం)ను వదిలిపెట్టకుండా ఆదరించారు.
సిపిఐ(యం) సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం గట్టిగా నిలబడింది. విభజన సానుకూలత ప్రకటించిన పార్టీలు సమైక్యత కోసం సీమాంద్ర ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను ఉపయోగించుకునేందుకు అవకాశవాదంగా వ్యవహరించాయి. పార్టీలతో కలసి ఆందోళనలు నిర్వహించలేదు. ఇతర పార్టీల్లాగా సమైక్యతను ఒక ప్రాంతీయ సమస్యగా సిపిఐ(యం) చూడలేదు. దాన్నొక జాతీయ విధానంగా భావించింది. ఇతర పార్టీలు అవకాశవాదంతో ప్రాంతానికొక మాట చెబుతూ ప్రజల్ని మోసం చేస్తుండగా, సిపిఐ(యం) ఈ పార్టీల నుంచి విడగొట్టుకొని స్వతంత్రంగా నిలబడింది. అదే సమయంలో ఇరు ప్రాంతాల్లోనూ ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడింది. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడకుండా ఉభయ ప్రాంతాల ప్రజలు కలసిమెలసి ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ విషయంలో సీమాంధ్రలో కూడా సిపిఐ(యం) తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నది. ఇక్కడ కూడా కొన్ని శక్తులు సిపిఐ(యం)ను ఒంటరి చేసి దెబ్బకొట్టాలన్న దుర్బుద్ధితో తప్పుడు ప్రచారం చేశాయి. పేరుకు సమైక్య జపం చేస్తూ ఆచరణలో ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకించకుండా మౌనం దాల్చిందని దుష్ప్రచారం చేశాయి. ఆఖరి నిముషంలో తెలంగాణపై గోడ మీద పిల్లివాటం తీసుకున్న బిజెపి కూడా సిపిఐ(యం)పై విమర్శలు చేసింది. అవకాశవాదులతో చేయి కలిపి బూర్జువా పార్టీల దుర్మార్గపు ఎత్తుగడలకు తోడ్పడకపోవడమే సిపిఐ(యం) చేసిన పాపం. పార్లమెంటు ఉభయ సభల్లో మిగిలిన పార్టీల మోసపూరిత అవకాశవాద వైఖరి బట్టబయలైంది. సిపిఐ(యం) నిబద్ధత వెల్లడైంది. ఈ రెండు వైఖరుల మధ్య తేడాను ప్రజలు కూడా గుర్తించారు. సిపిఐ(యం) శ్రామిక ప్రజల ఐక్యత దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాలు చీలకూడదన్న సూత్రబద్ధమైన వైఖరిని తీసుకుంది. దీనికి భిన్నంగా మిగతా పార్టీలు ప్రజల మనోభావాలను తమ రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాయి. కొంతమంది నాయకులు హైదరాబాద్ కోసం, తమ స్వంత పెట్టుబడుల రక్షణ కోసం, పదవుల కోసం పాకులాడారు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైన వైఖరులు. ఇలా రెండు ప్రాంతాల్లోనూ సిపిఐ(యం) విశిష్టత వెల్లడైంది. శ్రామిక వర్గ దృక్పథంతో తీసుకున్న సూత్రబద్ధ వైఖరికిది నిదర్శనం.
గత నాలుగేళ్ళలో ప్రజా సమస్యలు అడుగున పడ్డాయి. ప్రజలపై రకరకాల భారాలు పడుతున్నా ఎవరూ గళమెత్తలేదు. ఈ గందరగోళం మధ్య పాలకులు ఇష్టానుసారం భారాలు మోపారు. శాసనసభల్లో ప్రజల ప్రస్తావన లేదు. ఇరు ప్రాంతాల నాయకులు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడానికే సరిపోయింది. రోజుల తరబడి సమావేశాలు జరగలేదు. ప్రభుత్వం పాలన లేదు. ప్రజల మానాన ప్రజల్ని వదిలేసింది. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఇలా వివిధ వర్గాలు, తరగతుల ప్రజానీకం దిక్కులేనివారయ్యారు. ఈ పరిస్థితులలో వారి తరపున నిలబడింది సిపిఐ(యం). ఆఖరికి రాష్ట్ర విభజన జరుగుతున్న రోజుల్లో కూడా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించింది. మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఇలా అనేక తరగతుల ప్రజలు తమ తమ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తే వారికి సంఘీభావంగా సిపిఐ(యం) నిలబడి ఒక శ్రామికవర్గ పార్టీగా తన బాధ్యతలను నిర్వహించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయమయ్యింది. ఒక ప్రాంతం ప్రజలు సంతోషంగా ఉంటే మరో ప్రాంతం ప్రజలు గాయపడి ఉన్నారు. విభజన ద్వారా నష్టపోయామన్న భావన సీమాంధ్ర ప్రజల్లో బలంగా నాటుకుంది. రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో సైతం సమస్యలు పరిష్కారమైనట్లు భావించలేం. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కొన్ని కొత్త సమస్యలు ఉద్భవించే అవకాశం ఉంది. పంపకాల దగ్గర ఉద్రేకాలొస్తాయి. ఇరు ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం వీటిని మరింతగా రెచ్చగొడుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్యే కాదు ఆయా ప్రాంతాల్లో అంతర్గతంగా కూడా వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే సీమాంధ్ర రాజధాని పేరుతో సరికొత్త వివాదానికి తెరలేచింది. ప్రజలు అప్రమతతో ఉండి వీరి బుట్టలో పడకుండా జాగ్రత్త వహించాలి. ప్రజల మధ్య తిరిగి విద్వేషాలు రగలకుండా చూడాల్సిన బాధ్యత వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమంపై ఉంది.
రెండు రాష్ట్రాల ఏర్పాటుతో నూతన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా వామపక్ష ఉద్యమం కొత్త సవాళ్లను ఎదుర్కోనుంది. తెలంగాణలో ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని బలపడాలని బిజెపి, ఇతర మతోన్మాద శక్తులు ఉవ్విళ్లూరుతున్నాయి. టిఆర్యస్, కాంగ్రెసులు విలీనమైనా, పొత్తు పెట్టుకున్నా దానికి ప్రత్యామ్నాయంగా తామే ముందుకు రావాలని సంఘపరివారం వ్యూహంగా ఉంది. టిడిపి ఈ శక్తులతో పొత్తుకు ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశం అనుసరించిన అవకాశవాద వైఖరి మూలంగా రెండు ప్రాంతాల్లోనూ దాని విశ్వసనీయత దెబ్బతిన్నది. ఆ రీత్యా తెలంగాణలో బిజెపి అవసరం టిడిపికి ఉంది. బిజెపి ఆడిన నాటకం వల్ల సీమాంధ్రలో వారిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్నుంచి బయటపడటానికి తెలుగుదేశంతో పొత్తు కోరుకుంటోంది. ఆ రీత్యా రెండు ప్రాంతాల్లోనూ టిడిపి, బిజెపిల బంధం కొనసాగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని బిజెపి తనకనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. మతోన్మాదానికి తోడుగా మోడీ పేరుతో వెనుకబడిన తరగతులను జోడించి బలపడాలని చూస్తోంది. ఈ తరగతులలో తన ఉనికి దెబ్బతినకుండా చూసుకోవడానికి బిజెపితో చెలిమి చేయాలని తెలుగుదేశం అనుకుంటోంది. ఇది తక్షణం కొన్ని ఫలితాలనిచ్చినా దీర్ఘకాలంలో అది తెలుగుదేశం పాలిట మరణశాసనంగా మారుతుంది. తెలంగాణలో బిజెపిని చూపెట్టి ముస్లిం ఛాందస సంస్థలు కూడా బలపడే అవకాశాలున్నాయి. ప్రత్యేక తెలంగాణ నిజాం వారసురాలని అదే పనిగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు ప్రమాదాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న కొందరు అభ్యుదయవాదులు, సంస్థలు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తక్షణం ఉద్యోగాలు దొరుకుతాయన్న భ్రమల్లో తెలంగాణా నిరుద్యోగ యువత ఉంది. రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు పెరక్కుంటే తద్వారా వచ్చే అసంతృప్తి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఊహించడం కష్టమేమీ కాదు. వామపక్షాలు బలపడితేనే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోగవడం సాధ్యమన్న వాస్తవాన్ని అభ్యుదయశక్తులు గుర్తించాలి.
అలాగే సీమాంధ్రలో కొత్తగా కుల సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. అగ్రకులాలకు చెందిన ఆధిపత్యవర్గాలు తమ ప్రభావాన్ని కాపాడుకోవడానికి వివిధ పార్టీల వెనుక సమీకృతమవుతున్నాయి. కొన్ని పార్టీలు తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి కుల సమీకరణలను రెచ్చగొడుతున్నాయి. నాయకులటూ, ఇటూ జంప్ చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీతో పోతారో అస్పష్టంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తన అనుచరులను పోగేసుకుని కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెసు దాదాపు తుడిచిపెట్టుకొని పోయిందని వివిధ సర్వేల సమాచారం. ఆయా పార్టీలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి దళిత, గిరిజన, బలహీనవర్గాలను కూడా చీలుస్తున్నాయి. అదే ప్రజా ఉద్యమాల ప్రగతికి ప్రతిబంధకంగా మారుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదో ఒక మోతాదులో ప్రభావం చూపిన సామాజిక అస్తిత్వ ఉద్యమాలు ప్రాంతీయోద్యమాలతో మమేకమై అగ్రకులాధిపత్యానికి తోడ్పడ్డాయి. వారిలో ఉన్న ప్రజాస్వామిక శక్తుల ప్రాబల్యం తగ్గుతోంది. ప్రభుత్వాలు, పాలకపక్షాల అండతో ఎదగాలన్న శక్తులు పుంజుకుంటున్నాయి. ఇది సామాజికోద్యమాలను బలహీనపరిచే ప్రక్రియ. ఈ మూలమలుపులో సామాజికోద్యమాలు ఎవరితో చేరాలి? పాలకవర్గాలతోనా? లేక వామపక్ష, ప్రజాతంత్రశక్తులతోనా? ప్రభుత్వాల అండ లేకుండా ముందుకు పోలేమన్న భావన కొందరిలో ఉంది. ఈ తరహా ఆలోచన సామాజికోద్యమాలను బలహీనపరుస్తుంది. తక్షణ ఎన్నికల ఎత్తుగడలతో నిమిత్తం లేకుండా అస్తిత్వ ఉద్యమాలు వామపక్షాలతో కలసి పని చేస్తే ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో కూడా ప్రజాతంత్ర ఉద్యమం బలపడుతుంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాల సమస్య పరిష్కారమైనట్లు కాదు. రెండు రాష్ట్రాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. రానున్న ఎన్నికల్లో పాలక పార్టీలు ఎవరు గెలిచినా ఈ అసమానతలు పెరుగుతాయే తప్ప తగ్గవు. వాటికి తోడు ఆర్థిక, సామాజిక అసమానతలు ఉండనే ఉన్నాయి. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలను కొనసాగించడమే వామపక్షాల ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వామపక్ష పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో వాటికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటానికి, సీమాంధ్రలో జమీందారీ వ్యతిరేక పోరాటాలకు వారసురాలైన కమ్యూనిస్టు ఉద్యమానికి మాత్రమే ఈ ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై పోరాడే చిత్తశుద్ధి ఉంది. దానికి తగిన ప్రణాళికలున్నాయి. ప్రజల్లో విశ్వసనీయత ఉన్న పార్టీలు కూడా ఇవే. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఐక్య ఉద్యమ కార్యాచరణతోనే రెండు రాష్ట్రాల్లో కుల, మత, విచ్ఛిన్నకర శక్తులు బలపడకుండా పురోగమించగల్గుతాయి. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు, వివిధ తరగతుల సామాజిక ఉద్యమాలు ఏకతాటిపైకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. ఇది మాత్రమే రెండు రాష్ట్రాల్లోని ప్రజల ఐక్యతకు, వారి భవిష్యత్తుకు హామీ ఇవ్వగలుగుతుంది. అందుకోసం రెండు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత వామపక్ష శక్తులు, పార్టీలపై ఉంది.
(వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు) 
వి శ్రీనివాసరావు

No comments:

Post a Comment